SV Krishna Reddy: ఎస్వీ కృష్ణారెడ్డి.. ఈ పేరుని తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ మధ్యకాలంలో కాస్త స్లో అయ్యారు కానీ, ఒకప్పుడు స్టార్ హీరోలు కూడా ఆయనతో సినిమా తీయడానికి క్యూ కట్టారు. బాలకృష్ణ, నాగార్జున వంటి వారిని కూడా ఆయన డైరెక్ట్ చేశారు. మరీ ముఖ్యంగా కుటుంబ కథా చిత్రాలకు పెట్టింది పేరు ఎస్వీ కృష్ణారెడ్డి. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో హోల్ సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్తో దర్శకుడిగా తన సత్తా చాటిన ఎస్వీ కృష్ణారెడ్డి (SV Krishna Reddy).. కాస్త గ్యాప్ తర్వాత మరోసారి దర్శకుడిగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన దర్శకుడిగా చేయబోతున్న 43వ సినిమా ‘వేదవ్యాస్’ (Vedavyaas). ఈ సినిమాను గురువారం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్లో గ్రాండ్గా ప్రారంభించారు. ఈ వేడుకకు నిర్మాత దిల్ రాజు, బ్లాక్ బస్టర్ డైరెక్టర్స్ వీవీ వినాయక్, అనిల్ రావిపూడి అతిథులుగా హాజరయ్యారు.
Also Read- Actor Madhavan: భారీ వర్షాల ఎఫెక్ట్.. లద్దాఖ్లో చిక్కుకుపోయిన మాధవన్.. ఎటూ కదల్లేని స్థితిలో..
కె.అచ్చిరెడ్డి సమర్పణలో సాయిప్రగతి ఫిలింస్ బ్యానర్పై ప్రముఖ వ్యాపారవేత్త, కాంగ్రెస్ పార్టీ నేత కొమ్మూరి ప్రతాప్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఉన్న విశేషం ఏమిటంటే.. సౌత్ కొరియా నటి జున్ హ్యున్ జీ హీరోయిన్గా టాలీవుడ్కు పరిచయం కాబోతుండటం. చిత్ర ప్రారంభోత్సవం సందర్భంగా హీరోయిన్ జున్ హ్యున్ జీ కు ‘హలో … కంగ్రాట్యులేషన్స్ అండ్ వెల్కమ్ టు టాలీవుడ్’ అంటూ నిర్మాత, తెలంగాణ ఎఫ్ డి సి చైర్మన్ దిల్ రాజు బొకే అందించగా.. ఆమె ‘థాంక్యూ సర్’ అని చెబుతున్న షాట్ను ముహూర్తపు సన్నివేశంగా చిత్రీకరించారు. ఈ సన్నివేశానికి దర్శకుడు వీవీ వినాయక్ క్లాప్ కొట్టగా.. మరో దర్శకుడు అనిల్ రావిపూడి గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాత జెమినీ కిరణ్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు.. ఇంకా ఈ కార్యక్రమంలో నటులు మురళీ మోహన్, అలీ, జుబేదా అలీ, సాయికుమార్, కెమెరామెన్ శరత్, ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మ కడలి వంటి ప్రముఖులందరూ పాల్గొని చిత్రయూనిట్కు శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. నేను చాలా అదృష్టవంతుడిని, మీ అందరి ఆదరణతో ఇప్పుడు 43వ సినిమా ‘వేదవ్యాస్’ చేస్తున్నాను. నా లైఫ్లో ఎన్ని సినిమాలైతే చేయగలనో అన్ని సినిమాలు ఇకపై కొమ్మూరి ప్రతాప్ రెడ్డితోనే చేస్తాను. తొలిసారి తెలుగు మూవీలో ఒక కొరియన్ హీరోయిన్ను పరిచయం చేస్తున్నాను. జున్ హ్యున్ జీని తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నందుకు సంతోషంగా ఉందని అన్నారు. నిర్మాత కె. అచ్చిరెడ్డి మాట్లాడుతూ.. దర్శకుడిగా కృష్ణారెడ్డి సృష్టించిన చరిత్ర అందరికీ తెలిసిందే. ఆయన ఇంకా మంచి మూవీస్ చేయాలనే తపనతో ఒక స్క్రిప్ట్ రెడీ చేసి, పరిపూర్ణంగా ఆ కథను నమ్మి ప్రొడ్యూస్ చేసేవాళ్లని చూస్తున్నప్పుడు.. కృష్ణారెడ్డిపై ఉన్న అభిమానం, ఆప్యాయత, ప్రేమతో ప్రతాప్ రెడ్డి ముందుకొచ్చారు. ఈ మూవీకి పరిపూర్ణత వచ్చేందుకు ఎలాంటి నటీనటులు అవసరమో.. అలాంటి వారినే ఎంచుకున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా, కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటూనే మంచి మెసేజ్తో వస్తున్న చిత్రం ‘వేదవ్యాస్’ అని తెలిపారు.
నిర్మాత కొమ్మూరి ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ.. ఎస్వీ కృష్ణారెడ్డి సినిమాలంటే నాకు చాలా ఇష్టం. ఆయన మీద అభిమానంతో మనం సినిమా చేద్దామని నేనే ప్రతిపాదించాను. అలా అనుకున్న ప్రాజెక్ట్ ఈ రోజు ‘వేదవ్యాస్’గా తయారైంది. మంచి వినోదంతో పాటు ఈ సినిమాలో ఓ సందేశం కూడా ఉంటుంది. ఇలాంటి చిత్రాలు నేటి సమాజానికి అవసరమని భావించి ఆయనతో ఈ మూవీ నిర్మిస్తున్నాను. ఆయనతో మరిన్ని చిత్రాలు చేయాలని ప్లాన్ చేస్తున్నామని పేర్కొన్నారు. ఇంకా హాజరైన పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో ప్రసంగించారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు