Telangana Governor Tamilisai Resigns
Politics

Telangana Governor : గవర్నర్ పదవికి తమిళిసై రాజీనామా, రాష్ట్రపతికి లేఖ

Telangana Governor Tamilisai Resigns: పార్లమెంట్ ఎన్నికల వేళ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ రాజీనామా చేశారు. 2019 సెప్టెంబర్‌ 8న ఆమె తెలంగాణ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు తీసుకున్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రవేశించే లక్ష్యంతోనే తమిళిసై తన పదవికి రిజైన్ చేసినట్టు కనిపిస్తోంది. తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి కూడా పంపించారు.

మొదట్నుంచి రాజకీయాలపైనే ఇంట్రస్ట్

గత కొద్ది రోజులుగా తమిళిసై సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తారనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలో ఆమె తన పదవికి రాజీనామా చేయడంతో ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెడుతున్నారనే వార్తలకు మరింత బలం చేకూరింది. తమిళనాడులోని చెన్నై సెంట్రల్ పార్లమెంటు నియోజకవర్గం, లేదా పుదుచ్చేరి నుంచి ఎంపీగా పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. అయితే, తమిళిసై పొలిటికల్ జర్నీలో అన్నీ ఓటములే ఉన్నాయి. ఒక్క విక్టరీ కూడా లేదు. 2006లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి రామనాథపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక్కసారి కూడా గెలవలేకపోయారు. ఈమె తండ్రి తమిళనాడు పీసీసీ చీఫ్‌గా పని చేశారు. చివరకు తమిళిసై 1999లో బీజేపీలో చేరారు. 1999లో దక్షిణ చెన్నై జిల్లా వైద్య విభాగం కార్యదర్శిగా, 2001లో తమిళనాడు రాష్ట్ర వైద్య విభాగం ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2007లో అఖిల భారత కో-కన్వీనర్‌గా 2007లో బీజేపీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగారు. 2010లో రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షురాలిగా, 2013లో జాతీయ ప్రధాన కార్యదర్శిగా, 2014లో తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా కొనసాగారు.

Read More: మాయం, చేజేతులా నాశనం

తెలంగాణలో తనదైన ముద్ర

తమిళనాడుకు చెందిన తమిళిసై వృత్తిరీత్యా వైద్యురాలిగా పనిచేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా పనిచేశారు. తెలంగాణ రాష్ట్రానికి తొలి మహిళా గవర్నర్‌గా నియామకం అయ్యారు. 2019 సెప్టెంబర్ 8న గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి తనదైన ముద్ర వేస్తూ వచ్చారు. అయితే, కేసీఆర్ ప్రభుత్వంతో తలెత్తిన వివాదాలతో ఈమె పేరు మార్మోగింది. ప్రభుత్వం ప్రోటోకాల్ పాటించడం లేదంటూ బహిరంగంగా తమిళిసై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఇంకా పలు అంశాల్లో ప్రభుత్వ నిర్ణయాలను తప్పుబట్టారు. దీంతో గులాబీ నేతలు ఆమెపై మాటల యుద్ధం కొనసాగించారు. కానీ, ఆమె తగ్గేదే లేదని స్పష్టం చేశారు. అందరు గవర్నర్లు వేరు, తాను వేరు అంటూ రూల్స్ అన్నీ ప్రభుత్వం ముందు పెట్టారు. చెప్పాలంటే కేసీఆర్ సర్కార్‌కు ఒకరకంగా చుక్కలు చూపించారు. ఈ స్థాయిలో తమిళిసై అగ్రెసివ్‌గా ఉండడం వెనుక కారణం ఆమె పొలిటికల్ బ్యాక్ గ్రౌండే.

ఇంతకుముందు ఇలా జరిగిందా?

రాజ్యాంగబద్ధ పదవులు చేపట్టిన వారు అట్నుంచి అటే రిటైర్ అవడం కామన్. ఇప్పటిదాకా అందరికీ తెలిసిన విషయం ఇదే. కానీ, తమిళిసై మాత్రం బీజేపీ హైకమాండ్‌ను ఒప్పించి మరోసారి ఎన్నికల్లోకి దిగబోతున్నారు. జనం ఎలా స్వాగతిస్తారన్న పాయింట్‌ను పక్కన పెడితే ఇలా పొలిటికల్ రీ ఎంట్రీ ఇష్యూనే ఇంట్రెస్టింగ్ అయింది. ఇప్పటికి మూడుసార్లు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన తమిళిసై నాలుగోసారి పోటీకి రెడీ అవుతున్నారు. మరోమారు అదృష్టం పరీక్షించుకుంటున్నారు. అయితే, రాజకీయాల నుంచి రాజ్యాంగ బద్ధ పదవుల్లోకి వచ్చి మళ్లీ పొలిటికల్ రీ ఎంట్రీ ఇచ్చిన వాళ్లు చాలా తక్కువే. కాంగ్రెస్ కీలక నేత సుశీల్ కుమార్ షిండే 2004 నుంచి 2006 మధ్య ఉమ్మడి ఏపీ గవర్నర్‌గా పని చేశారు. ఆ తర్వాత మళ్లీ లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేశారు. బీజేపీ నేత విద్యాసాగర్ రావు మహారాష్ట్ర గవర్నర్‌గా పని చేశారు. పదవీ కాలం పూర్తయ్యాక తిరిగి యాక్టివ్ పాలిటిక్స్‌లోకి వచ్చారు. ఎన్నికల్లో పోటీ చేయకపోయినా బీజేపీలో కొనసాగుతున్నారు. ఇప్పుడు తమిళిసై ఆ దిశగా అడుగులేస్తున్నారు.

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు