Sir..Car..The End Of The Race
Exclusive

BRS Party: మాయం, చేజేతులా నాశనం

Mayam, Destruction Like Hands: అధికారంలో ఉన్న నాయకుడు, నీళ్లలో ఉన్న మొసలి ఒకటేనంటారు రాజకీయ విశ్లేషకులు. అధికారంలో ఉన్నవారు తాము ఇతరుల కంటే గొప్పవారమని అనుకోవటం సహజమే. కానీ, మిగిలిన వారంతా తనకంటే చిన్నవారని అనుకుంటేనే సమస్య. రాజదండం చేతబూని రాజ్యాధికారం చేపట్టిన తర్వాత అందులో ఉన్నంత కిక్ ఇంకెందులోనూ నాయకుడికి దొరకదు. అధికారం ఎప్పుడు తన నుంచి దూరమవుతుందోననే భయం ఆవరించేంతగా అది నాయకుడిని మాయ చేస్తుంది. ఈ అభద్రతా భావం క్రమంగా సొంత మనుషులనూ దూరం పెట్టేలా చేస్తుంది. పదవి శాశ్వతమనే భావనతో నాయకుడు దాన్ని కాపాడుకోవటమే తన ఏకైక లక్ష్యంగా మార్చుకుంటాడు. ఈ క్రమంలో నాయకుడికి ప్రజలకి మధ్య ఊహించనంత దూరం పెరిగిపోతుంది. అధికారం మీద అంతులేని వ్యామోహం, అర్థంలేని అపోహలకు దారితీస్తుంది. దీంతో పాలనను గాలికొదిలేసి గాలి మేడలు కట్టటం మొదలవుతుంది. అంతిమంగా అది పతనానికి దారితీస్తుంది. ఒక్కసారి పరాజయం పాలైన తర్వాత గానీ ఏం జరిగిందో అర్థం కాదు. కానీ, అప్పటికే అయిన వారందరికీ దూరమై నాయకులు ఒంటరివారై పోతారు. ఇదంతా ఎవరి గురించో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. అవును. ఇది మన మాజీ సీఎం కేసీఆర్ ముచ్చటే.

తెలంగాణ సాధనే ఏకైక లక్ష్యమంటూ బరిలో దిగిన కేసీఆర్ అనేక రాజకీయ సవాళ్లను అధిగమించాడు. తెలంగాణ సాధన కోసం బొంతపురుగునైనా ముద్దాడతానన్న కేసీఆర్ ఎన్నికల రాజకీయంలో భాగంగా కాంగ్రెస్, టీడీపీ వంటి అన్ని ప్రధాన పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు. తెలంగాణ పేరుతో ఊరూరా తన పార్టీ జెండా ఎగిరేలా చేయగలిగాడు. తెరచాటు రాజకీయం చేసి బీజేపీ సాయమూ అందుకున్నారు. ఎట్టకేలకు 2014 జూన్ 2 తెలంగాణ ముఖ్యమంత్రి కాగలిగారు. గెలిచిన తర్వాత తెలంగాణ తెచ్చిన తమ ఉద్యమపార్టీ ఇకపై ఫక్తు రాజకీయ పార్టీ అని తెగించి ప్రకటించేశారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తాననేది ఆదర్శమే తప్ప ఆచరణలో సాధ్యం కాదని కుండబద్దలు కొట్టేశారు. ఆ చర్చ జనంలోకి పోకుండా ‘తెలంగాణ పునర్నిర్మాణం’ అనే కొత్త పాటను పాడటం మొదలుపెట్టారు. తెలంగాణకు ఇన్ని రాజకీయ పార్టీలే అవసరం లేదని చెబుతూ విపక్షాల ఎమ్మెల్యేలందరినీ ఊహించనంత తక్కువ సమయంలో పార్టీలో కలిపేసుకున్నారు. అంతటితో ఆగకుండా, పార్టీలనూ విలీనం చేసుకుని, ఈ అనైతిక చర్యకు ‘రాజకీయ ఏకీకరణ’ అనే అందమైన పేరు పెట్టారు.

Read More: బిగుస్తున్న ఫోన్ ట్యాపింగ్ ఉచ్చు..!

పనిలో పనిగా ఎడాపెడా సంక్షేమ పథకాల పేరుతో తెలంగాణలోని ఇంటింటిలోనూ ప్రవేశించి తనకంటూ స్థిరమైన ఓటుబ్యాంకు వచ్చేలా చూసుకున్నారు. ఆంధ్రా పాలకులే విధ్వంసానికి కారకులంటూ చెబుతూ మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి అందమైన పేర్లతో వేల కోట్ల రూపాయల కాంట్రాక్టు పనులను బినామీలకు అప్పగించి కోట్లు కూడబెట్టారు. ధనిక రాష్ట్రంలో అన్నీ రిచ్‌గా ఉండాలంటూ పాత సచివాలయం పనికిరాదని నాటి సీఎం తీర్మానించేశారు. దుబారా ఎందుకన్న విపక్షాన్ని తెలంగాణ ద్రోహులంటూ కసురుకున్నారు. వినూత్న నిర్మాణాలతో నవ తెలంగాణ మీద తన చెదరని ముద్ర ఎన్నటికీ నిలిచే నిర్మాణాలు మరిన్ని కావాలనే తపన పెంచుకుంటూ పోయారు. విపక్షాల అనైక్యత, తెలంగాణ పునర్నిర్మాణపు మాయలో జనాన్ని ఉంచటంలో సక్సెస్ కావటంతో ఆరు నెలలు ముందుగా ఎన్నికలకు పోయి, మరోసారి గెలిచారు. నిరుద్యోగ భృతి మొదలు అనేక వాగ్దానాలు చేసినా గెలిచాక వాటన్నింటినీ పక్కనబెట్టేశారు.

రెండోసారి గెలిచాక పూర్తిగా పాలనను ఉపేక్షించటం మొదలైంది. తాను తప్ప తెలంగాణను పాలించటం మరెవరి వల్లా కాదనే భ్రమ మరింత పెరిగింది. ఇంతలో వచ్చిన కొవిడ్ సంక్షోభం రెండేళ్ల పాటు ఎవరినీ ప్రశ్నించనీయకుండా చేసింది. ఈ కష్టకాలంలోనే పాత సచివాలయాన్ని కూలగొట్టించే పని విజయవంతంగా జరిగిపోయింది. కేంద్రాన్ని దోషిగా చూపిస్తూ, విపక్షాలు ఐక్యం కావటం అసాధ్యమనే భావనలో మునిగిపోయిన కేసీఆర్‌కి తన రాజ్యాధికార పరిధి మరింత పెద్దదిగా ఉండాలని అనిపించింది. కొడుకుని సీఎం చేసి హస్తినలో కూర్చొని ఢిల్లీ రాజకీయాన్ని శాసించ గల శక్తి సామర్థ్యాలు తనకు తప్ప దేశంలో ఏ ప్రాంతీయ పార్టీ అధినేతకూ లేవనే మాయలో పడిపోయారు. ఈ క్రమంలో తన తర్వాత తన కుటుంబమే తెలంగాణను శాసించాలనే భావనను జయించలేకపోయారు. దీంతో ప్రభుత్వంలో, పార్టీలో కుటుంబ సభ్యుల పెత్తనం పెరుగుతూ పోయింది. కుమారుడిని కార్యనిర్వాహక అధ్యక్షుడిని చేసి, యువరాజు హోదా కట్టబెట్టి పాలనంతా అప్పజెప్పారు. ఫామ్ హౌజ్‌కే పరిమితమవుతూ, తన ప్రభను ఢిల్లీకీ విస్తారించాలనుకున్నారు. దీంతో తెలంగాణ రాష్ట్ర సమితి కాస్తా.. భారత రాష్ట్ర సమితి అయింది. ఢిల్లీతో ముభావంగా ఉన్న సీఎంలను, నేతలను హైదరాబాద్ ఆహ్వానించి వారికి శాలువాలు కప్పటం, వారు ‘మీ అంత తెలివిగల వారు లేరు’ అంటుంటే మురిసిపోయారు. మితిమీరిన అతిశయం.. అహంకారానికి దారితీసింది.

ప్రపంచంలో జీవించటానికి అత్యుత్తమ ప్రదేశం ‘తెలంగాణ’ మాత్రమే అనే ప్రచారం మొదలుపెట్టారు. దొరవారి మనసులో మాటను మరింత అందంగా అచ్చొత్తేందుకు సొంత మీడియానూ ఏర్పరుచుకోవటంతో రోజుకో రంగుల కలను మీడియాలో చూస్తూ కాలం గడిపారు. ‘ఇదేంటి’ అని నిలదీసిన ఇతర మీడియా సంస్థలను భయపెట్టటం, వీలుంటే కొనేయటం మొదలుపెట్టారు. వాస్తవాలు చెప్పేందుకు ప్రయత్నించిన సొంతమనుషులను దూరం పెడుతూ రావటంతో అందరూ ‘ఎస్ బాస్’ అనటం మొదలైంది. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో సొంత విమానంలో నేతలంతా మహారాష్ట్ర, ఢిల్లీల్లో పర్యటించి రైతులకు పెద్దపెద్ద చెక్కులను అందించటంతో జాతీయ మీడియా ‘ఢిల్లీని ఎదిరించిన మొనగాడు’ అంటూ పొగడ్తల్లో ముంచటంతో తన మీద ఉన్న నమ్మకం మరింత బలపడింది. పాలన అప్పజెప్పిన కొడుకు చుట్టూ చేరిన కోటరీ, ఆయనను కార్పొరేట్ వ్యవహారాలకే పరిమితం చేయటంతో క్షేత్రస్థాయితో సంబంధాలు చట్టుబండలయ్యాయి. కష్టాల పాలైన రైతులు, రేపటి మీద ఆశ కోల్పోయిన నిరుద్యోగులు, దశాబ్దాల పాటు ఆరాధించిన విద్యార్థుల ఇక్కట్లు పట్టించుకోలేనంతగా బిజీ అయిపోయాడు. పాలనను పూర్తిగా కేంద్రీకరించేయటంతో తమకు తెలియకుండా ఒక్క కానిస్టేబుల్ బదిలీ కూడా జరగని పరిస్థితిని సృష్టించారు.

Read More: ఎమ్మెల్సీ కవితకి బిగ్ షాక్, 7 రోజుల కస్టడీ

కొవిడ్ సంక్షోభం తెచ్చిన ఆర్థిక మందగమనం, పాలన మీద పట్టు కోల్పోవటంతో జనం ఆయన మాటల్ని లైట్‌గా తీసుకోవటం మొదలు పెట్టారు. దీనికి తోడు తెలంగాణ ఉద్యమ కేంద్రాలుగా నిలిచిన యూనివర్సిటీలు కునారిల్లిపోతున్నా, పదోతరగతి మొదలు పెట్టి గ్రూప్ 1 పరీక్ష దాకా వరసపెట్టి పరీక్ష పత్రాలన్నీ లీకవుతున్నా పట్టించుకోలేదు. బీటెక్ వంటి కోర్సులు చదివిన వారిని స్కిల్ డెవలప్‌మెంట్ లేక వారంతా నిరుద్యోగులుగా మిగిలిపోయారు. దీంతో తెలంగాణ వ్యాప్తంగా ఇంటింటికో నిరుద్యోగి తయారయ్యాడు. దీన్ని గమనించిన తెలంగాణ పౌర సమాజంలో స్పందన మొదలైంది. ఆర్టీసీ కార్మికుల సమ్మెను అణచివేయటం, యూనియన్లే లేకుండా చేయటం, సింగరేణిని రాజకీయాలకు వాడుకోవటం వంటి ఉదంతాలు కార్మిక లోకంలో అశాంతిని నింపాయి. సీపీఐ ఎమ్మెల్యేలనూ వదలకుండా పార్టీలో చేర్చుకునే స్థాయికి పరిస్థితి వచ్చే సరికి హక్కుల నేతలు, ప్రజాస్వామిక వాదులంతా ఒక్కటవటం మొదలైంది.

2022 వచ్చే సరికి పలు రూపాల్లో ఉన్న అసంతృప్తి పసిగట్టిన విపక్ష కాంగ్రెస్ గొంతు పెంచి ప్రజా పోరాటాలకు దిగింది. ఇక.. ఫాంహౌస్‌లో స్టింగ్ ఆపరేషన్, ఢిల్లీ లిక్కర్ స్కాం, చంద్రబాబు అరెస్టుపై చంకలు గుద్దుకోవటం, బాబు అరెస్టుపై హైదరాబాద్‌లో నిరసన చేసే హక్కు సీమాంధ్రులకు లేదనటం, గొప్పగా ప్రకటించుకున్న డబుల్ బెడ్ రూమ్‌లు, దళితబంధు, బీసీ బంధు పథకాలు అందని వారి ఆవేశం రోడ్డెక్కటం, ఊహించని రీతిలో మేడిగడ్డ కుంగిపోవటం వంటి ఘటనలన్నీ ఒకదాని వెంట ఒకటి జరిగిపోయాయి. తాను కోరినప్పుడే తప్ప ఎవరికీ దర్శనమే ఇవ్వని సీఎం.. ఎన్నికల నాటికి ఎవరికీ టికెట్ నిరాకరించలేక అందిరికీ టిక్కెట్లివ్వాల్సి వచ్చింది. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తున్నా ఏ అదృష్టమో అడ్డుపడకపోతుందా అనే అత్యాశలో ఉండగానే.. డిసెంబరు 3న ప్రజల మనోగతం వెల్లడైంది. ఆ నాటి నుంచి నేటి వరకు రోజుకో నేత పార్టీని వదిలిపోతున్నా.. ఏమీ మాట్లాడలేని దుస్థితిలో పడిపోయారు. పులిమీద పుట్రలా పార్లమెంటు ఎన్నికల వేళ కుమార్తె కవిత అరెస్టుతో పార్టీ నేతలు, శ్రేణులూ ఆత్మస్థైర్యం కోల్పోయి పోటీకి సిద్ధంగా లేమంటూ తమ దారి చూసుకుంటున్నాయి. కేవలం పదేళ్ల కాలంలో అత్యున్నత స్ధాయి నుంచి అథో:పాతాళానికి పడిపోయిన పార్టీగా బీఆర్ఎస్ నిలవనుందనే సూచనలు కళ్ల ముందు స్పష్టంగా కనబడుతున్నాయి. ఇక దాని భవిష్యత్తు ఏమమిటో కాలమే నిర్ణయించాలి.