GHMC Officials Demolished unauthorised constructions in Jagan Lotus pond:
ఏపీలో జరిగిన ఎన్నికలలో అనూహ్యంగా జగన్ ఓటమి పాలయ్యారు. సంక్షేమ పథకాలు తనని గట్టెక్కిస్తాయని ఎన్నో ఆశలు పెట్టుకున్న జగన్ కు కూటమి చేతిలో ఓటమి తప్పలేదు. కేవలం 11 స్థానాలకే పరిమతం అయ్యారు. అయితే ఓటమి తర్వాత పార్టీ ముఖ్య నేతలతో వరుస సమీక్షలు చేస్తున్నారు జగన్. ఇదే సమయంలో హైదరాబాద్ లో కీలక పరిణామం చోటుచేసుకుంది. జూబ్లీహిల్స్ లో జగన్ నివాసం ఉండే లోటస్ పాండ్ ప్రాంగణంలో జీహెచ్ ఎంసీ అధికారులు అక్రమ నిర్మాణాలను కూల్చివేయడం సంచలనంగా మారింది. . జగన్ ముఖ్యమంత్రి కాకముందు హైదరాబాద్ లో ఇదే ప్రాంగణంలో నివాసం ఉండేవారు. అక్కడే పార్టీ వ్యవహారాలు పర్యవేక్షించారు. 2019 ఎన్నికల ముందు తాడేపల్లిలో ఇంటి నిర్మాణం పూర్తి చేసుకొని అక్కడే ఉంటున్నారు. హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో షర్మిల, విజయమ్మ..కుటుంబ సభ్యులు ఉండేవారు. .
చివరిసారిగా..
ఈ మధ్య కాలంలోనే జగన్ తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ను పరామర్శించేందుక వెళ్లిన సమయంలో చివరి సారిగా లోటస్ పాండ్ కు వెళ్లారు.అక్కడ తల్లి విజయమ్మతో సమావేశం అయ్యారు. ఇక, ఇప్పుడు లోటస్ పాండ్ లో అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ సిబ్బంది కూల్చివేత మొదలు పెట్టారు. అక్కడ కొంత మేర రోడ్డు ఆక్రమించి నిర్మాణాలు చేసినట్లుగా అభియోగాలు ఉన్నాయి. ఫుట్పాత్ ఆక్రమించి సెక్యూరిటీ పోస్ట్ ల నిర్మాణం చేసినట్లు గుర్తించారు. గతంలోనే వీటిని తొలిగించాలని నోటీసులు ఇచ్చారు. కాగా ఈ సెక్యూరిటీ పోస్టుల ఆక్రమణలపై స్థానికుల ఫిర్యాదులు వచ్చినట్లు చెబుతున్నారు. దీంతో..శనివారం జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేయటం సంచలనంగా మారింది. షర్మిల ప్రస్తుతం కాంగ్రెస్ లోనే ఉండటం..తెలంగాణలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న విషయం ఇప్పుడు కొత్త చర్చకు కారణమవుతోంది. దీని పైన వైఎస్ కుటుంబ సభ్యులు ఎలా స్పందిస్తారో చూడాలి.