Rave Party: కొండాపూర్లోని ఓ సర్వీస్ అపార్ట్మెంట్లో జరుగుతున్న రేవ్పార్టీని ఎక్సైజ్ ఎస్టీఎఫ్ అధికారులు భగ్నం చేశారు. తొమ్మిది మంది నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి భారీ మొత్తంలో మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. కాగా, ప్రధాన సూత్రధారి కారుపై ఓ ఎంపీకి చెందిన స్టిక్కర్ అతికించి ఉండటం, పట్టుబడిన వారిలో బడా బాబులు ఉన్న నేపథ్యంలో నిందితులకు రాజకీయ నేతలతో సంబంధాలు ఉన్నాయా? అన్న కోణంలో విచారిస్తున్నారు. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ షానవాజ్ఖాసీం తెలిపిన ప్రకారం కొండాపూర్ జేవీ హిల్స్ ప్రాంతంలోని ఎన్నెస్ట్ అపార్ట్మెంట్ పక్కనే ఉన్న ఎస్వీ నిలయం సర్వీస్ అపార్ట్మెంట్లో శనివారం రాత్రి రేవ్ పార్టీ జరుగుతున్నట్టు ఎక్సైజ్పోలీసులకు సమాచారం అందింది. ఈ క్రమంలో ఎస్టీఎఫ్ టీం సీఐ ప్రదీప్ రావు, ఎస్ఐ సంధ్య, బాలరాజులు సిబ్బందితో కలిసి దాడి చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మంగళగిరి, విజయవాడ, కాకినాడ, రాజమండ్రిలకు చెందిన కే. రాహుల్, ఉన్నతి ఎమ్మాన్యుయెల్అలియాస్ ప్రవీణ్ కుమార్, అప్పికట్ల అశోక్ నాయుడు, సమ్మెల సాయికృష్ణ, నాగెళ్ల లీలా మణికంఠ, హిల్టన్ జోసెఫ్రోల్ఫ్, అడప యశ్వంత్ శ్రీదత్త, తోట కుమారస్వామి, నందం సుమంత్ తేజలను అరెస్ట్ చేశారు. వీరి నుంచి 2కిలోల గంజాయి, 50గ్రాముల ఓజీ కుష్, 11.57 గ్రాముల మ్యాజిక్ మష్రూమ్స్, 1.91గ్రాముల చరస్, 4 ఎల్ఎస్డీ బ్లాస్ట్ పేపర్లను స్వాధీనం చేసుకున్నారు. దీంతోపాటు ఓ ఫార్చునర్, ఫోర్డ్ కారుతోపాటు రెండు ద్విచక్ర వాహనాలు, 11 మొబైల్ ఫోన్లను సీజ్ చేశారు.
ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకుని..
విచారణలో అప్పికట్ల అశోక్ నాయుడు ఈ రేవ్ పార్టీలను నిర్వహిస్తున్నట్టుగా వెల్లడైంది. తనకు పరిచయం ఉన్న సంపన్న కుటుంబాలకు చెందిన యువకుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బు తీసుకుంటూ వారంలో రెండు రోజులపాటు హైదరాబాద్ తీసుకొచ్చి ఎంజాయ్ చేయిస్తున్నట్టుగా వెల్లడైంది. డ్రగ్స్ను అందజేయటంతోపాటు యువతులతో అశ్లీల నృత్యాలు కూడా జరిపిస్తున్నట్టుగా తేలింది. పార్టీలు నిర్వహించటానికి ‘ఎయిర్బీఎన్బీ’ అనే వెబ్సైట్ ద్వారా సర్వీస్ అపార్ట్మెంట్లను బుక్ చేస్తున్నట్టుగా తేలింది. ఎప్పటిలానే అశోక్ నాయుడు శనివారం తొమ్మిది మంది యువకులను వెంటబెట్టుకుని కొండాపూర్లోని ఎస్వీ నిలయం సర్వీస్ అపార్ట్మెంట్లో బుక్ చేసి పెట్టుకున్న ఫ్లాట్కు తీసుకువచ్చినట్టుగా వెల్లడైంది. ఇలా రేవ్ పార్టీలకు వస్తున్న యువకులకు రాహుల్మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తున్నట్టుగా విచారణలో వెల్లడైంది. ‘డార్క్వెబ్’లో ఆర్డర్ చేయటం ద్వారా రాహుల్ గంజాయి, ఓజీ కుష్, చరస్, ఎల్ఎస్డీ బ్లాస్ట్ పేపర్లను తెప్పించుకుని వీరికి విక్రయిస్తున్నట్టుగా తేలింది.
Read Also- Fake Pensions: అక్రమ పింఛన్లకు చెక్.. ఇకపై అలా కుదరదు!
ఎంపీ స్టిక్కర్ ఎవరిది?
రేవ్ పార్టీలు నిర్వహిస్తున్న అశోక్ నాయుడుకు చెందిన ఫార్చూనర్కారుపై ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ ఎంపీ స్టిక్కర్ అతికించి ఉండటం గమనార్హం. ఇక, పార్టీ చేసుకుంటూ దొరికిపోయిన వారంతా సంపన్న కుటుంబాలకు చెందిన వారని సమాచారం. ఈ నేపథ్యంలో రేవ్ పార్టీ నిందితులకు ఎవరైనా రాజకీయ నాయకులతో పరిచయాలు ఉన్నాయా? అనే కోణంలో ఎక్సైజ్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఇదే కేసులో శ్రీనివాస్ చౌదరి అలియాస్ వాసు, అఖిల్లకు కూడా సంబంధం ఉన్నట్టుగా ఎక్సైజ్ అధికారుల దర్యాప్తులో తేలింది. ప్రస్తుతం ఈ ఇద్దరు పరారీలో ఉన్నారు. వీరి కోసం గాలిస్తున్నట్టు సీఐ ప్రదీప్ రావు తెలిపారు. నిందితులు అందరిపై మాదక ద్రవ్యాల నిరోధక చట్టం ప్రకారం కేసులు నమోదు చేసి శేరిలింగంపల్లి ఎక్సైజ్ పోలీసులకు అప్పగించినట్టు చెప్పారు.
Read Also- Samantha: ఆ విషయంలో ఇద్దరికీ పెద్ద గొడవ.. రాజ్ కి బ్రేకప్ చెప్పనున్న సమంత?