YS Jagan – Sunitha: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ గురువారం నాంపల్లి సీబీఐ కోర్టు ఎదుట హాజరైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కోర్టు ఆవరణలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. తన తండ్రి వివేక హత్యకు సంబంధించి జగన్ పై ఆరోపణలు చేస్తున్న సునీత సైతం అదే సమయంలో నాంపల్లి కోర్టుకు వచ్చారు. ఓ దశలో జగన్, సునీత ఒకరికొకరు ఎదురుసైతం పడ్డారు.
సునీతను పట్టించుకోని జగన్..
వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగించే పిటిషన్పై వాదనలు జరుగుతున్న నేపథ్యంలో సునీత నాంపల్లి కోర్టుకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అక్రమ ఆస్తుల కేసుకు సంబంధించి ఆరేళ్ల తర్వాత జగన్ సైతం కోర్టుకు వచ్చారు. అయితే కోర్టులో సునీత ఎదురుపడినప్పటికీ జగన్ పట్టించుకోలేదని సమాచారం. సునీతను పలకరించకుండా జగన్ వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. అయితే వివేక హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి (Avinash Reddy)కి జగన్ అండగా నిలుస్తున్నారని సునీత ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్ సోదరి షర్మిల సైతం ఇదే అంశంపై జగన్ ను విమర్శించడం గమనార్హం.
సునీతకు భారీ భద్రత
మరోవైపు జగన్, సునీత ఒకే సమయంలో కోర్టుకు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సునీతాకు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఆమె చుట్టూ మహిళా సిబ్బందిని మోహిరించారు. కోర్టు హాల్ లో జగన్ ఉన్నంతసేపు.. మహిళా సిబ్బంది సునీత వెంటే ఉన్నారు. మరోవైపు వైఎస్ వివేకా హత్య కేసును మరింత లోతుగా దర్యాప్తు చేయాలంటూ సునీత పిటిషన్ దాఖలు చేశారు. కేసు విచారణలో భాగంగా ఆమె జగన్ కంటే ముందే కోర్టు వద్దకు వచ్చారు.
అరగంట వెయిట్ చేసిన జగన్..
ఇదిలా ఉంటే వైఎస్ జగన్.. సీబీఐ కోర్టుకు మ.11.45 నిమిషాలకు వచ్చారు. జగన్ వాహనంతో పాటు మరొక వాహనాన్ని మాత్రమే కోర్టులోకి పోలీసులు అనుమతించారు. నాల్గో అంతస్తులోని సీబీఐ కోర్టు వద్దకు వెళ్లిన జగన్.. దాదాపు అరగంట సేపు వెయిట్ చేశారు. మరో కేసులో వాదనలు జరుగుతున్న నేపథ్యంలో కోర్టు హాల్ లోనే జగన్ వేచి ఉన్నారు. మ.12:25 గం.లకు జగన్ కేసు విచారణ కు రావడంతో న్యాయమూర్తి ముందు జగన్ లేచి నిలబడ్డారు.
జగన్ ను ప్రశ్నించిన జడ్జి..
తన ముందు నిలబడి ఉన్న జగన్ కు న్యాయమూర్తి ఓ ప్రశ్న వేశారు. ‘మీరు కోర్టుకు చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా?’ అని అడిగారు. అందుకు జగన్.. ఏమి లేదని సమాధానం ఇచ్చారు. దీంతో జగన్ అప్పియరెన్స్ ను రికార్డు చేసి.. కేసు విచారణను వాయిదా వేశారు. అయితే ఈ ప్రక్రియ మెుత్తం కేవలం 3 నిమిషాల్లో ముగియడం గమనార్హం.
Also Read: Swetcha Exclusive: మావోయిస్టుల కదలికలను ముందే పసిగట్టిన స్వేచ్ఛ.. ఎప్పటికప్పుడు వరుస కథనాలు
తల్లి విజయమ్మను కలిసిన జగన్
నాంపల్లి కోర్టులో విచారణ పూర్తైన అనంతరం జగన్ నేరుగా లోటస్ పాండ్ లోని నివాసానికి వెళ్లారు. అక్కడ తల్లి విజయమ్మతో భేటి అయ్యారు. కొద్దిసేపు తల్లితో ఆప్యాయంగా మాట్లాడారు. అనంతరం తిరిగి విజయవాడకు జగన్ బయలుదేరారు.
