Warangal Task Force: ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం కలిగిస్తూ బోగస్ వాహన రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్ సర్టిఫికెట్లను తయారు చేస్తున్న రెండు ముఠాలకు సంబంధించి 15 మందిని వరంగల్ టాస్క్ ఫోర్స్, హన్మకొండ,(Hanamkonda) మిల్స్ కాలనీ, కేయూసీ పోలీసులు ఆర్టీఏ అధికారులతో సంయుక్తంగా కలిసి అరెస్టు చేశారు. మరో ఐదుగురు నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. పట్టుబడిన నిందితుల నుంచి పోలీసులు 6 డెస్క్ టాప్ కంప్యూటర్లు, 2 ల్యాప్ టాప్లు, 2 థర్మల్ ప్రింటర్లు, 17 సెల్ ఫోన్లతో పాటు కంప్యూటర్ చిప్తో కూడిన పీవీసీ కార్డులు, కార్డు ప్రింటింగ్కు అవసరమైన సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
అరెస్ట్ అయిన వారిలో హన్మకొండ(Hanamkonda)కు చెందిన ఎండీ ఆసిఫ్ ఖురేషి, వడ్లకొండ శ్రీనివాస్, గుడిబండల్, వరంగల్(Warangal)లేబర్ కాలనీకి చెందిన ఎండీ నవాబ్, ఎల్బీనగర్కు చెందిన ఎండీ సాబీర్, మణికంటి ప్రభాకర్ రెడ్డి (50), హన్మకొండ నయీంనగర్ చెందిన గుగ్గిళ్ళ చెర్రిబాబు, హనుమకొండ కాపువాడకు చెందిన కెషోజు రాజ్కుమార్ అలియాస్ డీఎల్. రాజు, ధర్మసాగర్ కరుణాపురం చెందిన ఎండీ ఆసిఫ్, అంకం శ్రీనివాస్, ధర్మసాగర్ చెందిన గొనెల రమేశ్ అలియాస్ వాగ్దేవి రమేశ్, ఎన్. శశివర్ధన్ (31), నరిశెట్టి రాజేశ్, తండ దిలీవ్ కుమార్, ముజ్జిగ ఓంప్రకాశ్, ముషిపట్ల అక్షయ్ కుమార్ ఉన్నారు. లక్ష్మమ్మ, సతీశ్, వేల్పుల ప్రశాంత్, దేవులపల్లి శ్రావణ్, మామిడి రాజ పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.
Also Read: Khammam District Farmers: వినూత్న రీతిలో మామిడి పిక్కల నుండి మొక్క తయారీ.. ఎక్కడంటే!
పట్టుబడిన నిందితుల్లో అధికశాతం ఆర్టీఓ బ్రోకర్లు, వాహన కన్సల్టెన్సీ యజమానులు ఉన్నారు. సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా అరెస్టుకు సంబంధించి వివరాలను వెల్లడిస్తూ.. ఈ రెండు కేసులకు సంబంధించి హన్మకొండ పోలీసులు అరెస్టు చేసిన ఇద్దరు ప్రధాన నిందితులైన ఎండీ ఆసిఫ్ ఖురేషి, వడ్లకొండ శ్రీనివాస్ ఆర్టీఏ ఏజెంట్లుగా చలామణి అవుతున్నారు. ఫైనాన్స్ ద్వారా వాహనాలు కొనుగోలు చేసి వాటి వాయిదాలు తిరిగి చెల్లించని పక్షంలో ఫైనాన్స్ సంస్థలు స్వాధీనం చేసుకున్న వాహనాలను తిరిగి విక్రయించే సమయంలో తప్పనిసరిగా ఫ్రెష్ రిజిస్ట్రేషన్ కార్డు కోసం ఆర్టీఓ కార్యాలయానికి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కానీ, వాహన ఫైనాన్స్ సంస్థలు అలా చేయకుండా స్వాధీనం చేసుకున్న వాహనాలను నేరుగా స్థానికంగా ఉన్న వాహన కన్సల్టెన్సీ వ్యాపారస్తులకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లతో పాటు ఒరిజినల్ వాహన రిజిస్ట్రేషన్ కార్డు లేకుండానే విక్రయించేవారు.
ఒరిజినల్ కార్డులపై థర్మల్ ప్రింటింగ్
దీనితో వాహన కన్సల్టెన్సీ వ్యాపారస్తులు వాహనాలను విక్రయించేందుకు గాను అవసరమైన ఒరిజినల్ రిజిస్ట్రేషన్ పత్రాల కోసం ప్రధాన నిందితులను సంప్రదించేవారు. దీనితో నిందితులు కన్సల్టెన్సీ ద్వారా విక్రయించే వాహనాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఆన్లైన్ ద్వారా సేకరించి, ఆన్లైన్లో కొనుగోలు చేసిన పీవీసీ కార్డులపై మరియు ఆర్టీఓ కార్యాలయముల నుండి అక్రమంగా వివిధ మార్గాల్లో సేకరించిన ఒరిజినల్ కార్డులపై థర్మల్ ప్రింటింగ్ మిషన్ ద్వారా ఒరిజినల్ తరహాలో రిజిస్ట్రేషన్ కార్డులను తయారు చేసి కన్సల్టెన్సీ వ్యాపారస్తులకు అందించేవారు. కన్సల్టెన్సీ వ్యాపారస్తులు వాహన ఫైనాన్స్ సంస్థల నుండి కొనుగోలు చేసిన వాహనాలను ప్రజలకు విక్రయిస్తూ బోగస్ రిజిస్ట్రేషన్ పత్రాలను ఉపయోగించి ఆన్లైన్లో ఫ్రెష్ రిజిస్ట్రేషన్లను ఆర్టీఏ నుండి జారీ చేయిస్తున్నారు.
నకిలీ ఇన్సూరెన్స్ సర్టిఫికెట్ల తయారీ..
మరో సంఘటనలో కేయూసీ, మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీసులు అరెస్టు చేసిన నిందితులు ఆర్టీఏ బ్రోకర్లుగా పనిచేస్తున్నారు. ఫిట్నెస్ సర్టిఫికెట్ రెన్యూవల్ అవసరం ఉన్న వాహనాలకు, ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ సమయంలో ఆర్టీఏ నిబంధనల ప్రకారం వాహన బీమా పత్రాలు తప్పనిసరి కావున, దీనిని ఆసరాగా చేసుకొని, అవసరమైన బీమా పత్రాల కోసం ఈ ముఠా సభ్యులు ముందుగా ఒక ఒరిజినల్ బీమా పాలసీని తీసుకునేవారు. వారికి ఉన్న పరిజ్ఞానంతో పాలసీపై ఉన్న వివరాలను మార్చి, వాటి స్థానంలో వారికి కావలసిన వాహన వివరాలు, కావలసిన పాలసీ గడువు తేదీలతో కూడిన బోగస్ వాహన పాలసీలను రూపొందించేవారు.
ప్రభుత్వ ఖజానాకు నష్టం
ఈ విధంగా రూపొందించిన బీమా పత్రాలను ఆర్టీఓ కార్యాలయానికి ఆన్లైన్లో దరఖాస్తు చేసి ఫిట్నెస్ రెన్యూవల్ సర్టిఫికెట్ పొందే విధంగా నిందితులు వాహనదారులకు సహకరిస్తూ, వారి వద్ద పెద్ద మొత్తంలో డబ్బు వసూళ్లకు పాల్పడేవారు. రెండు వేర్వేరు సంఘటనల్లో హన్మకొండ పోలీసులు ఆరుగురిని అరెస్టు చేయగా, మిల్స్ కాలనీ పోలీసులు ఆరుగురిని, కేయూసీ పోలీసులు మరో ముగ్గురిని అరెస్టు చేసారు. ఈ రెండు సంఘటనల్లో నిందితులు బోగస్ రిజిస్ట్రేషన్ కార్డులు, బోగస్ బీమా పత్రాలను అందజేయడం ద్వారా పెద్ద మొత్తంలో ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగింది.
అలాగే ఆర్టీఓ విభాగానికి సంబంధించి ఎవరైనా ఉద్యోగులు నిందితులకు సహకరించారా అనే కోణంపై పోలీసులు విచారణ జరుపుతున్నట్లుగా సెంట్రల్ జోన్ డీసీపీ వెల్లడించారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన వరంగల్ ఏసీపీ శుభంప్రకాశ్, హన్మకొండ ఏసీపీ నర్సింహారావు, టాస్క్ఫోర్స్ ఏసీపీ మధుసూధన్, ఇన్స్పెక్టర్లు సత్యనారాయణ రెడ్డి, శ్రీధర్, బాబులాల్, పవన్ కుమార్ మరియు కేయూసీ, మిల్స్ కాలనీ, హన్మకొండ ఇన్స్పెక్టర్లు రవికుమార్, రమేశ్, శివకుమార్ తో పాటు, టాస్క్ఫోర్స్, కేయూసీ, మిల్స్ కాలనీ, హన్మకొండ పోలీస్ స్టేషన్లకు చెందిన ఎస్.ఐలు, ఇతర పోలీస్ సిబ్బందిని సెంట్రల్ జోన్ డీసీపీ అభినందించారు.
Also Read: Farmers Protest: రోడ్డెక్కిన రైతన్నలు.. సీడ్ కంపెనీల తీరుపై తీవ్ర ఆగ్రహం..