Corruption Case: అనివీతి అధికారుల ఇళ్లలో సోదాలు చేసినప్పుడు భారీగా డబ్బు, బంగారం, ఇతర విలువైన వస్తువులు, భూములకు సంబంధించిన డాక్యుమెంట్లు బయటపడడం సర్వసాధారణం. ఈ కోవకు చెందిన వార్తలు దేశంలో ప్రతినిత్యం ఏదో ఒక మూలన వెలువడుతూనే ఉంటాయి. కానీ, కొంచెం కొత్తగా ఓ రిటైర్డ్ అవినీతి అధికారి ఇంట్లో సోదాలు నిర్వహించగా, ఏకంగా 17 టన్నుల తేనె బయటపడింది. తేనె ఒక్కటే కాదు, కోట్లాది రూపాయలు విలువ చేసే భారీగా బంగారం, వెండి నగలు వెలుగుచూశాయి. ఈ షాకింగ్ ఘటన మధ్యప్రదేశ్లోని భోపాల్లో (Corruption Case) జరిగింది. మధ్యప్రదేశ్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్లో (PWD) పనిచేసి రిటర్ అయిన మాజీ చీఫ్ ఇంజనీర్ జీపీ మెహ్రా నివాసంలో లోకాయుక్త అధికారులు తనిఖీలు చేయగా భారీగా అక్రమాస్తులు బయటపడ్డాయి.
తవ్విన కొద్దీ అక్రమాస్తులు
మెహ్రా నివాసంతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా భారీగా అవినీతి ఆస్తులను లోకాయుక్త అధికారులు గుర్తించారు. అసాధారణ రీతిలో ఆస్తులు కూడబెట్టినట్టుగా ఆధారాలు దొరికాయి. నిజానికి, తొలుత ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసిన అధికారులు, దర్యాప్తు చేపట్టాక, తవ్వినకొద్దీ నివ్వెరపరిచే విషయాలు బయటకొచ్చాయి. భారీగా అవినీతి సొమ్ము బయటపడింది. ఎంతగా అంటే, ఇంట్లో దొరికిన డబ్బును లెక్కించడానికి ఏకంగా నోట్లు లెక్కించే మెషిన్లను తీసుకెళ్లాల్సి వచ్చింది. అంతేకాదు, రూ. 3 కోట్ల విలువైన బంగారం, కిలోల కొద్ది వెండి నగలు, ఆభరణాలు బయటపడ్డాయని మధ్యప్రదేశ్ లోకాయుక్త అధికారులు వెల్లడించారు. జీపీ మెహ్రాకు చెందిన ఫామ్హౌస్లో ఏకంగా 17 టన్నుల తేనె నిల్వలను గుర్తించి ఆశ్చర్యపోయాయని అధికారులు వివరించారు. తేనె బిజినెస్ చేస్తున్నట్టుగా భావిస్తున్నారు. కాగా, శుక్రవారం ఈ తనిఖీలు చేపట్టారు. ఉదయం 9 గంటల సమయంలో నలుగురు డీఎస్పీ స్థాయి అధికారుల నేతృత్వంలో భోపాల్, నర్మదాపురంతో పాటు మొత్తం నాలుగు ప్రదేశాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టారు. మధ్యప్రదేశ్లో ఇటీవలకాలంలో వెలుగుచూసిన అతిపెద్ద అవినీతి ఘటనగా అధికారులు అభివర్ణిస్తున్నారు.
Read Also- Asteroid Impact: 24 గంటల్లో భూమి అంతమయ్యి అందరం చనిపోతామని తెలిస్తే.. ఏం జరుగుతుందో తెలుసా?
ఒక ఇంట్లో కొన్ని.. మరో నివాసంలో ఇంకొన్ని
రిటైర్డ్ అవినీతి అధికారి జీపీ మెహ్రా తన అక్రమ సంపాదనను ఒకేచోటు దాయలేదు. తెలివిగా వేర్వేరు నివాసాల్లో దాచిపెట్టాడు. భోపాల్లోని మనిపురం కాలనీలో ఉన్న ఒక విలాసవంతమైన ఇంట్లో రూ.8.79 లక్షల క్యాష్, సుమారుగా రూ. 50 లక్షల విలువైన నగలు, రూ. 56 లక్షల విలువైన ఫిక్స్డ్ డిపాజిట్లను అధికారులు గుర్తించారు. ఇక, దానా పానీ అనే ప్రాంతంలో ఉన్న రెండవ ఇంట్లో కూడా భారీగా అక్రమాస్తులను అధికారులు గుర్తించారు. ఒక అపార్ట్మెంట్లో 2.6 కేజీల బంగారం దొరికింది. దీని విలువ రూ.3 కోట్లు పైగానే ఉంటుంది. ఇక, బంగారంతో పాటు రూ.26 లక్షల క్యాష్, 5.5 కిలోల వెండి బయటపడ్డాయని అధికారులు వెల్లడించారు.
Read Also- Sabarimala Gold Controversy: శబరిమలలో ‘బంగారం మిస్టరీ’.. ఎవరీ ఉన్నికృష్ణన్!
అసలు సొమ్మంతా ఫామ్హౌస్లోనే!
జీపీ మెహ్రాకు నర్మదాపురం జిల్లా సోహాగ్పూర్ తాలూకా సైనీ గ్రామంలో ఒక ఫామ్హౌస్ కూడా ఉన్నట్టు లోకాయుక్త అధికారులు గుర్తించారు. అక్రమ సంపాదనకు ఇదొక నిలయంగా ఉందని చెప్పారు. ఏకంగా 17 టన్నుల తేనె దొరికింది ఇక్కడేనని వివరించారు. 6 ట్రాక్టర్లు, నిర్మాణంలో ఉన్న 32 కాటేజీలు, నిర్మాణ పూర్తయిన నివాసాలు, చేపల పెంపకం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చెరువు కూడా ఫామ్హౌస్లో గుర్తించామని అధికారులు తెలిపారు. అంతేకాదు, ఫామ్హౌస్లో ఒక గుడి, గోశాల, లగ్జరీ కార్లు ఉన్నాయన్నారు. లగ్జరీ కార్ల జాబితాలో ఫోర్డ్ ఎండెవర్, స్కోడా స్లావియా, కియా సోనెట్, మారుతి సియాజ్లను గుర్తించామని, ఇవన్నీ మెహ్రా కుటుంబ సభ్యుల పేరిట రిజిస్టర్డ్ అయి ఉన్నాయని వెల్లడించారు. కేటీ ఇండస్ట్రీస్ అనే ఓ కంపెనీని కూడా మెహ్రా నడిపిస్తున్నాడేమోనని అధికారులు అనుమానిస్తున్నారు. కంపెనీకి చెందిన యంత్రాలు, ముడిసరుకు మెహ్రా బంధువుల పేరిట ఉండడం, వారంతా కంపెనీలో భాగస్వాములుగా ఉన్నట్టు పలు డాక్యుమెంట్లను కూడా అధికారులు గుర్తించారు.
