– ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
– ఛార్జ్షీట్ దాఖలు చేసిన పోలీసులు
– మార్చి 10న ఎఫ్ఐఆర్
– కేసులో నిందితులుగా ఆరుగురు
– ఇప్పటిదాకా నలుగురి అరెస్ట్
– భుజంగరావు, తిరుపతన్న బెయిల్ పిటిషన్లపై కోర్టులో విచారణ
– వాదనలు పూర్తి.. రేపు తీర్పు
Telangana: సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఓవైపు కోర్టులో బెయిల్ పిటిషన్లపై వాదనలు కొనసాగుతుండగా, ఇంకోవైపు పోలీసులు తమ పని కానిచ్చేస్తున్నారు. తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన ఛార్జ్షీట్ను దాఖలు చేశారు. మార్చి 10న ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు తెలిపారు. మొత్తం ఆరుగురిని నిందితులుగా చేర్చిన పోలీసులు, ఇప్పటి వరకు నలుగురిని అరెస్ట్ చేసినట్టుగా పేర్కొన్నారు.
బెయిల్ కోసం నిందితులు భుజంగరావు, తిరుపతన్న దాఖలు చేసిన పిటిషన్లపై మంగళవారం నాంపల్లి కోర్టులో వాదనలు జరగగా, ఛార్జ్షీట్ విషయాన్ని వెల్లడించారు పోలీసులు. రాజకీయ దురుద్దేశంతోనే తమను అరెస్టు చేసినట్టు నిందితులు వాదనలు వినిపించగా, ఛార్జ్షీట్ దాఖలు చేసినప్పటికీ ఇంకా విచారించాల్సింది చాలా ఉంది కాబట్టి బెయిల్ మంజూరు చేయొద్దన్న పీపీ వాదించారు. ఇరువురి తరఫున వాదనలు పూర్తయ్యాయి. న్యాయస్థానం తీర్పును రేపు వెల్లడిస్తామని తెలిపింది.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాజకీయ, సినీ ప్రముఖులు, వ్యాపారస్తుల ఫోన్లు ట్యాప్ అయ్యాయనే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే, ఈ కేసుపై దృష్టి పెట్టింది. పోలీసులకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చి కేసు విచారణకు ఆదేశించింది. ఈ క్రమంలోనే మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు అరెస్ట్ అయ్యాడు. ఆ తర్వాత ఎస్పీలు తిరుపతన్న, భుజంగరావును అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అనంతరం టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావును అరెస్ట్ చేశారు. కేసులో ప్రధాన నిందితుడిగా ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును పేర్కొన్నారు. అరెస్ట్ అయిన వారంతా ప్రభాకర్ రావు ఆదేశాలతోనే చేశామని తమ వాంగ్మూలాల్లో ఒప్పుకున్నారు. తాజాగా కేసులో ఛార్జ్షీట్ దాఖలు కావడంతో ఈ కేసులో ఇంకెలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో అనేది ఆసక్తికరంగా మారింది.