Tech Nationalism: ప్రస్తుతం ప్రపంచమంతటా డిజిటల్ యుగం నడుస్తోంది. పేమెంట్ల నుంచి వైద్యం వరకు, విద్య నుంచి పరిపాలన వరకు, వినోదం నుంచి రక్షణ వరకు.. ఇంటర్నెట్ వినియోగం లేని ప్రపంచాన్ని ఊహించుకోలేనంతగా మానవ జీవితాలు ‘డిజిటలీకరణం’ చెందాయి. ఇప్పటికే సంచలనాలు సృష్టిస్తున్న ఏఐ టెక్నాలజీ, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి అత్యాధునిక డిజిటల్ పరిజ్ఞానాలు రానున్న రోజుల్లో మనుషుల జీవన విధానాల్లో వీడదీయరాని విధంగా చొచ్చుకుపోతాయనడంలో, మరిన్ని విప్లవాత్మక మార్పులను తీసుకొస్తాయనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. అయితే, ఇంటర్నెట్, లేదా డిజిటల్ ప్లాట్ఫామ్స్ కారణంగా సంభవించే పరిణామాలకు సైడ్ ఎఫెక్ట్లు కూడా ఉంటాయి. గుర్తించి మేల్కొనకపోతే ప్రతికూల ప్రభావాలను కూడా చవిచూడాల్సి ఉంటుంది. ఈ సత్యాన్ని గ్రహించిన కేంద్ర ప్రభుత్వం దేశవాసులను తట్టిలేపే ఆచరణ మొదలుపెట్టింది. ‘డేటా సార్వభౌమత్వం’ లక్ష్యంగా, దేశీయ డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా (Tech Nationalism) ప్రయత్నాలను ముమ్మరం చేసింది.
గూగుల్ వొద్దు.. జోహో ముద్దు
కేంద్ర హోమంత్రి అమిత్ షా బుధవారం (అక్టోబర్ 8) నాడు సోషల్ మీడియా వేదికగా కీలక ప్రకటన చేశారు. ‘దయచేసి గమనించండి.. నేను జోహో మెయిల్కు మారిపోయాను. నా కొత్త ఈ-మెయిల్ అడ్రెస్ amitshah.bjp@zohomail.in. అని గమనించగలరు’ అనేది ఈ ప్రకటన సారాంశం. అమిత్ షా కంటే కొన్నివారాల ముందుగానే మరో కేంద్రమంత్రి అశ్వనీ వైష్ణవ్ కూడా జోహో మెయిల్ అకౌంట్ ఓపెన్ చేశారు. అకస్మాత్తుగా చోటుచేసుకుంటున్న ఈ డిజిటల్ పరిణామక్రమానికి బలమైన కారణాలే పునాదులుగా నిలిచాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతీయ దిగుమతులపై జరిమానా పేరిట ఇష్టానురీతిన భారీ స్థాయిలో సుంకాలు విధించడం, మరోపక్క భారతీయ ఐటీ నిపుణులకు అత్యంత ముఖ్యమైన హెచ్-1బీ వీసా ఫీజులను అమాంతం లక్ష డాలర్లకు పెంచిన పరిణామాలు.. దేశం స్వావలంబన దిశగా అడుగులు వేయాల్సిన ఆవశ్యకతను చాటిచెప్పాయి. జీఎస్టీ రేట్లు హేతుబద్దీకరించి, అమలు పరచడానికి ఒక్కరోజు ముందు ప్రధాని నరేంద్ర మోదీ ఈ మేరకు దేశవాసులకు స్పష్టమైన పిలుపునిచ్చారు. భారతీయ వాసులంతా స్వదేశీ వస్తువులను, సేవలను ఉపయోగించాలంటూ కోరారు. ఈ పిలుపు అందిపుచ్చుకొని తొలుత అశ్వని వైష్ణవ్ ‘జోహో మెయిల్’ ఓపెన్ చేశారు. ఆ తర్వాత జోహో మెయిల్ ఓపెన్ చేసే కేంద్ర ప్రభుత్వ ప్రతినిధుల, సాధారణ పౌరుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
‘అరట్టై’ డౌన్లోడ్స్ పెరిగాయ్..
ప్రస్తుతం ప్రతిఒక్కరి స్మార్ట్ఫోన్లలో ఇన్స్టాల్ అయి ఉన్న ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ ‘వాట్సప్’ విదేశీ కంపెనీకి చెందినదే. అయితే, దేశీయ ప్లాట్ఫామ్లను వినియోగించాలంటూ కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో జోహో కంపెనీ కొన్నాళ్ల క్రితమే సొంతంగా డెవలప్ చేసిన ‘అరట్టై’ యాప్ను ఇన్స్టాల్ చేసుకునేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. స్వయంగా కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులే ప్రచారం కల్పిస్తుండడం ఇందుకు దోహదపడుతుంది. కాగా, జోహో మెయిల్తో పాటు, అరట్టై యాప్లలో నిక్షిప్తమయ్యే యూజర్ల డేటా మొత్తం భారతదేశంలోనే స్టోర్ చేస్తారు. ఇక్కడి సర్వర్లలోనే భద్రంగా ఉంటుంది. కాబట్టి, భారతీయులకు డేటా భద్రత, వ్యక్తిగత గోప్యత విషయంలో ఎలాంటి ముప్పు ఉండబోదు. జోహో కంపెనీని భారతీయుడు అయిన శ్రీధర్ వెంకటాచారి (Sridhar Vembu) 1996లో స్థాపించారు. ఇప్పటికే 50కి పైగా దేశాల్లో వినియోగదారులు ఉన్నారు. తెలుగు రాష్ట్రాలు, తమిళనాడుకు చెందినవారికి కంపెనీలో ఉద్యోగావకాశాలు దొరుకుతున్నాయి.
Read Also- Vi Recharge offers: అన్లిమిటెడ్ డేటాతో వి కొత్త ప్యాక్.. జియో హాట్ స్టార్ కూడా ఫ్రీ?
విదేశీ ప్లాట్ఫామ్స్తో ఎన్నో అనర్థాలు!
సుమారుగా 140 మంది కోట్ల జనాభా ఉన్న మనదేశంలో వేర్వేరు సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్స్ను, అనేక ఇంటర్నెట్ మాధ్యమాలను, డిజిటల్ పరికరాలను, ఇంటర్నెట్ ఆధారితమైన ఇంకా చాలా వస్తువులను విరివిగా వాడుతున్నారు. ఇందుకోసం అవసరమైన ఈ-మెయిల్ అకౌంట్లను ఎక్కడ ఓపెన్ చేస్తున్నారో గమనిస్తే, గ్లోబల్ ఐటీ దిగ్గజాలైన మైక్రోసాఫ్ట్, గూగుల్, సేల్స్ఫోర్స్ వంటి విదేశీ కంపెనీలు మాత్రమే కనిపిస్తాయి. ‘జోహో’ అనే ఒక భారతీయ ఐటీ కంపెనీ ఉందనే విషయం చాలామంది భారతీయులకు తెలియని కూడా తెలియదు. విదేశీ ఐటీ కంపెనీలను ఈ స్థాయిలో ఎంకరేజ్ చేయడం ఏమంత మంచిది కాదు. మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి కంపెనీలన్నీ వేర్వేరు ప్లాట్ఫామ్స్ ద్వారా మన డేటాను సేకరించి, విదేశాల్లో స్టోర్ చేస్తాయి. డేటా మొత్తం ఇతర దేశాల్లోని సర్వర్లలో స్టోర్ అవుతుంది కాబట్టి, ఆయా దేశాల ప్రభుత్వం లేదా సంస్థలు మన అనుమతి లేకుండానే డేటాను యాక్సెస్ చేసుకునే ముప్పు ఉంటుంది. తద్వారా సైబర్ దాడులు, డేటా లీక్లకు ఆస్కారం ఉంటుంది. అంతేకాదు, జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంటుంది. భారతీయ చట్టాలను పాటించవు కాబట్టి, ప్రభుత్వ, సైనిక డేటా విదేశీ ప్లాట్ఫామ్స్ చేతుల్లో ఉంటుంది. అంతేకాదు, లైసెన్స్, సబ్స్క్రిప్షన్, యాడ్స్ ఇలా ఆదాయం మొత్తం విదేశీ కంపెనీలకే పోతోంది. దేశీయ సంస్కృతి, భాషల ప్రాముఖ్యత కూడా తగ్గిపోతుంది. స్థానిక బిజినెస్లు, స్టార్టప్లకు నష్టాన్ని చేకూర్చుతాయి.
