KTR: జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో చోరీ కా ఓట్ జరుగుతుందని, నమోదైన డూప్లికేట్, నకిలీ ఓట్లను వెంటనే డిలీట్ చేయాలని లేకుంటే కోర్టుకు వెళ్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) స్పష్టం చేశారు. తెలంగాణ ఓట్ చోరీ అంశంపై రాహుల్ గాంధీ స్పందించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్ లో డూప్లికేట్ ఓట్లపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ 2023 శాసనసభ ఎన్నికల్లో 3లక్షల 75వేల ఓట్లు ఉంటే ఇప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 3 లక్షల 98వేలు ఓట్లు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారని గతం కంటే ఇప్పుడు 23వేల ఓట్లు పెరిగాయన్నారు.
Also Read: KTR: దొంగ ఓట్లపై కాంగ్రెస్ ను ప్రజాక్షేత్రంలో ఎండగడతాం.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
అధికారులు అందరి పైన చర్యలు తీసుకోవాలి
కొత్తగా వచ్చిన 23 వేల ఓట్ల పైన సంపూర్ణ దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారు. బీహార్ లో జరిగింది ఓటు చోరీ తెలంగాణలో చోరీ ఓట్లతో కాంగ్రెస్ ఎన్నికలలో గెలవాలని చూస్తుందన్నారు. డూప్లికేట్, నకిలీ ఓట్లను వెంటనే డిలీట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఓట్ల నమోదుకు పాల్పడిన, ఓట్ల అక్రమాలకు పాల్పడిన అధికారులు అందరి పైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్నికల సంఘానికి సంబంధించిన విశ్వసనీయత ప్రశ్నార్థకమైందన్నారు. వెంటనే ఈ అంశం పైన కేంద్ర ఎన్నికల కమిషన్ స్పందించాలన్నారు. మేము లేవనెత్తిన ప్రతి ఒక్క అభ్యంతరాన్ని పరిగణలోకి తీసుకొని దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇంత స్పష్టంగా ఓట్ చోరీకి సంబంధించిన రుజువులన్నింటిని ప్రజల ముందు ఉంచామన్నారు.
క్రమంగా ఓటు ఐడీలను పంచారు
12000 ఓట్లు డిలీట్ అయ్యాయని అధికారులు చెబుతున్నారన్నారు. అసాధారణంగా ఏ విధంగా ఓట్లు పెరిగాయి అన్నది అనేక అనుమానాలకు దారితీస్తుందన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎంపికైన వ్యక్తి ఎన్నికల కమిషన్ డ్యూటీని తన చేతుల్లోకి తీసుకొని అక్రమంగా ఓటు ఐడీలను పంచారని ఆరోపించారు. మైనర్ బాల బాలికలకు కూడా ఓటర్ ఐడీలను కాంగ్రెస్ అభ్యర్థి పంచారని మండిపడ్డారు. అసలు ఓటర్ జాబితా పంపిణీకి సంబంధించిన అంశంలో రాష్ట్ర ముఖ్యమంత్రికి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కి ఏం సంబంధం? ఆయన ఫోటోలు పెట్టుకుని మరీ కార్యక్రమాన్ని నిర్వహించారని మండిపడ్డారు.
ఈ లిస్టులో ఉన్న వాళ్లకి ఎలాంటి సంబంధం లేదు
కాంగ్రెస్ అభ్యర్థి చేసిన ఫేక్ ఐడీ కార్డుల పంపిణీ జరిగిందని ఎన్నికల సంఘం కేసు నమోదు చేసిందన్నారు. 43 ఓట్లు ఉన్న సాంస్కృతి అపార్ట్మెంట్స్ వెళ్లి చూశాము. అక్కడ ఉన్న ఓనర్ “మాకు సంబంధం లేదు” అని చెప్పారు. “ఇక్కడ ఉన్న వాళ్లకు, ఉన్న ఇంటి యజమానులకు, ఈ లిస్టులో ఉన్న వాళ్లకి ఎలాంటి సంబంధం లేదు” అని చెప్పారన్నారు. బూత్ నంబర్ 125 లో ఒక ఇంట్లో 23 ఓట్లు ఉన్నాయి. 80 గజాలు మాత్రం ఉన్న ఇంట్లో ఎంతో మంది ఎందుకు వచ్చారు మాకు తెలవదని యజమాని చెప్పారు.ఈ మొత్తం వ్యవహారంలో ఎన్నికల అక్రమాల కోసం కిందిస్థాయి అధికారులను కాంగ్రెస్ పార్టీ ఉపయోగించుకుంటుంది అన్న అనుమానం ఉన్నదన్నారు. కాంగ్రెస్ పార్టీ లీడర్కు సంబంధించిన ఇంట్లో 32 దొంగ ఓట్లు ఉన్నాయని మండిపడ్డారు. ఎన్నికల కమిషన్ ఎందుకు అక్రమాలను గుర్తించి తొలగించలేకపోతున్నది? 24 గంటలు దాటినా ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి స్పందన రాలేదని, బుధవారం హైకోర్టుకి వెళ్తామని వెల్లడించారు.
కాంగ్రెస్ నేతలు ఎంత సిగ్గులేనివారో సమాజం చూస్తోంది
మాగంటి సునీత భావోద్వేగంపై విమర్శలు చేసిన కాంగ్రెస్ నేతలు నీతిమాలిన మనుషులు అని మండిపడ్డారు. ఆమె ఆవేదనపైనా విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ నేతలు ఎంత సిగ్గులేనివారో సమాజం చూస్తోందన్నారు. సునీత తన కుటుంబ పెద్దను కోల్పోయిన జూబ్లీహిల్స్ లాంటి ఒక పెద్ద కుటుంబాన్ని ఇచ్చిందని భావోద్వేగానికి గురయ్యారన్నారు. అయితే, దానిపైన కూడా కాంగ్రెస్ నేతలు ఆవాకులు, చవాకులు పేలడం దారుణం అన్నారు. తన భర్త చనిపోయి ఇప్పటికీ ఆరు నెలలు కూడా కాలేదు. ఒక మహిళగా, కుటుంబ పెద్దను కోల్పోయిన బాధ, ఆవేదన ఆమెకు ఉండదా? ఇక మాగంటి గోపీనాథ్ కుమార్తెపై కూడా అక్రమ ఎన్నికల కేసు పెట్టడం కాంగ్రెస్ పార్టీ నీతిలేని రాజకీయాలకు నిదర్శనం.. ఇలాంటి విషయాలపైనా కాంగ్రెస్ నాయకులు నీతిలేని రాజకీయాలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.
Also Read: KTR: రైతుల ఆత్మహత్యలకు ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత.. కేటీఆర్ తీవ్ర విమర్శలు
