– ఈనెల 9న గ్రూప్-1 పరీక్ష
– వాయిదా వేయాలని పిటిషన్ వేసిన కొందరు అభ్యర్థులు
– హైకోర్టులో విచారణ.. వాయిదా కుదరదని తీర్పు
ఉత్కంఠ వీడింది. గ్రూప్-1 పరీక్ష వాయిదాపై హైకోర్టు తీర్పు వచ్చేసింది. పరీక్షను వాయిదా వేసేందుకు న్యాయస్థానం అంగీకరించలేదు. దీంతో ఈనెల 9న యథావిధిగా ఎగ్జామ్ కొనసాగనుంది.
వాయిదాకు పలువురి అభ్యర్థన
షెడ్యూల్ ప్రకారం ఈ నెల 9న గ్రూప్-1 పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది టీజీపీఎస్సీ. కానీ, అదే రోజున కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్-1, ఎగ్జిక్యూటివ్ పోస్టులకు స్క్రీనింగ్ పరీక్ష జరగనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో జరిగే గ్రూప్-1 పరీక్షను వాయిదా వేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ ఎం గణేష్, భూక్యా భరత్ అనే అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం, చట్ట ప్రకారం నిర్ణయం తెలియజేయాలని టీజీపీఎస్సీకి తెలిపింది.
హైకోర్టులో వాదనలు
హైకోర్టు ఆదేశాలతో అన్ని వివరాలు వెల్లడించింది టీజీపీఎస్సీ. తాజాగా న్యాయస్థానంలో వాదనలు వినిపించింది. ప్రిలిమ్స్ కోసం 4,03,645 మంది దరఖాస్తు చేసుకున్నారని, వారందరూ పరీక్షకు సిద్ధమయ్యారని వివరించింది. కొందరి కోసం లక్షల మందిని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని అభిప్రాయపడింది. ఈ పరిస్థితుల్లో వాయిదా వేయడం కుదరదని కోర్టుకు తన అభిప్రాయాన్ని వెల్లడించింది. ఇరు పక్షాల వాదనల తర్వాత జస్టిస్ పుల్లా కార్తీక్ గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష వాయిదా వేయడానికి నిరాకరిస్తూ తీర్పునిచ్చారు.
గ్రూప్-1 అభ్యర్థులకు సూచనలు
గ్రూప్-1 పరీక్ష ఓఎంఆర్ విధానంలో ఉంటుంది. ఈనెల 9న ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరుగుతుంది. అభ్యర్థులు పాటించాల్సిన సూచనలను హాల్ టికెట్లపై ప్రింట్ చేశారు. అధికారులు చెప్పిన దాని ప్రకారం, అభ్యర్థులు హాల్ టికెట్పై మూడు నెలలలోపు దిగిన పాస్ పోర్ట్ సైజ్ ఫోటోను అతికించాలి. పరీక్ష హాల్లోకి వెళ్లే ముందే ఫోటోను అతికించాలి. అలా చేయకపోతే లోపలికి ఎంట్రీ ఉండదు. పరీక్ష కేంద్రంలో ఇన్విజిలేటర్ సమక్షంలోనే హాల్ టికెట్పై సంతకం చేయాలి. అలాగే, ప్రభుత్వం జారీ చేసిన ఫోటోతో ఉన్న ఏదైనా గుర్తింపు కార్డును అభ్యర్థి తీసుకుని పరీక్షకు హాజరవ్వాలి. అక్కడి సిబ్బందికి చూపించాలి.