– ఇప్పటికే పూర్తయిన కాంట్రాక్టర్ల విచారణ
– నిపుణుల కమిటీతో గురువారం భేటీ
– ఇప్పటికే 50 మంది విచారణ
– కమిషన్ ముందుకు రానున్న మరో 50 మంది
– కోడ్ కారణంగా ఆలస్యమైన విచారణ
– మరో 2 నెలల పొడిగింపునకు సర్కార్ యోచన
– బిజీబిజీగా సాగుతున్న పీసీ ఘోష్ కమిషన్
PC Ghosh Commission: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకల మీద తెలంగాణ ప్రభుత్వం నియమించిన పీసీ ఘోష్ కమిటీ తనదైన శైలిలో చేపట్టిన విచారణ ఇప్పుడు తెలంగాణలో సంచలనంగా మారుతోంది. మంగళ, బుధ వారాల్లో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను నిర్మించిన ఇంజనీరింగ్ సంస్థలు, వాటిలో కీలక బాధ్యతల్లో ఉన్న అధికారులను కమిషన్ విచారించింది. షూటింగ్ వెలాసిటీ సమస్య, ఇసుక మేట వేయడం, ప్రతి సంవత్సరం ఇసుక తొలగించాల్సి ఉండగా అలా చేయకపోవడం తదితర అంశాల గురించి బుధవారం వారి నుంచి కమిషన్ సమాచారం రాబట్టింది. కాగా, గురువారం మరోమారు నిపుణుల కమిటీతో సమావేశమైంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ ప్రక్రియలో భాగంగా వివిధ విభాగాల్లో నిపుణులతో కూడిన కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనికి జేఎన్టీయూ ప్రొఫెసర్ సీబీ కామేశ్వరరావు ఛైర్మన్గా ఉండగా, విశ్రాంత సీఈ సత్యనారాయణ, వరంగల్ నిట్ ప్రొఫెసర్ రమణమూర్తి, ఓయూ ప్రొఫెసర్ రాజశేఖర్ సభ్యులుగా, ఈఎన్సీ అనిల్కుమార్ కన్వీనర్గా ఉన్నారు. ఈ కమిటీ ఇప్పటికే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, అక్కడి సమస్యలు, వాటికి గల కారణాలపై లోతుగా అధ్యయనం చేసింది. విచారణలో ఎవరు ఏమేమి చెప్పిందీ స్పష్టంగా రికార్డు చేయాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు.
గురువారం ఈ కమిటీ తమ అధ్యయనంలో తాము పరిశీలించిన అంశాలను జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్కు వివరించింది. అయితే, ఈ విచారణలో ఇంకా అనేక విషయాలపై స్పష్టత రావాల్సి ఉన్నందున కమిషన్ గడువును ప్రభుత్వం మరో రెండు నెలలు పొడిగించనున్నట్లు తెలుస్తోంది. నిజానికి 100 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసి జూన్ వరకు నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం కోరినా, పార్లమెంటు ఎన్నికల కోడ్ మూలంగా 40 రోజులు విచారణలో జాప్యం జరిగింది. ఈ కమిటీ ఇప్పటివరకు 50 మందిని నేరుగా ప్రశ్నించి సమాచారం రాబట్టగా, మరో 50 మందిని విచారించాల్సి ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు విజిలెన్స్, కాగ్ రిపోర్టులనూ కమిటీ పరిశీలించాల్సి ఉంది. దీంతో ప్రభుత్వం మరో 2 నెలలు గడువు ఇవ్వనున్నట్లు సమాచారం.
ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ ఏడో బ్లాక్ కుంగుబాటు, పియర్స్, గేట్లు దెబ్బతినడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో సీపేజీలతో సహా పలు సమస్యలపై విచారణ కొనసాగుతోంది. హైడ్రాలజీ, నిపుణుల కమిటీ ఇంజినీర్లు ఇచ్చిన సమాచారం, క్షేత్రస్ధాయిలో తాము గమనించిన అంశాలతో కమిషన్.. రెండు వారాల్లో ఒక మధ్యంతర నివేదికను ఇవ్వటంతో బాటు వీలున్నంత త్వరగా పూర్తిస్ధాయి నివేదికను అందించే రీతిలో పనిచేయాలని కమిషనర్ పీసీ ఘోష్ రెండు కమిటీల ఇంజినీర్లను ఆదేశించించారు. టెక్నికల్ అంశాల విషయంలో అన్ని వివరాలతో కూడిన అఫిడవిట్ ఫైల్ చేయాలని కూడా ఆయన నిపుణుల కమిటీలకు సూచించారు.