TPCC Mahesh Kumar Goud: కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతికి సంబంధించి బీఆర్ఎస్ నేత ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు.. ప్రస్తుతం తెలంగాణలో సంచనం సృష్టిస్తున్నాయి. కాళేశ్వరం అవినీతి వెనక హరీశ్ రావు, సంతోష్ రావు ఉన్నారంటూ ఆమె చేసిన కామెంట్స్ బీఆర్ఎస్ ను ఒక్కసారిగా చిక్కుల్లోకి నెట్టాయి. ఈ నేపథ్యంలో కవిత వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తాజాగా స్పందించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని కవిత మాటలతో తేలిపోయిందని ఆయన అన్నారు.
‘మామ అల్లుళ్ల అవినీతి వాటాలు తేలాలి’
టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందిస్తూ ‘కాళేశ్వరంలో తప్పు చేసింది కేసీఆరా లేదా హరీశ్ రావా అనేది మాకు అనవసరం. వారి హయాంలో స్కాం జరిగిందనేది స్పష్టం. కవిత కూడా ఇప్పుడు అదే చెప్పింది. కాళేశ్వరం అవినీతిలో మామ కేసీఆర్ వాటా ఎంత? అల్లుడు హరీశ్ రావు వాటా ఎంత? అనేది తేలాల్సి ఉంది. కేసీఆర్ కుటుంబంలో మూడు ముక్కలాట ఫైనల్ కి చేరింది. కుటుంబ కలహాలను మాపై రుద్దడం ఏంటి?. ఏమీ తప్పు చేయలేదంటున్న బీఆర్ఎస్ నేతలు సీబీఐ అనగానే ఎందుకు జంకుతున్నారు. వారు తప్పు చేయకపోతే విచారణ ఎదుర్కోవాలి’ అని మహేష్ కుమార్ గౌడ్ సవాలు విసిరారు.
ఆ దెయ్యాలు వారిద్దరేనా?
మొదటి దఫా ప్రభుత్వంలో ఇరిగేషన్ మంత్రిగా హరీశ్ రావు తప్పు చేస్తే కేసీఆర్ బాధ్యతాయుతంగా హరీశ్రావుపై ఎందుకు చర్యలు తీసుకోలేదని టీపీసీసీ చీఫ్ ప్రశ్నించారు. ‘అప్పుడే కవిత ఎందుకు మాట్లాడలేదు?. మొదట కేటీఆర్, అనంతరం కవిత అమెరికా పర్యటనకు వెళ్లి అవగాహన కదుర్చుకొని.. అంతర్గత కలహాలతో హరీశ్ రావును టార్గెట్ చేశారు. కేసిఆర్ కుటుంబ కలహాలతో కాంగ్రెస్కు సంబంధం లేదు. బీఆర్ఎస్ అవినీతిని బయటపెట్టడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యం. కేసీఆర్ చుట్టూ దెయ్యాలున్నాయని గతంలో చెప్పిన కవిత ఆ దెయ్యాలు హరీశ్ రావు, సంతోష్ రావేనా? ఇంకా ఎవరెవరు ఉన్నారో ఆమె స్పష్టం చేయాలి. కవిత మాటలు నిజమా? అసెంబ్లీలో మాట్లాడిన హరీశ్ రావు మాటలు నిజమా?’ వారు స్పష్టం చేయాలని టీపీసీసీ చీఫ్ అన్నారు.
Also Read: Jagruthi President Kavitha: కవిత బిగ్ బాంబ్.. హరీశ్ రావు, సంతోష్ రావు వల్లే.. కేసీఆర్పై అవినీతి మరక
మిగిలింది జైలే.. బెయిల్ కాదు!
మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో తెలంగాణ ప్రజలను మోసం చేసి, లక్ష కోట్లు దోచుకున్న కేసీఆర్, హరీశ్ రావు, ఇతర బీఆర్ఎస్ నాయకులకు ఇక మిగిలింది జైలు మాత్రమేని, బెయిల్ కాదని టీపీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర్ గౌడ్ హెచ్చరించారు. కేసీఆర్ కుటుంబీకులు దోచుకున్న లక్ష కోట్లను తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ రికవరీ చట్టం కింద తిరిగి వసూలు చేస్తుందన్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలోనే సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు ఈ హామీచ్చారని గుర్తు చేశారు. కాళేశ్వరంలో జరిగిన అవినీతికి వ్యతిరేకంగా తెలంగాణ కాంగ్రెస్ కుటుంబమంతా ఒక్కటై పోరాడి విజయం సాధించిందని బండి సుధాకర్ గౌడ్ అన్నారు.