Jogulamba Gadwal: ఇవి రోడ్లా..చెరువులా?
ఇప్పటివరకు కొత్త రోడ్లు లేవు
ఉన్నవాటికి మరమ్మతులూ చేయని దుస్థితి
నరకయాతన అనుభవిస్తున్న ప్రజలు
వరి నాట్లు వేసి నిరసన తెలిపిన బీజేపీ నాయకులు
గద్వాల పట్టణంలో (Jogulamba Gadwal) రోడ్లు అధ్వానంగా మారాయి. గత పదేళ్లలో కొత్తగా ఒక్క రోడ్డు కూడా వేయలేని దుస్థితి నెలకొందంటూ వాపోతున్నారు. పట్టణంలోని అంబేద్కర్ చౌక్ దగ్గర బీజేపీ నాయకులు నాట్లు వేసి నిరసన తెలిపారు. ఆర్అండ్బీ ఎస్ఈకి పట్టణ అధ్యక్షురాలు రజక జయ శ్రీ, బండల వెంకట్ రాములు వినతి పత్రం అందించారు.
ఈ సందర్భంగా రజక జయశ్రీ మాట్లాడుతూ, గద్వాల పట్టణంలో ప్రధాన కూడళ్లలో వర్షపు నీరు నిలిచి చెరువులు తలపిస్తున్నాయని, వాహన దారులు,పాదాచారులు ఇబ్బంది పడుతున్నారని ఆమె చెప్పారు. అయినప్పటికీ అధికారులు స్పందించడం లేదని, తాత్కాలిక మరమ్మత్తులు కూడా చెయ్యలేకపోవడం శోచనీయమని జయశ్రీ విమర్శించారు. 2004 నుంచి 2014 వరకు డీకే అరుణ వేసిన రోడ్లు, చేసిన అభివృద్ధి తప్ప కొత్తగా మార్పు లేదని ఆమె దుయ్యబట్టారు.
Read Also- Sudershan Reddy: ఇండియా కూటమి అనూహ్య నిర్ణయం.. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా తెలుగు వ్యక్తి ఎంపిక
పార్టీ మారినా అభివృద్ధి శూన్యం
బీఆర్ఎస్ తరపున గెలిచిన స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యే ఏ పార్టీలో వుంటున్నారో కూడా తెలియని పరిస్థితి అని రజక జయశ్రీ విమర్శించారు. ఇంకొకరేమో బీఆర్ఎస్ నుంచి వచ్చి కాంగ్రెస్ టికెట్ తీసుకొని పోటీ చేశారని, ఇప్పుడేమో ప్రజల ఓట్లు కావాలి, కానీ, ప్రజా సంక్షేమం అవసరం లేదు అన్నట్టుగా ఆధిపత్యం కోసం ఈ ప్రాంత అభివృద్ధిని పట్టించుకోవడంలేదని ఆరోపించారు. ఇలాంటి వ్యక్తులతో గద్వాలను, గద్వాల అభివృద్ధిని వంద అడుగుల గుంతలో నిర్వీర్యం చేస్తున్నారని, ఈ వ్యక్తులను గద్వాల ప్రజలు క్షమించబోరని ఆమె మండిపడ్డారు.
Read Also- India Squad: ఆసియా కప్కు టీమ్ ప్రకటించిన బీసీసీఐ.. ఎవరూ ఊహించని నిర్ణయాలు
ఇక్కడున్న రోడ్ల దుస్థితిపై అధికార పార్టీ నాయకులమంటూ తిరుగుతున్న ఒక్క నేత కూడా ప్రభుత్వానికి ఇక్కడ నెలకొన్న సమస్యలపై నివేదిక ఇవ్వకపోవడం చూస్తుంటే.. వీళ్లకు అధికారం తప్ప ప్రజాసంక్షేమం అవసరం లేదన్నట్టు కనిపిస్తోందని రజక జయశ్రీ మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ బండల వెంకట్రాములు, జిల్లా ఉపాధ్యక్షుడు రజక నరసింహ, హర్ ఘర్ తీరంగా కన్వీనర్లు శ్యామ్ రావ్, పాండు, రాష్ట్ర బీజేవైఎం జాయింట్ కన్వీనర్ గాంజ సాయి కుమార్, జిల్లా ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షుడు డబ్లిటి నరసింహ, పట్టణ ఉపాధ్యక్షుడు తెలుగు రమేష్, మోహన్ రెడ్డి, కృష్ణవేణి, శంకర్, అసిఫ్, గంజిపేట తిమ్మన్న, పవన్, వాసు నాయుడు, గంజి అంజి, ముల్కలపల్లి నరసింహులు, ఇతర బీజేపీ నాయకులు పాల్గొన్నారు.