Minister Adluri Laxman (imagecredit:swetcha)
తెలంగాణ

Minister Adluri Laxman: చిన్న చిన్న సరదాలే జీవితాన్ని నాశనం చేస్తాయి: మంత్రి అడ్లూరి లక్ష్మణ్

Minister Adluri Laxman: తెలంగాణ రాష్టాన్ని మత్తు పదార్థాల బారి నుండి పూర్తిగా బయటపడే రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రజా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్‌జెండర్ సాధికారత శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్(Adluri Laxman Kumar) అన్నారు. డ్రగ్స్‌కు దూరంగా జీవిత లక్ష్యాలకు దగ్గరగా అనే సందేశాన్ని ప్రతి విద్యార్థి, యువకుడి వద్దకు చేరేలా సమగ్రమైన అవగాహన కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. మంగళవారం గాంధీ మెడికల్ కళాశాల స్వామి వివేకానంద ఆడిటోరియంలో తెలంగాణ రాష్ట దివ్యాంగులు వయోవృద్ధులు. ట్రాన్స్ జెండర్(Transgender) వ్యక్తుల సాధకారిత శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నషాముక్త్ భారత్ అభియాన్ 5 వ వార్షికోత్సవంలో భాగంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ యువత చదువు, ఉద్యోగ అవకాశాలు, వ్యక్తిత్వ వికాసం లో నిలబెట్టడం ప్రభుత్వ ప్రధాన బాధ్యతగా ఉందని మంత్రి అన్నారు.

భవిష్యత్తు రక్షణే సీఎం లక్ష్యం

మత్తు పదార్థాల పెరుగుతున్న దుష్ప్రభావాల నేపథ్యంలో ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు ప్రారంభించిందని అన్నారు. రాష్ట్రంలో డ్రగ్ సరఫరా మార్గాలను పూర్తిగా నిర్మూలించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన ఈగల్ స్పెషల్ యూనిట్ కీలక పాత్ర పోషిస్తోందని వివరించారు. నగరాల్లో, విద్యాసంస్థల పరిసరాల్లో, ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల్లో, డార్క్‌నెట్ ద్వారా జరిగే లావాదేవీలపై ఈగల్ టీమ్(Eagle Team) నిరంతరం నిఘా పెట్టిందని వివరించారు. రియల్ టైమ్ ఇంటెలిజెన్స్, డేటా విశ్లేషణ, వేగవంతమైన ఆపరేషన్లతో ఈ వ్యవస్థ రాష్ట్ర పోలీసింగ్ విధానాన్ని కొత్త దిశగా నడిపించిందన్నారు. డ్రగ్ మాఫియాను ఒక్కో దశలో ఛేదిస్తూ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని, నేర ప్రపంచాన్ని కట్టడి చేయాలని సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని మంత్రి వివరించారు. మత్తు వ్యసనం వ్యక్తిగత అలవాటు కాదని, ఇది కుటుంబాలను కూల్చివేసే ఒక అగ్నికీల అని మంత్రి పేర్కొన్నారు. యువత రక్షణ, తెలంగాణ భవిష్యత్తు రక్షణే సీఎం లక్ష్యమని అన్నారు. యువత కోసం ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు, కళాశాలల్లో కౌన్సెలింగ్ సేవలు, స్పోర్ట్స్, కల్చరల్ ఈవెంట్లు, డ్రగ్ ఫ్రీ క్యాంపెయిన్‌లు, మారథాన్‌లు నిర్వహిస్తూ సానుకూల వాతావరణం ఏర్పడుతోందని తెలిపారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజంలోని ప్రతి వర్గం భాగస్వామ్యం అవసరమని సూచించారు. డ్రగ్స్‌కు దూరంగా కెరీర్‌కు దగ్గరగా విజయాలకు సమీపంగా భవిష్యత్తుకు దగ్గరగా నే నినాదాన్ని విద్యార్థి జీవన సూత్రంగా తీసుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు.

Also Read: Pawan Kalyan: పైరసీ ముఠా సూత్రధారి ఇమ్మడి రవి అరెస్ట్.. పవన్ కళ్యాణ్ స్పందనిదే!

విద్యాసంస్థల్లో ప్రత్యేక క్లబ్‌లు

మాదకద్రవ్యాల నిర్మూలనలో సేవలందిస్తున్న వాలంటీర్లను మంత్రి సన్మానించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కళాకారులు ప్రదర్శించిన నాటక ప్రదర్శన, ఆటలు, పాటలు యువతలో మత్తు వ్యసనంపై అవగాహన కార్యక్రమాలు వీక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. డ్రగ్స్ కొద్ది రోజుల ‘కిక్’తో మొదలై, భవిష్యత్తును ఊహించని షాక్ లోకి నెట్టేస్తుందని, మనం చూస్తున్న కేసుల్లో అనేక మంది విద్యార్థులు అలవాటు బారిన పడి చదువు, అవకాశాలు, కుటుంబాలను కోల్పోతున్నారనీ ఆందోళన వ్యక్తం చేశారు. ఇది తెలంగాణ భవిష్యత్తు పై ఒక పెద్దముప్పుగా పరిణమించిందన్నారు. ప్రవర్తనలో మార్పులు, అర్థరాత్రి తిరగడం, కొత్త అలవాట్లు, ఇవన్నీ మత్తు వ్యసన సూచనలుగా కనిపిస్తాయని, వెంటనే కౌన్సెలింగ్‌కు తీసుకెళ్లాలని సూచించారు. విద్యాసంస్థల్లో ప్రత్యేక క్లబ్‌లు ఏర్పాటు చేసి విద్యార్థులపై నిఘా కొనసాగించాలని మంత్రి సూచించారు. మత్తు నిరోధక చర్యల్లో భాగంగా, రాష్ట్రవ్యాప్తంగా ఎన్ బీఎంఏ(NBMA) కమిటీలు ఏర్పాటు చేసి, పాఠశాలలు, కాళాశాలల్లో క్లబ్‌లు స్థాపించామని మంత్రి వివరించారు. ఇప్పటివరకు 15 వేల 891 విద్యాసంస్థల్లో 7 వేల 18 కార్యక్రమాల ద్వారా సుమారు కోటి 45 లక్షల మందికి అవగాహన కల్పించామని చెప్పారు.

త్వరలో కొత్త చికిత్సా కేంద్రాలు

ఇది దేశంలోనే అతిపెద్ద డ్రగ్స్ అవగాహన కార్యక్రమమని మంత్రి అడ్లూరి స్పష్టం చేశారు. యువత పునరావాసానికి ప్రత్యేక చర్యల భాగంగా సైదాబాద్ అబ్జర్వేషన్ హోమ్‌లో పిల్లల కోసం డీ-అడిక్షన్ సెంటర్ ఏర్పాటు చేసినట్టు, చెర్లపల్లి, నిజామాబాద్, చంచల్ గూడ, సంగారెడ్డిలో జైళ్లలో ప్రత్యేక చికిత్సా సేవలు ప్రారంభించామని వివరించారు. అలాగే, పది జిల్లాల్లో ఎన్జీఓ లతో కలిసి పునరావాస కేంద్రాలు, త్వరలో పన్నెండు జిల్లా ఆసుపత్రుల్లో కొత్త చికిత్సా కేంద్రాలు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. డ్రగ్స్ ఒకరి జీవితాన్ని నాశనం చేస్తే ప్రభావం మొత్తం కుటుంబంపై పడుతుందని, మత్తును వదిలేస్తే కొత్త జీవితం మొదలవుతుందనీ మంత్రి అడ్లూరి సూచించారు. మాదకద్రవ్య రహిత తెలంగాణ కోసం ప్రభుత్వం, సమాజం, యువత కలిసి ముందుకు సాగాలని మంత్రి పిలుపునిచ్చారు. గాంధీ మెడికల్ కాలేజీలో నిర్వహించిన డీ-అడిక్షన్ మాస్ ప్లెడ్జ్ పాల్గొన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాదకద్రవ్యాల నిరోధక 2025 ప్రతిజ్ఞను వైద్య విద్యార్థులచేత చేయించారు. ఈ కార్యక్రమంలో ఉమెన్, చైల్డ్ డిపార్ట్‌మెంట్ కార్యదర్శి అనితా రామచంద్రన్, టీజీ ఈగల్ ఫోర్స్ డైరెక్టర్ సందీప్ శాండిల్య, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి, సీనియర్ సిటిజన్, ట్రాన్స్‌జెండర్ విభాగం డైరెక్టర్ శైలజ, హైదరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీ శ్రీకాంత్, గాంధీ హాస్పిటల్ సూపరిండెంటెంట్ డాక్టర్ వాణి, గాంధీ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ ఇందిరా, యాంటీ నార్కోటిక్ బ్యూరో ఎస్పీ సీతారాం, వైద్య విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Also Read: Etela vs Bandi Sanjay: కులం మతంతో రాజకీయాలు నిలబడవు.. బండి వర్సెస్ ఈటల వార్..!

Just In

01

CM Revanth Reddy: మహిళలకు సీఎం గుడ్ న్యూస్.. అమెజాన్‌తో సంప్రదింపులు.. డీల్ కుదిరితే డబ్బే డబ్బు!

Bigg Boss Telugu 9: హౌస్‌మేట్స్‌ని ఏడిపిస్తున్న బిగ్ బాస్.. రీతూపై పవన్ ఫ్యామిలీ ప్రేమ చూశారా?

Digital Payments: భారత్ ను ఫాలో అవుతున్న పెరూ.. అక్కడ కూడా UPI తరహా చెల్లింపు వ్యవస్థ

Lava Agni 4: Demo at Home క్యాంపెయిన్ తో కొత్త ట్రెండ్ సెట్ చేయడానికి రెడీ అవుతున్న Lava Agni 4

Nagarkurnool District: ఒరేయ్ అది ఆటోనా లేక స్కూల్ బస్సా.. 23 మందిని ఇరికించేశావ్.. నీకో దండంరా దూత!