Trump on India: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్పై విషం కక్కారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుండడాన్ని సాకుగా చూపుతూ ఇప్పటికే భారత దిగుమతులపై 25 శాతం సుంకాలు విధించిన ఆయన.. రాగల 24 గంటల్లో భారత దిగుమతులపై సుంకాలను చాలా భారీగా పెంచబోతున్నట్టు తెలిపారు. రష్యా నుంచి భారత్ ఇంకా చమురు కొనుగోలును కొనసాగిస్తుండడమే ఇందుకు కారణమని ట్రంప్ పేర్కొన్నారు. మంగళవారం ‘సీఎన్బీసీ’ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇంకా ట్రంప్ ఏమన్నారంటే?
‘‘భారత్ మనకు మంచి వాణిజ్య భాగస్వామిగా లేదు. వాళ్లు మనతో బాగా బిజినెస్ చేస్తారు. కానీ, మనం వారితో అంతగా చేయడం లేదు. అందుకే, భారత్ దిగుమతులపై 25 శాతం సుంకం విధించాం. అయితే, దానిని రానున్న 24 గంటల్లోనే మరింత భారీగా పెంచాలని అనుకుంటున్నాను’’ అని ట్రంప్ పేర్కొన్నారు. భారత్పై సుంకాలను భారీగా పెంచుబోతున్నట్టు సోమవారం చేసిన వ్యాఖ్యలకు కొనసాగింపుగా మంగళవారం ట్రంప్ మాట్లాడారు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేసి, మంచి లాభాలతో అమ్ముకుంటోందని ట్రంప్ ఆరోపణలు చేశారు.
అమెరికాపై మండిపడ్డ భారత్
ట్రంప్ వ్యాఖ్యల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఘాటుగా స్పందించింది. అమెరికా, యూరోపియన్ యూనియన్లపై విమర్శలు గుప్పించింది. ఇండియన్ రిఫైనరీల ఎగుమతులను ప్రత్యేకంగా టార్గెట్ చేసుకుంటున్నారని విదేశాంగ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. గ్లోబల్ మార్కెట్ పరిస్థితుల కారణంగానే చమురు దిగుమతులు అవసరమవుతున్నాయని కుండబద్దలుకొట్టినట్టు చెప్పింది. తమ దేశాన్ని విమర్శిస్తున్న దేశాలు కూడా రష్యాతో వాణిజ్యంలో మునిగి తేలుతున్నాయని, తప్పనిసరిగా కాకపోయినా వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాయని విదేశాంగ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. రష్యాతో ఐరోపా దేశాలు చేస్తున్న వాణిజ్యం కేవలం ఇంధనానికే పరిమితం కాలేదని, ఎరువులు, ఖనిజ ఉత్పత్తులు, రసాయనాలు, ఇనుము-ఉక్కు, యంత్రాలు, రవాణా పరికరాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయని అధికారిక ప్రకటనలో విదేశాంగ శాఖ పేర్కొంది. దేశ ప్రయోజనాలు, ఆర్థిక వ్యవస్థను పరిరక్షించేందుకు అవసరమైన అన్ని చర్యలు తప్పుకుండా తీసుకుంటామని భారత్ తన వైఖరిని స్పష్టం చేసింది.
ట్రంప్ వ్యాఖ్యల నేపథ్యంలో రష్యాతో యూరోపియన్ యూనియన్ జరిపిన వాణిజ్యాన్ని లెక్కలతో సహా భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. విదేశాంగ శాఖ గణాంకాల ప్రకారం, 2024లో రష్యాతో యూరోపియన్ యూనియన్ 67.5 బిలియన్ యూరోలు విలువైన వాణిజ్యం నిర్వహించింది. ఇందులో లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ (LNG) దిగుమతులు రికార్డు స్థాయిలో 16.5 మిలియన్ మెట్రిక్ టన్నులకు పెరిగినట్టు వెల్లడించింది. రష్యా నుంచి చమురు కొనుగోలు ద్వారా రష్యా యుద్ధ వ్యూహానికి భారత్ మద్దతిస్తోందని పాశ్చాత్య మీడియా కథనాలు అల్లుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా స్పందించింది.
ముదురుతున్న వాణిజ్య ఉద్రిక్తతలు!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరి కారణంగా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు ముదిరుతున్నట్టుగా అనిపిస్తోంది. జులై 31న అమెరికాకు ఎగుమతి అవుతున్న భారతీయ ఉత్పత్తులపై 25 శాతం టారిఫ్ విధిస్తూ ట్రంప్ ప్రకటన చేయడం, ఆ తర్వాత రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడంపై హెచ్చరికలు చేయడంతో భారత్-అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలు క్రమంగా దెబ్బతింటున్నాయి. ఈ వాణిజ్య ఉద్రిక్తతలు భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపించవచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఈ వారం రష్యా వెళ్లనున్నారని తెలుస్తోంది. విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ కూడా త్వరలోనే రష్యా పర్యటనకు బయలుదేరే అవకాశాలు ఉన్నాయి.