Sheep scheme Scam ED: గొర్రెల స్కాంలో ఈడీ దూకుడు..
Goat Scam( IMAGE credit: twitter)
Telangana News, లేటెస్ట్ న్యూస్

Sheep scheme Scam ED: గొర్రెల స్కాంలో ఈడీ దూకుడు..హైదరాబాద్‌లో 10 చోట్ల దాడులు

Sheep scheme Scam ED: తెలంగాణలో పెను సంచలనం సృష్టించిన గొర్రెల స్కాంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఈడీ) అధికారులు దూకుడు పెంచారు.  వేర్వేరు బృందాలుగా విడిపోయి హైదరాబాద్‌లోని సికింద్రాబాద్, బోయిన్‌పల్లి, జూబ్లీహిల్స్, దిల్‌సుఖ్‌నగర్ తదితర ప్రాంతాల్లో దాడులు జరిపారు. పశు సంవర్ధక శాఖ మాజీ డైరెక్టర్ రాంచందర్​నాయక్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Talasani Srinivas Yadav)వద్ద ఓఎస్డీగా పని చేసిన కళ్యాణ్‌తో పాటు కేసులో కీలక నిందితులుగా ఉన్న మొయినుద్దీన్, ఇక్రముద్దీన్​ఇళ్లల్లో తనిఖీలు జరిపారు. ఈ క్రమంలో పలు కీలక డాక్యుమెంట్లు సీజ్ చేశారు. ఇక దిల్‌సుఖ్‌నగర్‌లోని కళ్యాణ్​నివాసం నుంచి డాక్యుమెంట్లతో పాటు భారీ మొత్తంలో నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

తీగ కదిలిందిలా!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా అంగలూరుకు చెందిన సన్నెబోయిన ఏడుకొండలు వృత్తిరీత్యా గొర్రెల పెంపకందారు. అతనితోపాటు మరికొందరి నుంచి పశు సంవర్ధక శాఖ అధికారులు రవికుమార్, కేశవసాయి, ప్రైవేట్ కాంట్రాక్టర్ మొయినుద్దీన్, అతని కుమారుడు ఇక్రముద్దీన్ కలిసి 133 యూనిట్ల గొర్రెలు కొన్నారు. అయితే, డబ్బులు మాత్రం చెల్లించలేదు. దాంతో ఏడుకొండలు అతనితో పాటు గొర్రెలు అమ్మిన వారు రాయదుర్గం పోలీసు(Rayadurgam Police)లకు ఫిర్యాదు చేసినపుడు ఈ కుంభకోణంలో తీగ కదిలింది.

Also Read: Roshni Walia: పార్టీలకు వెళ్లి ఎంజాయ్ చెయ్, కానీ ప్రొటెక్షన్ వాడు.. నటికి మదర్ సజెషన్!

బీఆర్ఎస్(brs)​అధికారంలో ఉన్నపుడు ఎంతో గొప్పగా చెప్పుకొని 2017లో గొర్రెల పంపిణీ స్కీంను ప్రారంభించింది. దీని కోసం రూ.12వేల కోట్లు కేటాయించింది. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే పథకం ప్రారంభించినపుడు ఒక్కో యూనిట్ ధర రూ.1.25లక్షలకు కొనాలని నిర్ణయించడమే. అయితే, ప్రైవేట్​కాంట్రాక్టర్ మొయినుద్దీన్, అతని కుమారుడు ఇక్రముద్దీన్​తెరపైకి వచ్చాక ఒక్కో యూనిట్ ధర అమాంతంగా రూ.1.75 వేలకు పెరిగింది. దాంతోపాటు ఈ స్కీంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్టుగా ఆరోపణలు వచ్చాయి. ఇదంతా అప్పటి బీఆర్ఎస్​ప్రభుత్వంలోని కొందరు మంత్రుల కనుసన్నల్లోనే జరిగిందని వార్తలొచ్చాయి.

రంగంలోకి ఏసీబీ
గొర్రెల పంపిణీ స్కీంలో అక్రమాలు జరిగినట్టుగా కాగ్ నివేదిక కూడా చెప్పటంతో కేసును ఏసీబీ(acb)కి బదిలీ అయ్యింది. ఈ క్రమంలో ఏసీబీ అధికారులు జరిపిన విచారణలో పలు సంచలన వివరాలు వెలుగు చూశాయి. గొర్రెల పంపిణీ స్కీంలో రూ.700 కోట్లు గోల్ మాల్ జరిగినట్టుగా నిర్ధారణ అయ్యింది. చాలా జిల్లాల్లో గొర్రెలను పంపిణీ చేయకున్నా చేసినట్టు రికార్డులు సృష్టించి కోట్లాది రూపాయలను స్వాహా చేశారని వెల్లడైంది. దీంట్లో ప్రభుత్వ అధికారులతోపాటు ప్రైవేట్ కాంట్రాక్టర్ మొయినుద్దీన్, ఇక్రముద్దీన్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Talasani Srinivas Yadav) వద్ద ఓఎస్డీగా పని చేసిన కళ్యాణ్ పాత్ర ఉన్నట్టుగా తేలింది.

ఈ క్రమంలో ఏసీబీ అధికారులు పశు సంవర్ధక శాక మాజీ డైరెక్టర్ రాంచందర్ నాయక్‌‌(Ramchander Nayak)తో పాటు వేర్వేరు ప్రభుత్వ విభాగాలకు చెంది ఈ స్కీంలో నోడల్ ఆఫీసర్లుగా వ్యవహరించిన డాక్టర్ రవి, ఎం.ఆదిత్య కేశవసాయి, పసుల రఘుపతి రెడ్డి, సంగు గణేశ్, కళ్యాణ్‌తో పాటు పలువురిని అరెస్ట్ చేశారు. అయితే, కేసులు నమోదు కాగానే మొయినుద్దీన్, అతని కుమారుడు ఇక్రముద్దీన్ దుబాయ్ పారిపోయారు. ఇప్పటి వరకు ఈ ఇద్దరు పోలీసుల చేతికి చిక్కలేదు.

కేసులు పెట్టిన ఈడీ
ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ అధికారులు 2024, జూన్‌‌లో కేసులు నమోదు చేశారు. అప్పటి వరకు ఏసీబీ జరిపిన దర్యాప్తులో వెల్లడైన వివరాలను తీసుకున్నారు. గొర్రెల పంపిణీ కుంభకోణంలో జరిగిన రూ.700 కోట్లు గోల్‌మాల్‌లో సింహ భాగం డబ్బు మనీ లాండరింగ్ ద్వారా తరలినట్టుగా ఈడీ అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే పశు సంవర్ధక శాఖ మాజీ డైరెక్టర్ రాంచందర్ నాయక్‌తో పాటు నోడల్ అధికారులుగా వ్యవహరించిన వేర్వేరు ప్రభుత్వ శాఖల అధికారులు, మాజీ మంత్రి తలసాని వద్ద ఓఎస్డీగా పని చేసిన కళ్యాణ్‌ను గతంలో విచారించారు కూడా.

తాజాగా  మరోసారి వీరందరి ఇళ్లపై దాడులు జరిపారు. సోదాల్లో రాంచందర్ నాయక్, కళ్యాణ్‌తో పాటు పరారీలో ఉన్న మొయినుద్దీన్, ఇక్రముద్దీన్ ఇళ్ల నుంచి పలు కీలక డాక్యుమెంట్లు సీజ్ చేసినట్టుగా తెలిసింది. ఇక, కళ్యాణ్​ ఇంట్లో భారీ ఎత్తున నగదు కూడా దొరికినట్టు సమాచారం. కౌంటింగ్ మిషన్‌ను తెప్పించి మరీ ఈ డబ్బును లెక్కించిన ఈడీ అధికారులు ఆ తర్వాత దానిని సీజ్​చేశారు. కళ్యాణ్‌ను అదుపులోకి తీసుకుని బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయానికి తరలించారు.

 Also Read: Elumalai lyrical: ‘ఏలుమలై’ సినిమా నుంచి విడుదలైన లిరికల్ సాంగ్..

Just In

01

Bigg Boss Telugu 9: భరణి ఇమిటేషన్ అదుర్స్.. ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ లోడింగ్..

KTR Vs Congress: ఉప్పల మల్లయ్య ఇంటికి వెళ్లి.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

Itlu Arjuna: ‘న్యూ గయ్ ఇన్ టౌన్’ ఎవరో తెలిసిపోయింది.. ‘సోల్ ఆఫ్ అర్జున’ వచ్చేసింది

India Vs South Africa: దక్షిణాఫ్రికాతో మూడో టీ20.. టాస్ గెలిచిన భారత్.. ఏం ఎంచుకుందంటే?

KCR: 19న కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్‌ఎల్పీ భేటీ.. మరో ప్రజా ఉద్యమం!.. కీలక నిర్ణయాలు!