Sridhar Babu: చెరుకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై అధ్యయనం చేసి పరిష్కరించేందుకు ఉన్నతాధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Sridhar Babu) తెలిపారు. సచివాలయంలో శనివారం చెరుకు రైతులు, పరిశ్రమల ప్రతినిధులు, చెరుకు అభివృద్ధి మండళ్ల (సీడీసీ) ఛైర్మన్లతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణాలో ఏటా చెరుకు సాగు విస్తీర్ణం తగ్గుతున్న విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందన్నారు. రాష్ట్రంలోని చక్కెర పరిశ్రమల సమస్యలు కూడా పరిష్కరించాలన్న సంకల్పంతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారన్నారు. కమిటీ ఇతర రాష్ట్రాల్లో చెరుకు రైతులకు అందుతున్న ప్రయోజనాలు, రాయితీలపై అధ్యయనం చేసి సాధ్యమైనంత త్వరలో నివేదిక అందిస్తుందని తెలిపారు. రూ.500 బోనస్ ను చెరుకు పంటకు కూడా వర్తింపచేయాలని రైతులు కోరుతున్న విషయం సీఎం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు.
Also Read: Sridhar Babu: ఏఐతో పోయే ఉద్యోగాల కంటే వచ్చేవే ఎక్కువ.. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్
చెరుకు పంటకు కొనసాగించాలి
చెరుకు హార్వెస్టర్ యంత్రాలపై గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం 50 శాతం సబ్సిడీని ఇవ్వగా ఆ తర్వాత వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ రాయితీని తొలగించిందన్నారు. కూలీల సమస్యతో చెరుకు నరకడం రైతులకు సమస్యగా మారిందని అన్నారు. డ్రిప్ ఇరిగేషన్ రాయితీని చెరుకు పంటకు కొనసాగించాలని రైతులు కోరుతున్న విషయపై కూడా అధికారుల కమిటీ నివేదిక ఇస్తుందని తెలిపారు. డ్రిప్ పరికరాల వల్ల ప్రతి ఎకరానికి 8-9 టన్నుల దిగుబడి పెరుగుతుందని అధికారులు చెబ్తున్నారని అన్నారు. చెరుకు రవాణా ఛార్జీలను కొంత మేరకు భరించే అంశాన్ని కూడా కమిటీ అధ్యయనం చేస్తుందని పేర్కొన్నారు.
రంగ చక్కెర పరిశ్రమలను కాపాడుకుంటాం
తెలంగాణాలోని ప్రైవేటు రంగ చక్కెర పరిశ్రమలను కాపాడుకుంటామని హామీ ఇచ్చారు. నిజాం షుగర్స్ పునరుద్ధరణ విషయంలో వారి అనుభవాన్ని వినియోగించుకుంటామని తెలిపారు. కార్మికులు, రైతుల శ్రేయస్సుకు తమ ప్రభుత్వం అన్ని విధాలా కట్టుబడి ఉందని వివరించారు. ఏపీలో చక్కెర రికవరీ శాతం 9 శాతం ఉండగా, రాష్ట్రంలో 11 శాతం వరకు వస్తుండటం సంతోషం కలిగించే అంశమని చెప్పారు. చెరుకు విస్తీర్ణం పెరిగేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. సమావేశంలో తెలంగాణా పారిశ్రామిక మౌలిక వసతుల సంస్థ ఛైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ సంజయ్ కుమార్, చక్కెర పరిశ్రమల డైరెక్టర్ నర్సిరెడ్డి పాల్గొన్నారు.

