– అక్రమ నిర్మాణాలపై హెచ్ఎండీఏ నజర్
– 2, 3 ఫ్లోర్లకు అనుమతి తీసుకుని ఆరేడు అంతస్తుల నిర్మాణాలు
– నార్సింగి పరిధిలో కూల్చివేతలు
– 111 జీవో పరిధిలో 10 కి.మీ. వరకు నిర్మాణాలు కుదరదన్న అధికారులు
Land Encroachment: కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారులు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. అక్రమార్కుల వెన్నులో వణుకు పుట్టిస్తున్నారు. కబ్జాలు, అక్రమ నిర్మాణాలపై వరుసగా కొరడా ఝులిపిస్తున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లా నార్సింగి మున్సిపాలిటీ పరిధిలో అక్రమ నిర్మాణాలపై ఫోకస్ పెట్టారు. 111 జీవో పరిధిలో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో హెచ్ఎండీఏ అధికారులు రంగంలోకి దిగారు.
గౌలిదొడ్డిలో అనుమతులు లేని నిర్మాణాన్ని కూల్చివేశారు. 2, 3 ఫ్లోర్లకు అనుమతి తీసుకుని 6, 7 అంతస్తులు నిర్మించినట్టు అధికారులు గుర్తించి చర్యలు తీసుకున్నారు. గ్యాస్ కట్టర్ ద్వారా స్లాబులను తొలగించారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో ఎలాంటి అంవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తుతో కూల్చివేత ప్రారంభించారు హెచ్ఎండీఏ అధికారులు. దీనిపై మున్సిపల్ అధికారులు వివరణ ఇస్తూ, 111 జీవో పరిధిలో 10 కిలోమీటర్ల మేర నిర్మాణాలు చేపట్టవద్దని హెచ్చరించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ జీవోను ఎత్తివేయడంతో భారీ ఎత్తున అక్రమ కట్టడాలు నిర్మించారని, వాటిని గుర్తిస్తున్నట్టు తెలిపారు. దీనిపై అప్పట్లో రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారని గుర్తు చేశారు. అధికారుల ఆదేశాల మేరకు కూల్చివేతలు మొదలు పెట్టామని మున్సిపల్ అధికారులు క్లారిటీ ఇచ్చారు.