CM Revanth Reddy: తెలంగాణలో సన్న బియ్యం పంపిణీ పథకం విజయవంతమైందని, దేశమంతటా ఈ పథకాన్ని విస్తరించాలని కేంద్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని వివరించారు. దాంతో పీడీఎస్ బియ్యం రీ సైక్లింగ్ తగ్గిందని, బహిరంగ మార్కెట్లోనూ ధరలు స్థిరపడ్డాయని చెప్పారు. ప్రజలు తినే బియ్యాన్ని పంపిణీ చేయడంతో ఈ పథకం ఆశించిన లక్ష్యం నెరవేరిందని అన్నారు. తెలంగాణ మాదిరిగానే కేంద్ర ప్రభుత్వం కూడా దేశవ్యాప్తంగా సన్న బియ్యం పంపిణీ చేసే అంశాన్ని పటిశీలించాలని సూచించారు. దీనిపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి దేశవ్యాప్తంగా అమలుపై నిర్ణయం తీసుకుంటామని ఈ సందర్భంగా కేంద్రమంత్రి అన్నారు. గురువారం హైదరాబాద్కు వచ్చిన ప్రహ్లాద్ జోషితో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం తగిన సహకారం అందించాలని పలు అంశాలను ప్రస్తావించారు.
అన్నీ వివరించిన సీఎం
2024 – 25 రబీ సీజన్కు సంబంధించి అదనంగా 10 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ కోటా పెంచాలని రేవంత్ రెడ్డి కోరారు. పీడీఎస్ కింద సరఫరా చేసిన లెవీ రైస్కు సంబంధించిన రూ.1,468 కోట్ల సబ్సిడీ విడుదల చేయాలన్నారు. పీఎంజీకేఏవై ఐదో దశకు సంబంధించి పెండింగ్లో ఉన్న రూ.343.27 కోట్ల సబ్సిడీ విడుదల చేయాలని కోరారు. 2024 – 25 ఖరీఫ్ కస్టమ్ మిల్లింగ్ రైస్ వ్యవధి పొడిగించాలన్నారు. ఎఫ్సీఐ గోదాముల్లో నిల్వ ఇబ్బందులను అధిగమించేందుకు అదనపు బాయిల్డ్ రైస్ ర్యాక్స్ కేటాయించాలని, రాష్ట్రంలో 15 లక్షల మెట్రిక్ టన్నుల గోదాముల నిల్వ సామర్థ్యం పెంచుకునేందుకు సాయం అందించాలని కోరారు. 2025 – 26 ఖరీఫ్లో అత్యధికంగా 148 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చిందని, కొనుగోలు లక్ష్యాన్ని 80 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు.
Also Read: CM Revanth Reddy: మహిళలకు సీఎం గుడ్ న్యూస్.. అమెజాన్తో సంప్రదింపులు.. డీల్ కుదిరితే డబ్బే డబ్బు!
కేంద్రమంత్రి సానుకూల స్పందన
రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తులన్నీ సానుకూలంగా పరిశీలిస్తామని కేంద్రమంత్రి హామీ ఇచ్చారు. దేశవ్యాప్తంగా బాయిల్డ్ రైస్ అవసరం తగ్గిందని, అందువల్ల మిల్లింగ్కు అనువైన ముడి బియ్యం రకాల సాగును ప్రోత్సహించాలని సూచించారు. రాష్ట్రంలో మిగులు ధాన్యం నిల్వలను సమర్థంగా నిర్వహించేందుకు ఎగుమతి అవకాశాలను పరిశీలించాలని సలహా ఇచ్చారు. ధాన్యం సేకరణ లక్ష్యాన్ని 80 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచాలని, బాయిల్డ్ రైస్ అదనపు కోటాను కేటాయించాలని సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. రా రైస్కు అనువైన రకాల వరి సాగును ప్రోత్సహించేందుకు రైతులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపడతామన్నారు. హోటల్ తాజ్ కృష్ణాలో జరిగిన ఈ సమావేశంలో సీఎస్ రామకృష్ణారావు, సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి, సివిల్ సప్లయిస్ ప్రిన్సిపల్ సెక్రెటరీ స్టీఫెన్ రవీంద్రతో పాటు సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
