Breakfast Scheme: ప్రభుత్వ స్కూళ్లలో బ్రేక్ ఫాస్ట్!
యోచిస్తున్న రాష్ట్ర విద్యాశాఖ
వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలుకు యత్నం?
పీఎం పోషణ్ స్కీమ్లో భాగంగా తీసుకొచ్చే ఛాన్స్
నిధుల కోసం కేంద్రానికి విద్యాశాఖ ప్రతిపాదనలు
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ : రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యతనిస్తోంది. ఇప్పటికే ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్కు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. తాజాగా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు (Breakfast Scheme) అల్పాహారం అందించాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా విద్యాశాఖ కూడా కసరత్తు ముమ్మరం చేసినట్లు సమాచారం. వచ్చే ఏడాది నుంచి తెలంగాణలోని అన్ని సర్కారు బడుల్లోని విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్ అందించేలా అడుగులు ముందుకు పడుతున్నాయి. పీఎం పోషణ్ స్కీమ్లో భాగంగా అల్పాహారం అందించాలని విద్యాశాఖ సమాలోచనలు చేస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే నిధుల కోసం విద్యాశాఖ, కేంద్రానికి ప్రతిపాదనలు సమర్పించినట్లు తెలుస్తోంది.
Read Also- Inspirational Story: సెక్యూరిటీ గార్డ్గా పనిచేసి.. అదే కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాడు
తెలంగాణలో ప్రభుత్వ స్కూళ్లు దాదాపు 24 వేల పైచిలుకు ఉన్నాయి. 1 నుంచి 10వ తరగతి వరకు దాదాపు 19 లక్షల మంది ఉంటారు. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం కొనసాగుతుండగా బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ ను కూడా ఇంప్లిమెంట్ చేయాలని భావిస్తున్నారు. తద్వారా సర్కార్ బడుల్లో విద్యార్థుల సంఖ్య పెంచుకునేందుకు సైతం అవకాశం ఉంటుందని పలువురు భావిస్తున్నారు. ఇటీవల తమిళనాడులో ఈ బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ ను ప్రారంభించారు. కాగా ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమిళనాడు పర్యటనలో భాగంగా తెలంగాణలో కూడా ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పుకొచ్చారు. అందుకు అనుగుణంగా విద్యాశాక అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. సీఎం ఆదేశాలతో పీఎం పోషణ్ స్కీమ్ లో భాగంగా దీన్ని ఇంప్లిమెంట్ చేయడంపై విద్యాశాఖ కేంద్రానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిసింది.
Read Also- Nobel Peace Prize: అందుకే ఇవ్వలేదు.. ట్రంప్కి నోబెల్ అవార్డ్ రాకపోవడంపై వైట్హౌస్ స్పందన
రాష్ట్రంలో బీఆర్ఎస్ హయాంలో గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రభుత్వ స్కూళ్లలో బ్రేక్ ఫాస్ట్ విధానాన్ని అమలుచేశారు. దాదాపు నెల రోజుల పాటు ఇది కొనసాగింది. కేవలం మౌఖిక ఆదేశాలతోనే ఈ స్కీమ్ ను అప్పుడు ఇంప్లిమెంట్ చేశారు. కానీ కొద్దిరోజులకే ఈ కార్యక్రమానికి బ్రేక్ పడింది. ఆ తర్వాత బీఆర్ఎస్ ఓడి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఆపై విద్యారంగంపై సీఎం ప్రత్యేక దృష్టిసారించి విద్యార్థులకు నాణ్యమైన విద్యను, సమగ్ర అభివృద్ధిని అందించే లక్ష్యంతో తెలంగాణలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటుకు శ్రీకారంచుట్టారు. ఈ ప్రాజెక్ట్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా రూ.21,000 కోట్ల వ్యయంతో 105 పాఠశాలలను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇన్ ఫ్రా స్ట్రక్చర్ తో పాటు విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ స్కూళ్లలో బ్రేక్ ఫాస్ట్ అందించాలని నిర్ణయించింది. మరి ఈ స్కీమ్ ను వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమలు చేయాలనుకుంటున్న సర్కార్, విద్యాశాఖ అనుకున్న లక్ష్యాలను చేరుకుంటుందా? లేదా? అనేది చూడాలి.
