UP Tragedy: ప్రసవ వేదన పడుతున్న తన భార్యకు, కడుపులో బిడ్డకు ఏ అపాయమూ జరగకూడదని ఓ వ్యక్తి సకాలంలో హాస్పిటల్కు తీసుకెళ్లాడు. తల్లిబిడ్డా క్షేమంగా బయటపడాలని ఎంతో కోరుకున్నాడు. కానీ, కడుపులో బిడ్డ కడుపులోనే చనిపోవడంతో ఆ తండ్రి తల్లడిల్లిపోయాడు. కడుపుకోతను తట్టుకోలేకపోయాడు. తల్లి కడుపులో ఉండగా మురిసిన ఆ తండ్రే.. చెమర్చిన కళ్లతో నిశ్శబ్దంగా ఓ సంచిలో బిడ్డ మృతదేహాన్ని తీసుకొని జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లాడు. అత్యంత విషాదకరమైన ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని లఖీంపూర్ ఖేరీ జిల్లాలో (UP Tragedy) వెలుగుచూసింది.
విపిన్ గుప్తా అనే ఓ వ్యక్తి తన నవజాత శిశువు మృతదేహంతో జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లడం చర్చనీయాంశమైంది. ఆసుపత్రి సిబ్బంది ఫీజును పదేపదే పెంచుతూ డెలివరీని వాయిదా వేస్తూ వచ్చారని, ఈ కారణంగా బిడ్డ చనిపోయిందంటూ బాధితుడు విపిన్ గుప్తా కలెక్టర్కు ఫిర్యాదు చేశాడు. స్పందించిన కలెక్టర్ సంబంధిత హాస్పిటల్ను సీజ్ చేశారు. ఆయన ఆదేశాల మేరకు సంబంధిత అధికారులు వెంటనే వెళ్లి హాస్పిటల్కు సీలు చేశారు.
ఘటనపై కలెక్టర్ ట్వీట్..
ఈ విషాదకర ఘటనపై జిల్లా కలెక్టర్ ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. నవజాత శిశువు మృతి చెందిన ఘటనలో గోల్డర్ హాస్పిటల్ను జిల్లా పరిపాలన సీజ్ చేసిందని తెలిపారు. ఆ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న రోగులను జిల్లా మహిళా ఆసుపత్రికి తరలిస్తున్నట్టు వెల్లడించారు. ‘‘నా ఆదేశాల ప్రకారం ఏఏడీఎం ఏకే రస్తోగీ శ్రీజన్ ఆసుపత్రిని సందర్శించి, బిడ్డను కోల్పోయిన శోకంలో ఉన్న తల్లి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు. మెరుగైన చికిత్స అందించాలంటూ ఆదేశించారు. బాధిత కుటుంబానికి జిల్లా పరిపాలన అండగా నిలుస్తుంది’’ అని కలెక్టర్ వెల్లడించారు. కాగా, విషాదకరమైన ఈ ఘటనపై సమగ్ర విచారణ కొనసాగుతోందని సంబంధిత అధికారులు తెలిపారు.
Read Also- CBI Raids Anil Ambani Home: అనిల్ అంబానీ నివాస ప్రాంగణాల్లో సీబీఐ సోదాలు
చార్జీలు పెంచుతూ పోయారు..
బాధితుడు విపిన్ గుప్తా తన బాధను మీడియాతో పంచుకున్నాడు. ‘‘పురిటి నొప్పులు రావడంతో నా భార్యను గోల్డర్ ఆసుపత్రిలో చేర్పించాను. సాధారణ ప్రసవానికి రూ.10,000 తీసుకుంటామని మొదట చెప్పారు. సిజేరియన్ డెలివరీకి రూ.12,000 అవుతుందని తెలిపారు. అయితే, నా భార్యకు పురిటి నొప్పులు పెరుగుతుండగా, ఛార్జీలను పెంచుతూ పోయారు’’ అంటూ విపిన్ గుప్తా వాపోయాడు.
Read Also- River In China: రివర్స్లో ప్రవహిస్తున్న నది.. వీక్షించేందుకు తరలివెళుతున్న జనం
‘‘తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో డబ్బు జమ చేశాను. కానీ, ఆసుపత్రి అధికారులు మళ్లీ ఛార్జీలు పెంచారు. ఆపరేషన్ చేయాలంటే ముందుగా ఫీజు మొత్తం చెల్లించాలని డిమాండ్ చేశారు. సీజేరియన్ చేయలేకపోతే చెప్పండి నా భార్యను మరో ఆసుపత్రికి తీసుకెళ్తానని కూడా అడిగాను. అయినా వారు ఫీజు పెంచుతూ పోయారు. డెలివరీ చేయడం మొదలుపెట్టండి, మిగతా డబ్బును తర్వాత ఇస్తానని చెప్పినా వినలేదు. ముందుగా మొత్తం డబ్బు కట్టండి, లేకపోతే ఆపరేషన్ చేయబోమంటూ ఆగ్రహంతో చెప్పారు’’ అని బాధితుడు విపిన్ గుప్తా వాపోయాడు.
శిశువు మరణించిన తర్వాత తన భార్యను రోడ్డు మీదకు నెట్టివేశారంటూ ఆరోపించాడు. దీనిపై ప్రశ్నించేందుకు తొలుత సర్జన్ వద్దకు వెళ్లామని, ఆ తర్వాత జిల్లా కలెక్టర్ వద్దకు వెళ్లానని, ఆయన మద్దతుగా నిలిచారని చెప్పారు. బిడ్డ శవాన్ని తిరిగి సంచిలో వెనక్కి తీసుకెళ్లానని విపిన్ గుప్తా చెప్పాడు.