Uttam Kumar Reddy: ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అరుదైన మైలురాయిని అందుకుంది. ఖరీఫ్ 2025–26 సీజన్లో ఇప్పటి వరకు 8.54 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎమ్టీ) ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. గతేడాది ఇదే సమయానికి కొనుగోలు చేసిన ధాన్యం (3.94 లక్షల మెట్రిక్ టన్నులు) పోలిస్తే ఇది రెండింతలు అధికమన్నారు. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఈ స్థాయి కొనుగోళ్లు ఎన్నడూ జరగలేదని ఉత్తమ్ పేర్కొన్నారు.
రూ. 2,041 కోట్లతో ధాన్యం కొనుగోలు
నీటిపారుదల మంత్రి అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సచివాలయంలో జరిగిన ఈ భేటికి సీఎస్ రామకృష్ణారావుతో పాటు జిల్లా కలెక్టర్లు వర్చువల్ గా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పటి వరకు రైతుల నుంచి 3.95 లక్షల మెట్రిక్ టన్నుల సన్నాలు, 4.59 లక్షల మెట్రిక్ టన్నుల పెద్ద ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు ధాన్యం అమ్మిన రైతుల సంఖ్య గత సంవత్సరం 55,493 మందిగా ఉండగా.. ఈ ఏడాది 1,21,960 మందికి చేరిందని చెప్పారు. మొత్తం ధాన్యం కొనుగోలు విలువ రూ. 2,041.44 కోట్లు కాగా.. ఇది గత సంవత్సరం (రూ. 915.05 కోట్లు)తో పోలిస్తే రెట్టింపు అని అన్నారు. సన్నాల బోనస్ మొత్తం గత సంవత్సరం రూ. 43.02 కోట్ల నుండి ఈ సంవత్సరం రూ. 197.73 కోట్లకు పెరిగిందన్నారు. అందులో రూ. 35.72 కోట్లు ఇప్పటి వరకు చెల్లించామని తెలిపారు.
‘కొనుగోళ్లు వేగవంతం చేయాలి’
రైతులకు సమయానికి చెల్లింపులు చేయడమే కాకుండా, తగిన నిల్వలు, రవాణా సదుపాయాలు కల్పించాలని జిల్లా కలెక్టర్లను ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులను ఎదుర్కొనేందుకు హై అలర్ట్లో ఉండాలని సూచించారు. ధాన్యం, మొక్కజొన్న, పత్తి పంటలు నష్టపోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. అన్ని జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేసి, నిల్వ ధాన్యాన్ని త్వరగా రైస్ మిల్లులకు తరలించాలని దిశానిర్దేశం చేశారు. తెలంగాణకు వర్ష సూచన ఉన్న నేపథ్యంలో.. ధాన్యం తడవకుండా రక్షించేందుకు ప్రతి కొనుగోలు కేంద్రంలో తార్పాలిన్ షీట్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. రైతులకు ప్రతిరోజు వాతావరణ హెచ్చరికలు అందజేయాలని చెప్పారు.
Also Read: Terrorists Arrest: 12 సూట్ కేసులు.. 20 టైమర్స్.. ఒక రైఫిల్, లేడీ డాక్టర్ ఉగ్ర కుట్ర?
పత్తి కొనుగోళ్లపై పరిమితి పెంపునకు కృషి
పత్తి కొనుగోళ్ల విషయంలో సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) కొత్త ఎల్1, ఎల్2 నిబంధనల కారణంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కలెక్టర్లు వివరించారు. దీనిపై స్పందించిన తుమ్మల నాగేశ్వరరావు.. పత్తి కొనుగోళ్ల పరిమితిని ఎకరాకు 7 క్వింటాళ్ల నుండి 12 క్వింటాళ్లకు పెంచేందుకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామన్నారు. వర్షాల కారణంగా రంగు మారిన సోయాబీన్ పంటను కూడా కొనుగోలు చేయడానికి అనుమతించాలంటూ కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన పంపిందని ఆయన తెలిపారు. మెుంథా తుపాను కారణంగా సుమారు 1.10 లక్షల ఎకరాలలో ధాన్యం, మొక్కజొన్న, పత్తి పంటలకు నష్టం వాటిల్లిందని నాగేశ్వరరావు తెలిపారు. వ్యవసాయ శాఖ రూపొందించిన పంటనష్టం నివేదికను కేంద్రానికి పంపామని చెప్పారు. రాష్ట్ర రైతాంగానికి మేలు కలిగేలా ప్రభుత్వంతో నిరంతరం చర్చలు జరుపుతున్నట్లు మంత్రి తుమ్మల స్పష్టం చేశారు.
