Modi China Visit: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం శనివారం చైనాలో (Modi China Visit) అడుగు పెట్టారు. జపాన్ పర్యటన ముగించుకొని, నేరుగా చైనాలోని టియాంజిన్ నగరానికి చేరుకున్నారు. ఎయిర్పోర్టులో మోదీకి ఘనస్వాగతం లభించింది. చైనా కీలక మంత్రులు ఎదురొచ్చి, రెడ్కార్పెట్ స్వాగతం పలికారు. మోదీకి ప్రత్యేక స్వాగతం పలికేందుకు ఎయిర్పోర్టులో చైనా సంప్రదాయక నృత్యాన్ని ప్రదర్శించారు. నృత్యం చేస్తున్న కళాకారిణులను ఆసక్తిగా గమనిస్తూ మోదీ ముందుకు సాగారు. కాగా, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ టియాంజిన్ చేరుకున్నారు. ఏడేళ్ల తర్వాత చైనాలో ఆయనకు తొలి పర్యటన ఇదే కావడం గమనార్హం.
జిన్ పింగ్తో ఏం మాట్లాడబోతున్నారు?
షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో భారత్ సభ్యదేశంగా ఉండడంతో, చైనా ప్రత్యేక ఆహ్వానం మేరకు సదస్సులో పాల్గొనేందుకు మోదీ వెళ్లారు. ఆగస్టు 31, సెప్టెంబర్ 1 తేదీల్లో ఈ సదస్సు జరగనుంది. భారత దిగుమతులపై అమెరికా అధిక టారిఫ్లు విధించిన నేపథ్యంలో, చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్, ప్రధాని మోదీ మధ్య జరగనున్న ద్వైపాక్షిక భేటీ, మాట్లాడే అంశాలు అత్యంత ఆసక్తిని కలిగిస్తున్నాయి. భారత్-చైనా సంబంధాల్లో ఇటీవలి కాలంలో సానుకూల పరిణామాలు చోటుచేసుకున్న నేపథ్యంలో మోదీ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది.
Read Also- Rahul Dravid: రాహుల్ ద్రవిడ్ అనూహ్య నిర్ణయం.. దీనికి కారణం ఏమిటి?
అమెరికా, భారత్ మధ్య గ్యాప్ ఏర్పడిన నేపథ్యంలో చైనా వైఖరి ఎలా ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారింది. భారతీయ దిగుమతులపై అధిక సుంకాలు విధిస్తూ ట్రంప్ ప్రకటన చేసిన తర్వాత, భారత్ అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహారిస్తోంది. అమెరికాతో సంబంధాలు కీలకమైనవే అయినప్పటికీ, చైనాను కూడా దగ్గర చేసుకోవడం ముఖ్యమని భారత్ భావిస్తోంది. తద్వారా వాణిజ్య అవకాశాలను మెరుగుపరచుకోవాలని చూస్తోంది.
అందుకే, మోదీ చైనా పర్యటనపై ఆసక్తి నెలకొంది. 2020 గాల్వాన్ వాలీ ఘర్షణ తర్వాత భారత్-చైనా సంబంధాలు దెబ్బతిన్నాయి. అయితే, ఇటీవల జరిగిన పరిణామాల కారణంగా బంధాల పునర్నిర్మాణం దిశగా తిరిగి అడుగులుపడుతున్నాయి. భారత్-చైనా సంబంధాల్లో సహకారం, సవాళ్లు అధిగమించే విషయంలో సమన్వయం అత్యంత కీలకమైన అంశాలుగా ఉన్నాయి.
Read Also- Indore Woman: ప్రియుడితో లేచిపోయి.. మరొకరిని పెళ్లాడి.. ఫైనల్గా ఇంటికొచ్చేసిన యువతి
కాగా, భారత్-చైనా రాజకీయపరమైన విభేదాలు ఉన్నప్పటికీ, భారత్కు రెండవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. తయారీ విషయంలో భారత్ కూడా చైనా విడిభాగాలు, మెటీరియల్స్పై ఆధారపడుతోంది. ఇరుదేశాల మధ్య బంధాలు మళ్లీ చిగురిస్తున్న నేపథ్యంలో, షాంఘై సదస్సు ప్రభావం విస్తృతంగా ఉంటుందనే అంచనాలు నెలకొన్నాయి.
ఎస్సీవో ఎందుకు?
షాంఘై సహకార సంస్థ విస్తృతమైన లక్ష్యాల కోసం ఏర్పడింది. ఉగ్రవాదం, వేర్పాటువాదం, తీవ్రవాదానికి వ్యతిరేకంగా ఏర్పడింది. ప్రస్తుతం 10 సభ్య దేశాలు ఉన్నాయి. పాశ్చాత్య దేశాల -ప్రేరిత సంస్థలకు ప్రత్యామ్నాయ వేదికగా ఒక ఏర్పాటైంది. భారత్ కూడా వ్యూహాత్మకంగా సభ్యదేశంగా చేరింది. ఒకే అలయెన్స్పై ఎక్కువగా ఆధారపడకుండా ఇందులో చేరింది. అయితే, ప్రయోజనాలు అంతగా జరగడం లేదనే చెప్పాలి. ఎందుకంటే, చైనా, పాకిస్థాన్ మధ్య సన్నిహిత సైనిక సంబంధాలు, ఇతర అంశాలు భారత్కు ప్రతికూలంగా ఉన్నాయి. అయితే, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా, పాశ్చాత్య దేశాలతో పాటు చైనాతో సంబంధాల విషయంలో సమతుల్యత ఏర్పరచుకోవడం భారత్ కీలకంగా మారింది.