BRS Party: జూబ్లీహిల్స్పై బీఆర్ఎస్ సర్వేలు నిర్వహిస్తోంది. పార్టీకి ప్రజల్లో ఎలాంటి ఆదరణ ఉంది, ఇతర పార్టీలకు ఎలా ఉందనే వివరాలను సేకరిస్తోంది. కానీ, క్షేత్రస్థాయిలో మాత్రం ప్రజల్లోకి వెళ్లడం లేదు. కేవలం సర్వేలతోనే కాలం వెళ్లదీస్తుందనే విమర్శలు వస్తున్నాయి. బీఆర్ఎస్కు సిట్టింగ్ స్థానం కావడంతో ఆ స్థానాన్ని నిలబెట్టుకుంటే కేడర్లో భరోసాతోపాటు జోష్ నింపినట్లు అవుతుంది. కానీ, కేవలం మాగంటి గోపీనాథ్ సంస్మరణ సభలను నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో నిర్వహించి మమ అనిపించి ప్రజల్లోకి క్షేత్రస్థాయిలోకి వెళ్లకపోవడం ఇబ్బందికరంగా మారింది.
సిట్టింగ్ స్థానంపై నిర్లక్ష్యం ఎందుకు?
బీఆర్ఎస్ పార్టీకి జూబ్లీహిల్స్ సిట్టింగ్ స్థానం. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి చెందిన తర్వాత నియోజకవర్గం చేజార్చుకోవద్దని గులాబీ పార్టీ తొలుత ప్రయత్నాలు చేసింది. డివిజన్లలో సంస్మరణ సభలు నిర్వహించింది. కేడర్కు పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చింది. ఆ తర్వాత ఆ నియోజకవర్గంలో కార్యక్రమాలు స్తంభించాయి. డివిజన్లకు సైతం ఇన్ఛార్జ్లను పార్టీ ప్రకటించలేదని నేతలే పేర్కొంటున్నారు. కేవలం నియోజకవర్గానికి ఇద్దరు ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్, శ్రీనివాస్ రెడ్డిలకు బాధ్యతలు అప్పగించింది. వారి ఆధ్వర్యంలో సంస్మరణ సభలు జరిగాయి. ప్రస్తుతం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకపోవడంతో కేడర్లో స్తబ్దత నెలకొన్నది. డివిజన్లకు ఇన్ఛార్జులనైనా ప్రకటిస్తే ఇతర పార్టీల వైపు చూడకుండా అడ్డుకట్ట వేసే అవకాశం ఉంటుందని సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. కానీ, అలాంటి చర్యలు లేకపోవడంతో కేడర్లో రోజురోజుకు కొంత నైరాశ్యం నెలకుంటున్నది.
దూకుడు మీద ఉన్న ఇతర పార్టీలు
ఈ సారైనా జూబ్లీహిల్స్ను చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ స్పీడ్ పెంచింది. నియోజకవర్గంలోని డివిజన్లకు మంత్రులకు బాధ్యతలు అప్పగించడంతో నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ కేడర్ను యాక్టీవ్ చేస్తున్నారు. బీజేపీ సైతం నియోజకవర్గంపై ఫోకస్ పెట్టింది. ఎంఐఎం సైతం ప్రచారాన్ని స్టార్ట్ చేసింది. ఈ తరుణంలో బీఆర్ఎస్ పార్టీ ఉప ఎన్నికల్లో గెలుపు అవకాశాలు ఎవరికి ఉన్నాయనే దానిపై సర్వేలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. పార్టీల వారీగా వివరాలు సేకరిస్తున్నట్లు తెలిసింది. ఈ సర్వేలపైనే ఆధారపడుతూ క్షేత్రస్థాయిలో ప్రజల మధ్యకు వెళ్లకపోవడంతో సెకండ్ కేడర్ నాయకులు నారాజ్గా ఉన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేపట్టిన కార్యక్రమాలు వివరించడంతో పాటు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడితేనే ఉప ఎన్నికల్లో గెలిచే అవకాశాలు ఉన్నాయని, లేకుంటే ఇలాగే సైలెంట్గా ఉంటే మాత్రం ఓడిపోయే అవకాశాలు లేకపోలేదని నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Attack on Delhi CM: సీఎం జుట్టు పట్టుకొని.. చెంప చెల్లుమనిపించిన ఫిర్యాదు దారుడు
మాగంటి ఫ్యామిలీలో లుకలుకలు
మాగంటి గోపీనాథ్ రాజకీయంగా యాక్టీవ్ ఉన్నంత కాలం ఆ కుటుంబం నుంచి ఎవరూ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనలేదు. పార్టీ కార్యక్రమాలకు సైతం దూరంగా ఉన్నారు. కేవలం గోపీనాథ్ సోదరుడు మాగంటి వజ్రనాథ్ మాత్రం ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొని విజయంలో కీలక భూమిక పోషించేవారు. అయితే, గోపీనాథ్ మృతితో ఆ స్థానం కోసం మాగంటి వజ్రనాథ్ పోటీ పడుతున్నట్లు ప్రచారం జరుగుతున్నది. తనకు అవకాశం ఇవ్వాలని ఇప్పటికే అధిష్టానానికి ఆయన విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. కానీ, అధిష్టానం మాత్రం మాగంటి భార్య సునీతను బరిలోకి దింపాలని భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. మాగంటి కుటుంబంపై నియోజకవర్గ ప్రజల్లో సానుభూతి ఉందని, అలాగే పార్టీపై ఉన్న అభిమానంతో సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవచ్చని బీఆర్ఎస్ భావిస్తున్నది. సునీత అభ్యర్థిత్వం ఖరారయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.
