Supreme Court: దేశ సర్వోన్నత న్యాయస్థానంలో సంచలన ఘటన చోటుచేసుకుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ పై ఓ లాయర్ దాడికి యత్నించారు. కేసు విచారణ సందర్భంగా.. కాలికి ఉన్న బూటు తీసి సీజేఐ పైకి అతడు విసరబోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో ఒక్కసారిగా సుప్రీంకోర్టు ప్రాంగణం షాక్ కు గురైనట్లు సమాచారం.
వివరాల్లోకి వెళ్తే..
భారత సుప్రీం కోర్టులో సోమవారం నాటకీయ పరిణామం చోటుచేసుకుంది. బార్ అండ్ బెంచ్ (Bar and Bench) తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం సీజేఐ నేతృత్వంలోని బెంచ్ ఓ అంశంపై విచారణ జరిపింది. ఈ క్రమంలో న్యాయవాది కిశోర్ రాకేష్ (Kishore Rakesh).. ఒక్కసారిగా సీజేఐ కూర్చొని ఉన్న బెంచ్ వద్దకు పరిగెత్తుకెళ్లారు. తన బూటును తీసి దాడి చేసేందుకు యత్నించారు. వెంటనే అప్రమత్తమైన సుప్రీంకోర్టు భద్రతా సిబ్బంది అతడ్ని అడ్డుకున్నారు. కోర్డు గది నుంచి బయటకు తీసుకెళ్లారు.
సనాతన ధర్మంపై నినాదాలు
అయితే కోర్టుకు నుండి బయటకు తీసుకెళ్తున్న క్రమంలో లాయర్ కిశోర్ రాకేష్ నినాదాలు చేసినట్లు తెలుస్తోంది. ‘సనాతన ధర్మాన్ని అవమానించడాన్ని మేము సంహించము’ అంటూ బిగ్గరగా కేకలు వేసినట్లు బార్ అండ్ బెంచ్ నివేదిక తెలియజేసింది.
‘నన్ను ప్రభావితం చేయలేవు’
దాడి ఘటన సుప్రీంకోర్టులో కలకలం రేపినప్పటికీ.. సీజేఐ బి.ఆర్. గవాయ్ ఎంతో ప్రశాంతంగా వ్యవహరించారు. తిరిగి యధావిధిగా విచారణను ప్రారంభించారు. ఇలాంటి ఘటనలు తన దృష్టిని మరల్చలేవని.. తనను ఏమాత్రం ప్రభావితం చేయలేవని సీజేఐ స్పష్టం చేశారు.
Also Read: BSNL Plan: దీపావళికి ముందు BSNL బిగ్ ఆఫర్.. ఇంతకంటే చీప్ రీఛార్జ్ ప్లాన్ ఇంకోటి ఉండదేమో..!
భద్రతపై ఆందోళనలు
అయితే ఈ దాడి ఘటనలో సీజేఐకి ఎలాంటి ముప్పు జరగనప్పటికీ.. సుప్రీంకోర్టులో భద్రతా ఏర్పాట్లపై ప్రశ్నకు తావిచ్చింది. న్యాయమూర్తుల భద్రతకు సంబంధించి.. ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే విపత్కర పరిస్థితిని ఎదుర్కొన్నప్పటికీ సీజేఐ చూపిన ధైర్యం, స్థిరత్వం.. అక్కడి వారి ప్రశంసలు అందుకునేలా చేసింది.
