Junior NTR House Dispute: జూనియర్ ఎన్టీఆర్ ఇంటి వివాదంగా చెలామణి అవుతున్న కేసులో కొత్త ట్విస్ట్ వచ్చింది. డెట్ రికవరీ ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పును హైకోర్టు నిలిపేసింది. బ్యాంకు అనుకూలంగా ఇచ్చిన తీర్పును తోసిపుచ్చుతూ రికవరీ అధికారి ఇరుపార్టీలను విచారించి చట్టానికి అనుగుణంగా త్వరితగతిన క్లెయిమ్ పిటిషన్ పరిష్కరించాలని సూచించింది.
జూబ్లిహిల్స్ హౌసింగ్ సొసైటీలోని స్థలాన్ని 2003లో సుంకు గీత నుంచి జూనియర్ ఎన్టీఆర్ కొనుగోలు చేశారు. ఆ తర్వాత 2013లో ఆ ప్రాపర్టీని అమ్మేశారని ఎన్టీఆర్ టీం పేర్కొంది. అయితే.. ఎన్టీఆర్ కొనడానికి ముందే 1996లో యజమానులు ఆ ప్రాపర్టీని తనఖా పెట్టి రుణం పొందారని బ్యాంకులు డెట్ రికవరీ ట్రిబ్యునల్ను ఆశ్రయించాయి. బ్యాంకులకూ హక్కులు ఉంటాయని వాటికి అనుకూలంగా డీఆర్టీ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఎన్టీఆర్ ఇంటి రిజిస్టర్ జీపీఏ హక్కుదారైన కిలారు రాజేశ్వరరావు హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా హైకోర్టు ఈ పిటిషన్ పై తీర్పు ఇచ్చింది.
డీఆర్టీ ఇచ్చిన తీర్పును పక్కనపెట్టాలని, రికవరీ అధికారి ఇరు పార్టీలను విచారించి చట్టానికి అనుగుణంగా త్వరితగతిన క్లెయిమ్ పిటిషన్ పరిష్కరించాలని సూచించింది. ఈ ఇంటితో జూనియర్ ఎన్టీఆర్కు సంబంధం లేదని కిలారు రాజేశ్వరరావు వెల్లడించారు. 2012లో రిజిస్టర్ జీపీఏ చేసుకుని 2013లో తన పేరిట ఇంటిని రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు తెలిపారు.
ఈ వ్యవహారానికి సంబంధించి సీసీఎస్లో గతంలోనే కేసు నమోదైంది. ఆ కేసులో సుంకు విష్ణు చరణ్తోపాటు పలువురు అరెస్ట్ అయ్యారు. నకిలీ పత్రాలతో బ్యాంకులను మోసం చేశారని ఫోరెన్సిక్ నివేదిక తేల్చింది. ఈ సుంకు విష్ణు చరణ్ ఎవరో కాదు.. జూనియర్ ఎన్టీఆర్కు స్థలాన్ని విక్రయించిన సుంకు గీతా సంతోష్ మరిది.