Warangal: పోలీస్ అధికారులు తమ వృత్తిలో నైపుణ్యం సాధించేందుకు పోలీస్ డ్యూటీ మీట్లు ఎంతగానో దోహడపడుతాయని తెలంగాణ పోలీస్ అకాడమీ డైరక్టర్ అభిలాష బిస్ట్ అన్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ అధ్వర్యంలో పీటీసీ మామునూర్ వేదికగా ఎర్పాటు చేసిన రెండవ తెలంగాణ పోలీస్ డ్యూటీ మీట్ను గురువారం అడిషినల్ డీజీపీ మహేష్ భగవత్తో కలిసి ప్రారంభించారు. మూడు రోజుల పాటు జరగనున్న ఈ మీట్లో రాష్ట్రంలో ఏడు జోన్లతో పాటు సైబరాబాద్, రాచకొండ, హైదరాబాద్ కమిషనరేట్లు, సీఐడీ ఇంటెలిజెన్స్, యాంటీ నార్కోటిక్ బ్యూరో, సైబర్ సెక్యూరిటీ వింగ్, జీఆర్పీ, ఐటీ అండ్ టీ, అక్టోపస్, గ్రేహౌండ్స్ విభాగాలకు చెందిన సూమారు 4 వందలకుపైగా పోలీస్ అధికారులు, సిబ్బంది సైటిఫిక్ ఎయిడ్, యాంటీ సబటేజ్ చెక్, కంప్యూటర్, డాగ్ స్వ్కాడ్, ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీలకు సంబంధించిన 25 విభాగాల్లో పోటీ పడనున్నారు.
అందరిపై నమ్మకం ఉంది
ముఖ్య అతిథిగా విచ్చేసిన అభిలాష్ బిస్ట్ మాట్లాడుతూ, నూతన ఉత్తేజంతో ఈ పోటీల్లో పాల్గొన్న అధికారులకు ముందుగా అభినందనలు తెలియజేశారు. దేశంలో నేర దర్యాప్తుతో పాటు అన్ని విభాగాల్లో తెలంగాణ మొదటి రెండు స్థానాల్లో నిలువడం సంతోషించదగ్గ విషయమని మీరందరు కష్టపడి పని చేయడం ద్వారా మనకు ఈ కీర్తి ప్రతిష్ఠలు వచ్చాయని అన్నారు. అలాగే జాతీయ స్థాయిలో డ్యూటీ మీట్లో చక్కటి ప్రతిభ కనబరిచి అన్ని విభాగాల్లో పతకాలను సాధిస్తారని ఆశిస్తున్నట్టు చెప్పారు. మీ అందరిపై నమ్మకం ఉందని, మీరందరూ కఠినంగా సాధన చేస్తే తప్పక విజయం సాధిస్తారని వ్యాఖ్యానించారు.
దేశానికి తెలంగాణ పోలీస్ స్ఫూర్తి
అడిషినల్ డీజీపీ మహేష్ భగవత్ మాట్లాడుతూ, దేశానికి తెలంగాణ పోలీస్ అనేక విషయాల్లో ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు. వరంగల్లో పోలీస్ డ్యూటీ మీట్ నిర్వహించడం ఇది రెండవ సారని, గతంలో 2008లో ఇక్కడ డ్యూటీ నిర్వహించడం జరిగిందని, ఇటీవల జరిగిన 68వ జాతీయ స్థాయి మీట్లో తెలంగాణ పోలీసులు 18 పతకాలు సాధించారని తెలిపారు. ఇదే రీతిలో త్వరలో జరిగే జాతీయ స్థాయిలో మరిన్ని పతకాలను సాధించేందుకు కృషి చేయాలని సూచించారు. అంతకు ముందు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ తెలంగాణ పోలీస్ డ్యూటీ మీట్ నిర్వహణపై వివరించారు. ఈ కార్యక్రమంలో సీఐడీ డీఐజీ నారాయణ నాయక్, ఏస్పీ రాంరెడ్డి, డీసీపీలు అంకిత్ కుమార్, షేఖ్ సలీమా, రాజమహేంద్ర నాయక్, పీటీసీ ప్రిన్సిపాల్ పూజ, కమాండెంట్లు రాంకుమార్, రామకృష్ణతో పాటు ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.