CM Revanth Reddy: ఎంతటి భారీ వర్షాలు వచ్చినా ప్రాణ నష్టం వాటిల్లకుండా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆదేశాలు జారీ చేశారు. లోతట్టు కాజ్వేలు, ఉధృతంగా ప్రవహించే నదులు, వాగులు, వంకలపై వంతెనలపై నుంచి రాకపోకలు లేకుండా చూడాలని సీఎం సూచించారు. పశువులు, గొర్రెలు, మేకల కాపర్లు తరచూ వాగుల్లో చిక్కుకొనిపోతున్నారని, ఈ విషయంలో ముందస్తుగా వారిని అప్రమత్తం చేయాలని సీఎం సూచించారు. ఎక్కడైనా ప్రమాదవశాత్తూ చిక్కుకుంటే వారిని తక్షణమే బయటకు తీసుకువచ్చే ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
Also Read: Hydrogen Train: త్వరలోనే సరికొత్త రైలు.. అమెరికా, రష్యాలో కూడా లేదు
అదే సమయంలో పశు నష్టం వాటిల్లకుండా చూడాలన్నారు. రానున్న 72 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయనే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అన్ని శాఖల ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లతో కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మాట్లాడుతూ, అతి భారీ వర్షాలు కురుస్తాయనే హెచ్చరికలు ఉన్న జిల్లాలకు సీనియర్ అధికారులను ప్రత్యేకాధికారులుగా నియమించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు సీఎం సూచించారు. అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సెలవులు రద్దు చేయాలని ఆదేశించారు. అంతా క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉండాలని ఆదేశించారు.
క్లౌడ్ బరస్ట్లపై ఫోకస్?
ఇక రెండు రోజుల్లో ఎంత వర్షపాతం ఎంత వస్తుంది? ఎలా ఎదుర్కోవాలనే దానిపై మాన్యువల్స్ ఉన్నాయనీ, కానీ వాతావరణ మార్పులతో రెండు గంటల్లోనే రెండు నెలల వర్షపాతం కురుస్తోందని, క్లౌడ్ బరస్ట్లతో ఊహించనంత నష్టం వాటిల్లుతోందని సీఎం తెలిపారు. క్లౌడ్ బరస్ట్ పరిస్థితులను ఎదుర్కొనే వ్యూహాలను సిద్ధం చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సూచించారు. ఊహించనంత వర్షపాతంతో గతంలో ఖమ్మం, వరంగల్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ప్రాణ నష్టంతో పాటు భారీగా ఆస్తి నష్టం వాటిల్లిందని, అలాంటి ఘటనలు ఎట్టి పరిస్థితుల్లోనూ పునరావృతం కావడానికి వీల్లేదన్నారు. ప్రాజెక్టులు, చెరువులు, కుంటల్లోకి ఇన్ఫ్లో, ఔట్ ఫ్లోపై పూర్తి అవగాహనతో ఉండాలని నీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించారు.
జల విద్యుత్ తయారీపైనా దృష్టి సారించాలని, అదే సమయంలో నీటి విడుదలపై పూర్తి సమాచారం లోతట్టు ప్రాంతాల ప్రజలకు తెలియజేయాలన్నారు. చెరువులు, కుంటలు కట్టల తెగే ప్రమాదం ఉన్నందున ముందస్తుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. మొబైల్ ట్రాన్స్ఫార్మర్లు, జనరేటర్లు, విద్యుత్ స్తంభాలు, ఇతర సామగ్రి సిద్ధంగా ఉంచాలన్నారు. సమస్య ఎక్కడ తలెత్తినా తక్షణమే పరిష్కరించాలన్నారు.
వైద్యారోగ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, పీహెచ్సీలు, సీహెచ్సీల్లో అవసరమైన మందులు ఉంచాలని, గర్భిణులను తక్షణమే తరలించేలా అంబులెన్స్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. అన్ని పట్టణాల్లో లోతట్టు ప్రదేశాల నుంచి ప్రజలను సహాయక శిబిరాలకు తరలించాలని, వారికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. పిడుగుపాట్లతో పశువులు, మేకలు, గొర్రెలు చనిపోయినప్పుడు ఎఫ్ఐఆర్లు నమోదు చేయించి బాధితులకు పరిహారం అందేలా చూడాలని పశుసంవర్ధక శాఖ అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.
హైదరాబాద్ నగరంలో సమన్వయం
హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనర్లు సమన్వయంతో పని చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. జీహెచ్ఎంసీ, హైడ్రా, పోలీస్, ఎంఏయూడీ ప్రతి విభాగం సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. ఐటీ, విద్యా శాఖ ఉన్నతాధికారులు పరిస్థితిపై సమీక్షించి వర్క్ ఫ్రం హోం, సెలవుల విషయమై నిర్ణయం తీసుకోవాలని సీఎం సూచించారు. హైడ్రా, విపత్తు నిర్వహణ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది, జీహెచ్ఎంసీ సిబ్బంది సమన్వయంతో ముందుకు సాగాలని సీఎం సూచించారు. హైడ్రా టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేయాలని, ప్రజల నుంచి వచ్చే సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సీఎం ఆదేశించారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సీఎం ఆదేశించారు. లా అండ్ ఆర్డర్ పోలీసులు సైతం ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో భాగస్వాములు కావాలని సీఎం సూచించారు. వాతావరణ హెచ్చరికలను ఎప్పటికప్పుడు ప్రచార, ప్రసార మాధ్యమాల ద్వారా ప్రజలకు అందజేయాలలన్నారు. అదే సమయంలో భయానక వాతావరణం సృష్టించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.
Also Read: Viral Video: ఎద్దుల బండి చక్రాలతో.. విచిత్రమైన కారు.. ఇక వరద నీటిలోనూ ఆగేదేలే!
