Cyber Crime: ఒత్తిడికి గురై గుండెపోటు.. రిటైర్డ్ డాక్టర్ మృతి
ఇద్దరిని అరెస్ట్ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: డిజిటల్ అరెస్ట్ పేరిట సైబర్ క్రిమినల్స్ బెదిరింపులకు పాల్పడడంతో మానసిక ఒత్తిడి లోనై, గుండెపోటుకు దారితీసి ఓ రిటైర్డ్ డాక్టర్ మరణించారు. ఈ కేసులో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు శనివారం ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. సైబర్ క్రైమ్ (Cyber Crime) డీసీపీ దార కవిత తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్కు చెందిన ఓ వృద్ధురాలు మలక్పేట ఏరియా ఆస్పత్రిలో సివిల్ సర్జన్ రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్గా పని చేసి పదవీ విరమణ పొందారు. కాగా, ఈనెల 5న ఆమెకు వాట్సప్ నుంచి వీడియో కాల్ చేసిన సైబర్ నేరగాళ్లు తమను తాము బెంగళూరు పోలీసులుగా చెప్పుకొన్నారు. మానవ అక్రమ రవాణా కేసుతో సంబంధం ఉన్నట్టుగా తమ విచారణలో బయట పడిందంటూ ఆమెను బెదరగొట్టారు.
Read Also- TVK Rally Stampede: తమిళ హీరో విజయ్ ర్యాలీలో భారీ తొక్కిసలాట.. పెద్ద సంఖ్యలో మరణాలు
సుప్రీంకోర్టు, ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టర్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి జారీ అయినట్టుగా ఫోర్జరీ పత్రాలు చూపించి కేసులో అరెస్ట్ కావటం ఖాయమని భయపెట్టారు. దాంతో డాక్టర్గా పని చేసిన ఆ వృద్ధురాలు ఎక్కడ తన పరువు పోతుందోనన్న భయంతో యూనియన్ బ్యాంక్లోని తన పెన్షన్ ఖాతా నుంచి సైబర్ క్రిమినల్స్ చెప్పిన ఐసీఐసీఐ బ్యాంక్ అకౌంట్కు రూ.6.60 లక్షలు బదిలీ చేసింది. అయితే, ఆ తరువాత కూడా సైబర్ క్రిమినల్స్ మరింత డబ్బు బదిలీ చేయాలని మరో మూడు రోజులపాటు ఆమెను బెదిరిస్తూ వచ్చారు. ఈ ఒత్తిడితో గుండెపోటుకు గురైన ఆమె చనిపోయింది. ఈ మేరకు వృద్ధురాలి కుమారుడు ఫిర్యాదు చేయగా సీసీఎస్ పోలీసులు కేసులు నమోదు చేశారు.
Read Also- Cow Rescue: భారత పర్యటనలో ఉన్న ఈ ఆస్ట్రేలియా టూరిస్ట్ని ఎంత మెచ్చుకున్నా తక్కువేనేమో!
కాగా, ఈ కేసులో సైబర్ క్రైమ్ సీఐ మట్టం రాజు, హెడ్ కానిస్టేబుల్ సునీల్ కుమార్, కానిస్టేబుళ్లు అశోక్, సుదర్శన్, సాయినాథ్, రాజేందర్ లతో విచారణ జరిపారు. మోసంతో సంబంధం ఉన్న మహారాష్ట్ర కోల్హాపూర్ జిల్లాకు చెందిన విశ్వాస్ దత్తాత్రేయ, మిరాజే, శంకర్ సుపూర్లను అరెస్ట్ చేశారు. విచారణలో ఈ ఇద్దరు కమీషన్కు కక్కుర్తి పడి తమ తమ బ్యాంక్ ఖాతాలను సైబర్ క్రిమినల్స్కు సమకూర్చినట్టుగా వెల్లడైంది.
Read Also- YSRCP: రికార్డుల నుంచి తొలగింపు కాదు.. సభలో క్షమాపణ చెప్పాలి.. బాలయ్య వివాదంపై వైసీపీ డిమాండ్