Maha Medaram Jatara: మహా మేడారం జాతరను సమన్వయంతో విజయవంతం చేద్దాం: జిల్లా ఎస్పీ సుధీర్ రామనాథ్ కేకన్
ములుగు, స్వేచ్ఛ: వచ్చే సంవత్సరం జనవరి 28 నుంచి 31 వరకు జరగనున్న మహా మేడారం జాతరను (Maha Medaram Jatara) పాత్రికేయులు, పోలీస్ సిబ్బంది, జిల్లా యంత్రాంగంతో కలసి సమన్వయంగా విజయవంతం చేద్దామని ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ (Sudheer Ramanath Kekan) పిలుపునిచ్చారు. గత జాతర సందర్భంగా జరిగిన ఘటనలు పునరావృతం కాకుండా, ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకుని అందరితో కలిసి ముందుకు సాగుతున్నామని అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో పాత్రికేయులతో సమన్వయ కమిటీ సమావేశంలో ఓఎస్డీ శివం ఉపాధ్యాయ, డీఎస్పీ రవీందర్లతో కలిసి ఎస్పీ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆర్ కేకన్ మాట్లాడుతూ, రానున్న మహా జాతరకు కోటి 50 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవడానికి పదివేల మంది పోలీస్ సిబ్బంది నియమిస్తున్నామని వెల్లడించారు. మేడారంలోని అమ్మవార్ల గద్దెల వద్ద మాస్టర్ ప్లాన్తో పనులు కొనసాగుతున్నాయని వివరించారు. జాతర సందర్భంగా అమ్మవార్లను దర్శించుకోవడానికి అందరికీ ఒకే నిబంధనలు ఉంటాయని క్లారిటీ ఇచ్చారు. ఎలాంటి సంఘటనలు జరగకుండా ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకుందామని తెలిపారు. గతంలో రెండు జాతరల సందర్భంగా పనిచేసిన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని అధికారులకు దిశా నిర్దేశం చేస్తున్నానని, భక్తులకు ఇబ్బంది కలగకుండా అమ్మవార్లను దర్శించుకోవడానికి గతంలో ఉన్న క్యూలైన్లకు అదనంగా మరో ఐదు క్యూలైన్లను ఏర్పాటు చేయబోతున్నామని వివరించారు.
Read Also- Tremors in Vikarabad: వికారాబాద్ జిల్లాలో భూప్రకంపనలు.. ఆందోళనకు గురైన జనం
8 క్యూలైన్ల ద్వారా భక్తులను అమ్మవార్ల దర్శనం కోసం అనుమతించి 3 గేట్ల ద్వారా బయటికి పంపిస్తామని సుధీర్ రామ్నాథ్ కేకన్ చెప్పారు. జిల్లా పోలీసు యంత్రాంగం తీసుకునే నిర్ణయాలకు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని కోరారు. జాతర సందర్భంగా ట్రాఫిక్ సమస్య ఏర్పడకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయబోతున్నామని, ప్రత్యేక నినాదంతో రోడ్డు ప్రమాదాలు జరగకుండా భక్తులకు వివరించడం జరుగుతుందని అన్నారు. జాతర సందర్భంగా ఇతర సమయాలలో పలు రకాల వాహనాలు వేగంగా వెళ్లకుండా చర్యలు తీసుకోవడంతో పాటు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ములుగు జిల్లాలో గంజాయి అమ్మకాలు జరగకుండా నిఘా ఏర్పాటు చేయబోతున్నామని, చెడు వ్యసనాలపై యువకులకు అవగాహన కలిగించడానికి కళా బృందాలచే అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తామని అన్నారు.
అక్రమంగా ఇసుక, ఎర్ర మట్టి, ఇతర వస్తువులను అక్రమంగా రవాణా చేస్తే కేసులు నమోదు చేస్తామని సుధీర్ రామ్నాథ్ కేకన్ హెచ్చరించారు. పలు రకాల పశువులు జాతీయ రహదారిపై రాకుండా వాటికి సంబంధించిన యజమానులకు ముందు సమాచారం అందించి, వినని పక్షంలో పశువులను గోశాలకు తరలిస్తామని చెప్పారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు ములుగు జిల్లాలో పలు రకాల పనులు చేయడానికి వచ్చిన సందర్భంలో వారి వివరాలను పూర్తిగా సేకరించాలని, దీంతో పలు సంఘటనలు చోటు చేసుకోకుండా అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. మేడారం జాతర సందర్భంగా పాత్రికేయులు ఎలాంటి ఇబ్బందులు గురికాకుండా ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేయడంతో పాటు వారికి గుర్తింపు కార్డులు ఇవ్వడానికి ఆలోచిస్తామని, జాతర విషయంలో పాత్రికేయులు సహకరించాలని కోరారు. ఎలాంటి సంఘటనలు జరిగిన తన దృష్టి కానీ ఇతర అధికారులు దృష్టి గానీ తీసుకపోవాలని, ప్రతి విషయాన్ని భూతద్దంలో చూపించకుండా సమస్య పరిష్కారం కోసం పాత్రికేయులు సూచనలు సలహాలు ఇవ్వాలని అన్నారు.

