Jubilee Hills By-Election: జూబ్లీహిల్స్ (Jubilee Hills By-Election) అసెంబ్లీ ఉప ఎన్నికకు సంబంధించి ఎన్నికల కోడ్ ఆఫ్ కండక్ట్ ఆ నియోజకవర్గానికే పరిమితం కానుంది. ఎన్నికలు జరిగే అసెంబ్లీ సెగ్మెంట్ రాష్ట్ర రాజధాని, మెట్రోపాలిటన్ సిటీ లేదా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నందున, కోడ్ ఆఫ్ కండక్ట్ కేవలం ఆ నియోజకవర్గం పరిధి వరకే వర్తిస్తుందని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఉప ఎన్నికపై ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
Also Read: Jubilee Hills By-election: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కొత్త రూల్స్.. రాజకీయ పార్టీలకు ఈసీ కీలక సూచనలు
కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చింది
ఈ నెల 6న ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన వెంటనే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చిందన్నారు. ఎన్నికల నిబంధనలను రాజకీయ పార్టీలు, ప్రతినిధులు తప్పక పాటించాలని సూచించారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో, పారదర్శకంగా ఉప ఎన్నికను నిర్వహించేందుకు అన్ని పార్టీలు సహకరించాలని కర్ణన్ కోరారు. అయితే, ఓటర్లను ప్రభావితం చేసేందుకు ఎవరైనా నగదు, లిక్కర్ పంపిణీ లేదా ఇతర ప్రలోభాలు నియోజకవర్గం వెలుపల చేస్తున్నట్లు గుర్తిస్తే చర్యలు తప్పవని అల్టిమేటం జారీ చేశారు. కోడ్ ఉల్లంఘనలు జరిగితే బాధ్యులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
కలర్ ఫొటోలు
ఈ ఉప ఎన్నికలో ప్రత్యేకంగా ఈవీఎంలపై అభ్యర్థుల కలర్ ఫొటోలు పెట్టనున్నట్లు కర్ణన్ వెల్లడించారు. తెలంగాణలో ఈవీఎంలపై కలర్ ఫొటోలు పెట్టడం ఇదే తొలిసారి అని ఆయన తెలిపారు. అంతేకాకుండా, పోటీ చేసే అభ్యర్థుల నేర చరిత్రను అన్ని రాజకీయ పార్టీలు తప్పనిసరిగా ప్రజలకు తెలియజేయాలని, ఇందుకు ప్రచార మాధ్యమాలను వినియోగించాలని ఆదేశించారు. షేక్పేట తహశీల్దార్ ఆఫీస్లో రిటర్నింగ్ ఆఫీసర్ (ఆర్వో) కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ నెల 13 నుంచి నామినేషన్లను స్వీకరిస్తామని చెప్పారు. నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగేందుకు కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు.
ప్రకటనలు వద్దు
ప్రభుత్వ ఆస్తులపై ఎలాంటి రాజకీయ ప్రకటనలు ఏర్పాటు చేయవద్దని, ప్రైవేట్ ఆస్తులపై ప్రకటనలకు అనుమతి తీసుకోవాలని సూచించారు. అనుమతి లేకుండా మళ్లీ ప్రచార ప్రకటనలు పెడితే తొలగించి, ఆ ఖర్చును బాధ్యులైన పార్టీ ఖాతాల్లో వేస్తామని, కేసు కూడా నమోదు చేస్తామని జిల్లా ఎన్నికల అధికారి హెచ్చరించారు. జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాలు, సూచనలు తప్పకుండా పాటించాలని, ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవని కర్ణన్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఎన్నికల అదనపు కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్, డీసీపీ అపూర్వ రావు, రిటర్నింగ్ అధికారి పి. సాయిరాం, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
Also Read: Cough Syrup: తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఆ రెండు దగ్గు మందులపై నిషేధం
