– ప్రజా భవన్, నాంపల్లి కోర్టుకు బాంబు బెదిరింపులు
– అలర్ట్ అయిన పోలీస్, బాంబ్ స్క్వాడ్స్
– అణువణువూ జల్లెడ పట్టిన అధికారులు
– మంత్రి సీతక్క ఇంట్లోనూ తనిఖీ
– నాంపల్లి కోర్టు దగ్గర కూడా సోదాలు
– ఫేక్ కాల్స్గా పోలీసుల అనుమానం
– ఫోన్ నెంబర్స్ ఆధారంగా దర్యాప్తు
Praja Bhawan: తెలంగాణలో మంగళవారం బాంబు బెదిరింపు కాల్స్ కలకలం రేపాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉంటున్న ప్రజా భవన్, మంత్రి సీతక్క ఇల్లు, నాంపల్లి కోర్టులో బాంబులు పెట్టినట్టు బెదిరింపు కాల్స్ వచ్చాయి. దీంతో వెంటనే పోలీసు అధికారులు రంగంలోకి దిగారు. డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్లతో తనిఖీలు చేశారు. ప్రజా భవన్లో బాంబు పెట్టామని, మరికాసేపట్లో పేలిపోతుందని పోలీసు కంట్రోల్ రూమ్కు ఓ ఆగంతకుడు నుంచి ఫోన్ చేశాడు. అంతే సీరియస్గా తర్వాత ఫోన్ పెట్టేశాడు. దీంతో పోలీసులు వెంటనే ప్రజా భవన్లోని సిబ్బందిని అలర్ట్ చేశారు. వారు అక్కడ ఉన్నవారిని వెంటనే పంపించేశారు.
ప్రజా భవన్ లోపలికి వెళ్లేవారిని, లోపలి నుంచి బయటికి వచ్చేవారిని తనిఖీలు చేశారు. బెదిరింపు కాల్ రాగానే పోలీసు అధికారులు డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్లతో ప్రజా భవన్లో అణువణువూ జల్లెడ పట్టారు. మరోవైపు ఈ ఫోన్ కాల్ చేసిన వ్యక్తిని ట్రేస్ చేయడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
ప్రస్తుతం ప్రజా భవన్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దంపతులు నివాసం ఉంటున్నారు. ప్రతి రోజూ ప్రజా భవన్కు సాధారణ ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడానికి పోటెత్తుతున్నారు. ఇదే క్రమంలో వార్నింగ్ కాల్ రావడంతో కలకలం రేగింది. గార్డెన్ ఏరియా, జిమ్, స్విమ్మింగ్ పూల్, ఆలయం, ఇలా అన్ని పరిసరాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు పోలీసులు. బెదిరింపు కాల్ ఎక్కడి నుంచి వచ్చిందో శోధిస్తున్నారు. నెంబర్ ఆధారంగా వేట కొనసాగుతోంది.
ఇటు బాంబు బెదిరింపు కాల్స్ రావడంపై మంత్రి సీతక్క స్పందించారు. ప్రజా భవన్కు సాధారణంగా వారి సమస్యలు చెప్పుకోవడానికి ప్రజలు వస్తుంటారని వివరించారు. అలాంటి వారందరినీ తాము లోపలికి అనుమతిస్తున్నామని చెప్పారు. ఈ బెదిరింపు ఫోన్ కాల్ చేసింది ఎవరో మాత్రం ఇప్పటికైతే తెలియదని చెప్పారు. పోలీసులు తదుపరి చర్యలు తీసుకుంటారని చెప్పారు. ఇక నాంపల్లి కోర్టు ఆవరణలో కూడా తనిఖీలు జరిగాయి. అక్కడ కూడా బాంబు ఉన్నట్టు కాల్ రావడంతో తనిఖీలు చేయగా ఏమీ దొరకలేదు. దీంతో దాన్ని ఫేక్ కాల్గా పోలీసు అధికారులు గుర్తించారు.