Bandi Sanjay: కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదువుకునే విద్యార్థులందరికీ కేంద్ర మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) శుభవార్త చెప్పారు. ఈ ఏడాది టెన్త్ ఎగ్జామ్ ఫీజును పూర్తిగా చెల్లించేందుకు బండి సంజయ్ ముందుకొచ్చారు. ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లకు కేంద్ర మంత్రి లేఖ రాశారు. అధికార వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం కరీంనగర్(Karimnagar) పార్లమెంట్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో 12,292 మంది విద్యార్థులు పదో తరగతి చదువుకుంటున్నారు.
పిల్లలకు పరీక్ష ఫీజు..
వీరిలో కరీంనగర్ జిల్లాలో 4,847, సిరిసిల్ల జిల్లాలో 4059, సిద్దిపేట జిల్లాలో 1118, జగిత్యాల జిల్లాలో 1135, హన్మకొండ జిల్లాలో 1133 మంది విద్యార్థులున్నారు. వీరందరికీ పరీక్ష ఫీజు చెల్లించాలంటే రూ.15 లక్షలకుపైగా ఖర్చవుతుంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులంతా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారే. వారిలో చాలా మంది విద్యార్థుల తల్లిదండ్రులు కూలీ పనిచేసేవారున్నారు. పిల్లలకు పరీక్ష ఫీజు కూడా చెల్లించే పరిస్థితి లేదని తెలుసుకున్న బండి సంజయ్ తన నియోజకవర్గ పరిధిలోని ఆయా స్కూళ్లలో చదివే విద్యార్థుల ఫీజు మొత్తాన్ని చెల్లించాలని నిర్ణయించుకున్నారు. ఆ మొత్తాన్ని తన వేతనం నుంచి చెల్లించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లకు లేఖలు పంపారు.
మోడీ కిట్స్ పేరుతో..
వాస్తవానికి బండి సంజయ్ కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పేద విద్యార్థులకు బాసటగా నిలుస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులతోపాటు సరస్వతి శిశు మందిరాల్లో చదువుకునే విద్యార్థులు సహా దాదాపు 20 వేల మందికి ‘మోడీ గిఫ్ట్’ పేరుతో బ్రాండెడ్ సైకిళ్లను పంపిణీ చేశారు. అతి త్వరలోనే సర్కారీ స్కూళ్లలో 9వ తరగతి చదువుకునే విద్యార్థులకు సైతం సైకిళ్లను పంపిణీ చేస్తామని ప్రకటించారు. అలాగే వచ్చే ఏడాది విద్యా సంవత్సరం ఆరంభంలోనే మోడీ కిట్స్ పేరుతో విద్యార్థులందరికీ స్కూల్ బ్యాగ్, నోట్ బుక్స్, జామెట్రీ బాక్స్, పెన్ను, పెన్సిళ్లు, స్టీల్ వాటర్ బాటిల్ ను పంపిణీ చేయబోతున్నారు.
