Min Komati Reddy: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కల్వర్టులు, బ్రిడ్జీలు, కోతకు గురైన ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేయాలని ఆర్ అండ్ బీ(R&B) అధికారులను మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి(Min Komati Reddy Venkat Reddy) ఆదేశించారు. వర్షాల నేపత్యంలో అధికారులు అలర్ట్ గా ఉండాలని ఆదేశించారు. ఆర్ అండ్ బీ అధికారులతో మంత్రి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈనేపథ్యంలో క్షేత్రస్థాయి పరిస్థితులను ఆర్ అండ్ బీ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా మెదక్(Medak), సంగారెడ్డి(sanga Reddy), కామారెడ్డి(kamaredddy), సిరిసిల్ల(Siricilla), నిర్మల్(Nirmal) జిల్లాల్లో పరిస్థితులపై మంత్రి సమీక్షించారు. కామారెడ్డి, నిర్మల్ వద్ద వరద ప్రవాహానికి ఎన్ హెచ్ 44పై రాకపోకలకు ఏర్పడిన అంతరాయం, ట్రాఫిక్ క్లియరెన్స్ పై మంత్రి ఆరా తీసి.. నేషనల్, స్టేట్ హైవేల స్థితిగతులు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు ఈ సీజన్ లో అధిక వర్షాల వల్ల పాడైన రోడ్లు, కల్వర్టులు, ముఖ్యంగా ఇంకా రెడ్ అలెర్ట్(Red Alert) ఉన్న జిల్లాల రోడ్ల వివరాలు అధికారులు మంత్రికి వివరించారు.
నిర్మాణాలకు ప్రతిపాదనలు
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజా రవాణాకు ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. తెగిన రోడ్లు, కల్వర్టుల వద్ద వర్షాలు తగ్గుముఖం పట్టగానే తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలన్నారు. ప్రత్యామ్నాయ మార్గాల్లో ట్రాఫిక్ మళ్లింపు చేయాలని అధికారులకు సూచించారు. ప్రాణ నష్టం జరగకుండా పోలీస్(police), ఎలక్ట్రిసిటీ(Electricity), ఇరిగేషన్(Irrigation), పంచాయతీ రాజ్, రెవెన్యూ(Revenue) శాఖలతో సమన్వయం చేసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. పాడైన రోడ్లు, వంతెనలకు సంబంధించి శాశ్వత నిర్మాణాలకు ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ఆర్ అండ్ బీ హెడ్ ఆఫీస్ లో కంట్రోల్ సెంటర్ కు వస్తున్న ఫిర్యాదులు, సమాచార వివరాలపై మంత్రి ఆరా తీయగా.. స్టేట్ రోడ్స్ సీఈ ఆధ్వర్యంలో షిఫ్టునకు నలుగురు చొప్పున 24 గంటలు మానిటరింగ్ చేస్తున్నట్లు మంత్రికి వివరించారు.
Also Read: AP New Bar Policy: మందుబాబులకు తీపి కబురు.. రాత్రి 12 గంటల వరకూ మద్యం అమ్మకాలు
వరద ప్రవాహం ఉంటే..
మంత్రి గత రివ్యూలో చెప్పిన ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 37 ఆర్ అండ్ బీ డివిజన్ల నుంచి వివరాలు సేకరణ చేస్తున్నామని, 24 గంటలు అలర్ట్ గా ఉంటున్నామని స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్(CS Vikas Raj) మంత్రికి వివరించారు. భారీ వర్షాలకు వచ్చిన వరద ప్రవాహాలకు రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు ఆర్ అండ్ బీ పరిధిలోని 37 డివిజన్లలో 794 చోట్ల సమస్యాత్మక రోడ్లు గుర్తించామని, అందులో 1039 కిలోమీటర్ల రోడ్డు దెబ్బతిందని, 31 చోట్ల రోడ్డు తెగిపోతే వెంటనే 10 చోట్ల తాత్కాలిక పునరుద్ధరణ చేశామని వికాస్ రాజ్ మంత్రికి వివరించారు. 356 చోట్ల కాజ్ వే లు, కల్వర్టులు వరద ప్రవాహం ఉంటే అందులో 289 దారి మళ్లింపు చేసినట్లు పేర్కొన్నారు. రాకపోకలకు ఇబ్బంది ఉన్న 305 ప్రాంతాల్లో యుద్ధప్రాతిపదికన 236 చోట్ల క్లియర్ చేశామని, మిగతా చోట్ల వేగంగా క్లియర్ చేస్తున్నామని అన్నారు. తాత్కాలిక పునరుద్ధరణకు రూ.53.76 కోట్ల వరకు ఖర్చవుతుందని, శాశ్వత పునరుద్ధరణ కోసం రూ.1157.46 కోట్లు అవసరమవుతాయని అంచనా వేసినట్లు పేర్కొన్నారు. ఇదిలాఉండగా మంత్రి మాట్లాడుతూ.. ఆర్ అండ్ బీ ఇంజినీర్లు అధిక వర్షాలు ఉన్న ప్రాంతాల్లో ఫీల్డ్ విజిట్ చేస్తూ..పరిస్థితులు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాలని, ఎప్పటికప్పుడు వివరాలు తనకు రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.
Also Read: Indian Railway: భారీ వర్షాల ఎఫెక్ట్.. పలు రైళ్లు డైవర్షన్, మరికొన్ని రద్దు.. ట్రైన్స్ లిస్ట్ ఇదే!