Maoist Party: మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శిగా తిప్పిరి తిరుపతి(Thippiri Tirupati) ఎలియాస్ దేవ్ జీ(Devji)ని నియమించినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన పార్టీ సెంట్రల్ మిలటరీ కమిషన్ ఛీఫ్ గా, పొలిట్ బ్యూరో సభ్యునిగా ఉన్నాడు పలు సంచలన కేసుల్లో నిందితునిగా ఉన్న దేవ్ జీపై కోటి రూపాయల రివార్డు ఉన్నట్టుగా సమాచారం. గత మే నెలలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఉన్న నంబాల కేశవరావు(Nambala Kesava Rao) ఎలియాస్ బసవరాజు9Basavaraju) ఛత్తీస్ ఘడ్ ఎన్ కౌంటర్ లో చనిపోయిన విషయం తెలిసిందే.
ఆయనతోపాటు మరికొందరు మావోయిస్టులు కూడా ఎన్ కౌంటర్ లో మరణించారు. పదుల సంఖ్యలో పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ క్రమంలో పునర్నిర్మాణంపై దృష్టి పెట్టిన మావోయిస్టు పార్టీ దేవ్ జీని కేంద్ర కమిటీ సెక్రటరీగా నియమించినట్టుగా తెలుస్తోంది. అయితే, దీనికి సంబంధించి పార్టీ ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.
Also Read: Telugu Academy: బిల్లులు కట్టినా… పుస్తకాలు లేక ఇంటర్ విద్యార్థుల అవస్థలు
జగిత్యాల జిల్లా..
జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన దేవ్ జీ 1983లో డిగ్రీ చదువుతూ రాడికల్ స్టూడెంట్ యూనియన్(Radical Student Union) లో చేరాడు. ఆ సమయంలో రాడికల్ స్టూడెంట్ యూనియన్.. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ విద్యార్థి సంఘాల మధ్య గొడవలు జరిగాయి. వీటిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఆ సమయంలోనే దేవ్ జీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. దళ సభ్యునిగా మావోయిస్టు పార్టీలో చేరి కమాండర్ గా పని చేసి ప్రస్తుతం సెంట్రల్ కమిటీ సభ్యునిగా, మిలీషియా దాడుల్లో వ్యూహకర్తగా పని చేస్తున్నాడు.
మిలీషియా దాడులు చేసి పోలీసులకు దొరకకుండా తప్పించుకోవటంలో దేవ్ జీకి తిరుగు లేదన్న ప్రచారం ఉంది. 2003లో తిరుపతి అలిపిరిలో చంద్రబాబు నాయుడుపై జరిగిన క్లేమోర్ మైన్స్ దాడిలో నంబాల కేశవరావుతోపాటు దేవ్ జీ పాత్ర కూడా ఉన్నట్టు ఆరోపణలు ఉన్నాయి. 2010లో దంతెవాడ సమీపంలో 74మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించిన దాడికి కూడా దేవ్ జీనే నాయకత్వం వహించాడని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.
KTR: ఫార్ములా-ఈ కారు కేసు ఒక లొట్టపీసు కేసు.. కేటీఆర్ సంచలన కామెంట్స్!