ED Probe on Al Falah: ‘ఢిల్లీ పేలుడు’ ఘటనపై దర్యాప్తు ముందుకు సాగుతున్నా కొద్దీ ఒక్కొక్క నిజం వెలుగుచూస్తోంది. ఢిల్లీలో ఆత్మహుతికి పాల్పడిన మొహమ్మద్ ఉమర్ నబీతో పాటు, ఫరీదాబాద్లో పట్టుబడిన ముగ్గురు వైద్యుల ఉగ్ర సంబంధాలపై ఆరా తీయగా, హర్యానాలోని ఫరీదాబాద్లో ఉన్న అల్ ఫలా యూనివర్సిటీ కేంద్ర బిందువుగా కనిపిస్తోంది. ఈ వర్సిటీని నెలకొల్పిన జావేద్ అహ్మద్ సిద్ధిఖీ గురించి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) ఆరా తీయగా పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఈడీ అధికారులు గురువారం నాడు సిద్ధిఖీకి డబ్బు ఎక్కడి నుంచి వస్తోంది?, బ్యాక్గ్రౌండ్ ఏంటి?, అని ఆరా తీశారు. సిద్ధిఖీ ఆర్థిక వ్యవహారాలపై కూపీ లాగగా, గతంలో మోసాలకు పాల్పడ్డట్టు బయటపడింది. మధ్యప్రదేశ్లోని మౌ పట్టణంలో పుట్టిన సిద్ధిఖీకి పెద్ద కార్పొరేట్ వ్యాపార నెట్వర్క్ ఉందని గుర్తించారు. అంతేకాదు, పాత క్రిమినల్ కేసు కూడా ఒకటి ఉందని తేల్చారు. సిద్ధిఖీతో పాటు అతడి సహచరుడిపై కూడా చీటింగ్, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, ఫేక్ డాక్యుమెంట్స్ వినియోగం, నేరపూరిత కుట్ర వంటి అభియోగాల కింద కేసులు ఉన్నాయని ఈడీ అధికారులు పసిగట్టారు.
Read Also- Mahesh Kumar Goud: ఏ క్షణమైన డీసీసీల ప్రకటన వెలువడే ఛాన్స్ : పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
మొత్తం 9 కంపెనీలు
సిద్ధిఖీకి మొత్తం 9 కంపెనీలతో సంబంధాలు ఉన్నాయి. వీటన్నింటి కార్యకలాపాలను యూనివర్సిటీ కేంద్రంగా పనిచేస్తున్న ‘అల్ – ఫలా ఛారిటబుల్ ట్రస్ట్’ ద్వారా పర్యవేక్షించేవారు. ఎడ్యుకేషన్, సాఫ్ట్వేర్, ఫైనాన్సియల్ సర్వీసెస్, ఇంధన రంగాలలో ఈ తొమ్మిది కంపెనీలు ఉన్నాయి. అతడి కంపెనీల జాబితాలో అల్-ఫలా ఇన్వెస్ట్మెంట్ తొలి కంపెనీగా ఉంది. దీనిని 1992లో స్థాపించారు. ఆ తర్వాత అల్-ఫలా మెడికల్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఇక్కడ ఉగ్రకార్యకలాపాలు), అల్-ఫలా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్, అల్-ఫలా ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఫౌండేషన్, అల్-ఫలా ఎడ్యుకేషన్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఎంజేహెచ్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్, అల్-ఫలా సాఫ్ట్వేర్ ప్రైవేట్ లిమిటెడ్, అల్-ఫలా ఎనర్జీస్ ప్రైవేట్ లిమిటెడ్, తర్బియా ఎడ్యుకేషన్ ఫౌండేషన్ మిగతా కంపెనీలుగా ఉన్నాయి. ఈ కంపెనీల్లో చాలా వరకు 2019 వరకు క్రియాశీలకంగా ఉన్నాయి. ఆ తర్వాత కొన్ని మూతపడగా, మరికొన్ని నిలిచిపోయాయి. వీటిలో అధిక కంపెనీలు ఒకే అడ్రస్తో రిజిస్టర్ చేసి ఉన్నాయి. ఢిల్లీలోని జామియా నగర్లో ఉన్న అల్-ఫలా హౌస్ను అడ్రస్గా పేర్కొన్నారు.
ఇక, సిద్ధిఖీపై ఢిల్లీలోని న్యూ ఫ్రెండ్స్ కాలనీ పోలీస్ స్టేషన్లో గతంలో క్రిమినల్ కేసు నమోదయింది. అల్-ఫలా గ్రూప్ కంపెనీలలో డబ్బు డిపాజిట్ చేయించుకొని మోసానికి పాల్పడ్డడంతో ఈ కేసు నమోదయింది. జనాల నుంచి సేకరించిన డబ్బు పెట్టుబడిపెట్టినట్టుగా అందరినీ నమ్మించాడు. అందుకోసం ఫేక్ సర్టిఫికెట్లు సృష్టించి అందరికీ చూపించాడని ఫిర్యాదులు అందాయి. జనాలను ఏకంగా రూ.7.5 కోట్ల భారీ మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో సిద్ధిఖీని 2001లో పోలీసులు అరెస్ట్ చేశాడు. మార్చి 2003లో ఢిల్లీ హైకోర్టు అతడికి బెయిల్ కూడా తిరస్కరించింది. మోసపోయిన జనాలకు డబ్బు తిరిగి చెల్లిస్తానంటూ ఒప్పుకోవడంతో చివరకు ఫిబ్రవరి 2004లో బెయిల్పై విడుదలయ్యాడు.
ఇంజనీరింగ్ కాలేజీగా ప్రారంభం
అల్ ఫలా యూనివర్సిటీని సిద్ధిఖీ 1997లో ప్రారంభించినట్టుగా ఈడీ అధికారులు గుర్తించారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, దీనిని తొలుత ఒక ఇంజనీరింగ్ కాలేజీగా మొదలుపెట్టారు. ఆ తర్వాత అల్ ఫలా మెడికల్ రీసెర్చ్ ఫౌండేషన్గా మార్చారు. ప్రస్తుతం ఈ వర్సిటీ మొత్తం 78 ఎకరాల క్యాంపస్లో కార్యకలాపాలు కొనసాగిస్తోంది. ఉగ్రదాడికి పాల్పడిన వైద్యులతో వర్సిటీ లింకులు ఉండడంతో వర్సిటీ నాక్ (NAAC) గుర్తింపును కూడా కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది.
