CM Revanth Reddy: దిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ట్రంప్ తో పోల్చారు. ప్రజలు ఆయన్ను పక్కన పెట్టేశారని సెటైర్లు వేశారు. దిల్లీ జరిగిన పబ్లిక్ ఎఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా (PAFI) 12వ వార్షిక సదస్సులో సీఎం రేవంత్ పాల్గొని మాట్లాడారు. పరిపాలన చేసేందుకు రాజకీయ సంకల్పం ఎంతో అవసరమని ఆయన స్పష్టం చేశారు. భవిష్యత్ తరాలకు అవకాశాలను సృష్టించాలనేది తమ ఆలోచని రేవంత్ పేర్కొన్నారు.
తెలంగాణ విజన్ – 2047
దేశంలోనే యంగెస్ట్ స్టేట్ (కొత్త రాష్ట్రం)గా తెలంగాణ ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘కొత్త రాష్ట్రమైనా తెలంగాణకు, హైదరాబాద్కు ఘనమైన చరిత్ర ఉంది. తెలంగాణ సర్వతోముఖాభివృద్ధికి తెలంగాణ విజన్ డాక్యుమెంట్-2047 రూపొందించాం. తెలంగాణను కోర్ అర్బన్, సెమీ అర్బన్, రూరల్గా విభజించాం. కోర్ అర్బన్ ఏరియాలో కోటి మంది నివసిస్తున్నారు. ఇక్కడ కాలుష్యకారక పరిశ్రమలను నగరం వెలుపలికి తరలిస్తున్నాం. సెమీ అర్బన్ ఏరియాను తయారీ రంగం జోన్ గా (మాన్యుఫాక్చర్) నిర్ణయించాం’ అని రేవంత్ రెడ్డి అన్నారు.
మెట్రో విస్తరణపై..
హైదరాబాద్ లో మెట్రో విస్తరణ పనుల గురించి కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. ‘తెలంగాణలో అభివృద్ధికి తగినట్లు 70 కిలోమీటర్లు ఉన్న మెట్రోను 150 కిలోమీటర్లు పొడిగించాలని నిర్ణయించాం. ప్రస్తుతం అయిదు లక్షల మంది మెట్రోలో పయనిస్తున్నారు.. దానిని 15 లక్షలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. సబర్మతీ తీరంలా మూసీని మారుస్తాం. అందుకు మూసీ పునరుజ్జీవంపై దృష్టి సారించాం. హైదరాబాద్లో ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం చేపడుతున్నాం. 2027 నాటికి హైదరాబాద్లో ఎలక్ట్రిక్ వాహనాలే ఎక్కువగా ఉండనున్నాయి.. అందుకే ఈవీలకు రాయితీలు ప్రకటించాం. రాష్ట్ర అవసరాలకు తగినట్లు రీజినల్ రింగ్ రోడ్ నిర్మాణం నిర్మిస్తున్నాం. భవిష్యత్ అవసరాలకు తగినట్లు భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేశాం’ అని రేవంత్ పేర్కొన్నారు.
పెట్టుబడిదారులకు పిలుపు
తెలంగాణలో పెట్టుబడులకు ఆహ్వానం పలుకుతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ‘పెట్టుబడిదారులకు మద్దతుగా నిలుస్తాం. తెలంగాణలో పెట్టే పెట్టుబడులకు భద్రత ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా డ్రగ్స్ సమస్య ఉంది.. మేం తెలంగాణలో డ్రగ్స్ను కంట్రోల్ చేశాం. డ్రగ్స్ నిర్మూలనలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. తెలంగాణలో పెట్టుబడులు పెట్టి తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్లుగా మారండి. జ్ఞానంతో పాటు నైపుణ్యం అవసరం. యువతలో నైపుణ్యాలు పెంచేందుకు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశాం. మహాత్మా గాంధీ యంగ్ ఇండియా స్ఫూర్తిని అనుసరిస్తున్నాను. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో చదువుకున్న వాళ్లకు ఉద్యోగాలు వస్తాయి’ అని సీఎం రేవంత్ అన్నారు.
గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే
స్పోర్ట్స్లో దక్షిణ కొరియా వంటి చిన్న దేశాలకు వచ్చే మెడల్స్ చూస్తే ఆశ్చర్యం కలుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘ఒలింపిక్స్ పతకాల సాధనే లక్ష్యంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేశాం. తెలంగాణకు భూపరివేష్టిత రాష్ట్రం (ల్యాండ్ లక్డ్) కావడంతో ఓడ రేవు లేదు. మచిలీపట్నం ఓడ రేవు అనుసంధానానికి ఫ్యూచర్ సిటీ నుంచి గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే.. దానికి సమాంతరంగా రైల్వే లైన్ మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరుతున్నాం. 2025 డిసెంబర్ 9 న తెలంగాణ విజన్ డాక్యుమెంట్ విడుదల చేస్తాం’ అని అన్నారు.
Also Read: Post Office vs Bank: పోస్టాఫీస్ వర్సెస్ బ్యాంక్.. మీ డబ్బును ఎందులో డిపాజిట్ చేస్తే బెటర్!
కేసీఆర్ పై పరోక్ష విమర్శలు
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి పరోక్షంగా విమర్శలు చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాలతో అమెరికాకే ఎక్కువగా నష్టం. ట్రంప్ ఒకరోజు మోదీ నా ఫ్రెండ్ అంటాడు.. మరో రోజు అడ్డగోలుగా సుంకాలు వేస్తారు. తెలంగాణలో ఒక ట్రంప్ ఉండేవాడు. ఆయనను తెలంగాణ ప్రజలు పక్కనపెట్టారు. రాత్రి వచ్చిన ఆలోచనను తెల్లారే అమలు చేయడం సాధ్యం కాదు’ అని రేవంత్ అన్నారు.