Actress Hema: బెంగళూరు రేవ్ పార్టీ, డ్రగ్స్ కేసులో అరెస్టయిన నటి హేమకు ఊరట లభించింది. గురువారం ఆమెకు ముందస్తు బెయిల్ను కోర్టు మంజూరు చేసింది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో ఆమె గురువారం జైలు నుంచి విడుదల కానున్నారు. ఈ నెల 3వ తేదీన బెంగళూరు రేవ్ పార్టీ కేసులో బెంగళూరు సీసీబీ పోలీసులు హేమను అరెస్టు చేశారు. కోర్టులో హాజరు పరచగా ఈ నెల 14వ తేదీ వరకు జ్యుడీషియల్ కస్టడీకి కోర్టు అనుమతించింది. తాజాగా, ఆమె వేసిన బెయిల్ పిటిషన్ను విచారించి యాంటిసిపేటరీ బెయిల్ను మంజూరు చేసింది.
గత నెల బెంగళూరులోని హెబ్బగోడిలోని ఓ ఫామ్హౌజ్లో రేవ్ పార్టీ నిర్వహించారు. ఈ సమాచారం అందుకున్న సెంట్రల్ క్రైమ్ పోలీసులు ఆకస్మికంగా రెయిడ్ చేశారు. సుమారు 100 మందిని అదుపులోకి తీసుకున్నారు. స్పాట్లో డ్రగ్స్ కూడా లభించింది. అదుపులోకి తీసుకున్నవారిని ప్రాథమికంగా విచారించి కేసు నమోదు చేసి విడుదల చేశారు. ఆ తర్వాత హేమను విచారణకు హాజరు కావాలని పలుమార్లు నోటీసులు పంపగా ఆమె గైర్హాజరయ్యారు. ఈ నెల 3వ తేదీన విచారణకు హాజరు కావడానికి బెంగళూరుకు వెళ్లగా.. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆమెకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఈ కస్టడీలో భాగంగా పరపన్న అగ్రహారం జైలులో హేమను ఉంచారు.
హేమను అదుపులోకి తీసుకోగానే.. ఆమె తరఫు న్యాయవాది కోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై ఉభయ పక్షాల వాదనలు విన్న కోర్టు ఆమెకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. సీసీబీ కోరితే తప్పకుండా విచారణకు హాజరు కావాలనే షరతుతో ఆమెకు బెయిల్ మంజూరైంది.