BRS: సైలెంట్ ఓటింగ్ పైనే బీఆర్ఎస్ ఆశలు పెట్టుకున్నది. కచ్చితంగా విజయం సాధిస్తామని, ఈ గెలుపు రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు నాంది అవుతుందని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 6 డివిజన్లు ఉండగా, 5 డివిజన్లలో బీఆర్ఎస్ పార్టీకే మెజార్టీ ఓట్లు పడ్డాయని, మధ్యాహ్నం తర్వాత జరిగిన ఓటింగ్ అంతా తమకే అనుకూలంగా పడ్డాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ అసలు పోటీనే ఇవ్వలేదని బహిరంగంగానే నేతలు పేర్కొంటున్నారు.
Also Read: BRS Party: గులాబీ ఏజెంట్లతో రహస్య భేటీలు.. ఓటర్లను ఆకట్టుకునేలా వ్యూహాలు!
కేసీఆర్కు వివరాల అందజేత
జూబ్లీహిల్స్ సిట్టింగ్ స్ధానాన్ని నిలబెట్టుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ సర్వశక్తులు ఒడ్డింది. రోడ్డు షోలు, డోర్ టు డోర్ ప్రచారం, కార్నర్ మీటింగ్లు, కుల సంఘాలతో భేటీలు నిర్వహించింది. ప్రభుత్వం ఇచ్చిన హామీలలో వైఫల్యం తమకు కలిసి వస్తుందని ఆశతో ఉన్నది. అంతేకాదు నియోజకవర్గంలోని ఎర్రగడ్డ, వెంగళ్ రావు నగర్, బోరబండ, షేక్ పేట, యూసుఫ్ గూడలో మెజార్టీ ఓట్లు బీఆర్ఎస్కు పడ్డాయని నేతలు అభిప్రాయపడుతున్నారు. ఓటర్ల సైలెంట్ ఓటింగ్ తమకు అనుకూలంగా మారిందనే ధీమాను వ్యక్తం చేస్తున్నారు. బుధవారం వార్ రూంలో మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు కొంత మంది పార్టీ సీనియర్ నేతలు, పోలింగ్ ఏజెంట్లతో భేటీ అయినట్లు సమాచారం.
10వేల మెజార్టీతో గెలుస్తా
ఏయే పోలింగ్ బూత్లో ఎంత మేర పోలింగ్ జరిగింది. బీఆర్ఎస్ పార్టీకి ఏ మేరకు ఓట్లు పడ్డాయనే వివరాలను సేకరించినట్లు తెలిసింది. అందులో ఎక్కువగా బీఆర్ఎస్కు పడ్డాయని 10వేల మెజార్టీతో గెలుస్తామని పేర్కొన్నట్లు సమాచారం. డివిజన్ల వారీగా మొత్తం పోలైన ఓట్లను సైతం సమీక్షించినట్లు తెలిసింది. ఆ వివరాలను పార్టీ అధినేత కేసీఆర్కు సైతం ఫోన్ చేసి చెప్పినట్లు సమాచారం. పోలింగ్ జరిగిన తీరు, పార్టీ కార్యకర్తలు, నేతలు కష్టపడిన తీరు, కాంగ్రెస్ వ్యవహరించిన తీరును సైతం వివరించినట్లు తెలిసింది. గెలుపుపై మాత్రం ధీమా వ్యక్తం చేస్తూ కేసీఆర్ పూర్తి వివరాలు చెప్పినట్లు సమాచారం.
గెలుపుపై ధీమా
షేక్ పేట, బోరబండలో మైనార్టీ ఓట్లు బీఆర్ఎస్కు పడ్డాయని, కాంగ్రెస్, ఎంఐఎం పొత్తుతోనే ముస్లింలు బీఆర్ఎస్ వైపునకు మొగ్గు చూపారని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. ఇక్కడే మెజార్టీ వస్తుందని ధీమాను వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు కొన్ని సర్వే సంస్థలు సైతం బీఆర్ఎస్ గెలుస్తుందని, కాంగ్రెస్ కంటే 5 నుంచి 8 శాతం ఓట్ల తేడాతో గెలుస్తుందని వెల్లడించడంతో బీఆర్ఎస్పై ప్రజల్లో ఆదరణ ఉన్నదని స్పష్టమైందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. హైడ్రా, ఆటో కార్మికుల, సిటీ బస్సు చార్జీల పెంపు, పింఛన్లు పెంచకపోవడం వంటి అంశాలు తమకు కలిసి వస్తాయని పేర్కొంటున్నారు. ఓట్ల లెక్కింపునకు ఒక్కరోజే సమయం ఉండడంతో బీఆర్ఎస్ నేతలు మాత్రం పోలింగ్ బూత్లవారీగా ఒకటికి రెండుసార్లు లెక్కలు వేసుకుంటున్నారు. గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Congress Vs Brs: మణుగూరు లో హై టెన్షన్.. బీఆర్ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి!
