BJP: తెలంగాణ కాషాయ పార్టీలో నేతల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉన్నది. ఈ పోరు ఇప్పట్లో ఆగే అవకాశాలు ఏమాత్రం కనిపించడంలేదు. అందుకే ఈ ధోరణికి చెక్ పెట్టడంపై రాష్ట్ర నాయకత్వం దృష్టిసారిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో లోక్ సభ సభ్యులకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. అలా చేయడం వల్ల వారు ఇతర పనుల్లో బిజీగా ఉండి ఆధిపత్య పోరును పక్కన పెట్టేస్తారని రాష్ట్ర నాయకత్వం భావిస్తున్నది. బీజేపీలో ప్రస్తుతం 8 మంది ఎంపీలు ఉన్నారు. ఇప్పుడు ప్రధానంగా ఆధిపత్య పోరు కొనసాగుతున్నది ఎంపీల్లోనే కావడంతో ఈ ఆలోచనను అమలు చేయాలని పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. ఫ్రీ హ్యాండ్ ఇచ్చి లోక్ సభ సభ్యులను వారి పార్లమెంట్ సెగ్మెంట్కే పరిమితం చేయాలని యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీని ద్వారా ఆధిపత్య పోరుకు చెక్ పెట్టవచ్చేనే ధోరణిలో రాష్ట్ర నాయకత్వం ఉన్నట్లు చెబుతున్నారు.
Read Also- Swetcha Effect: ‘స్వేచ్ఛ’ ఎఫెక్ట్.. అన్యాయాన్ని ప్రశ్నిస్తే బెదిరింపులా?
డీల్ చేసేదెలా?
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామ్ చందర్ రావు బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఆధిపత్య పోరు క్రమంగా పెరుగుతూ వచ్చింది. కాషాయ పార్టీ పగ్గాల కోసం ఎంపీలు చాలా మంది ఆశించారు. కానీ వారిని కాదని రాంచందర్ వైపు అగ్రనాయకత్వం మొగ్గు చూపింది. దీంతో ఎంపీలను ఆయన ఎలా డీల్ చేయగలరు? అనేది ఆసక్తికరంగా మారింది. కేంద్ర మంత్రులిద్దరినీ పక్కనపెడితే ఎంపీల్లో ధర్మపురి అర్వింద్, ఈటల రాజేందర్, డీకే అరుణ, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రఘునందన్ రావును కొత్త సారథి ఎలా డీల్ చేస్తారనే దానిపై కార్యకర్తల్లో విస్తృత చర్చసాగుతోంది. గోడెం నగేశ్ ఎలాగూ సైలెంట్గా ఉండటంతో మిగతా లోక్సభ సభ్యులను హ్యాండిల్ చేయడంపై శ్రేణుల్లోనూ సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే ఎంపీలకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చి వారిని వారి పనుల్లో నిమగ్నం చేసి ఆధిపత్య పోరుకు చెక్ పెట్టవచ్చనే ఆలోచనతో రాష్ట్ర నాయకత్వం ఉన్నట్లు సమాచారం.
Read Also- Sleeping Prince: సౌదీ ప్రిన్స్ అల్వలీద్ బిన్ కన్నుమూత.. 2005లో ఏం జరిగింది?
ప్రక్షాళన షురూ!
కొత్త సారథి బాధ్యతలను దక్కించుకున్న రామ్ చందర్ రావు పార్టీ ప్రక్షాళన దిశగా ఇప్పటికే ఆపరేషన్ మొదలుపెట్టారు. రాష్ట్ర కమిటీలో ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలనే దానిపై కసరత్తు చేస్తున్నారు. ఈ తరుణంలో ఆయనకు ప్రత్యర్థి పార్టీల నుంచి కంటే సొంత పార్టీ నుంచే ఒత్తిళ్లుఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తుండటంతో ఏం చేస్తే బాగుంటుందా? అనే సందిగ్ధంలో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీలో కీలకమైన నేతలు ఎక్కువగా ఉండటం, వారిని బ్యాలెన్స్ చేయడం రామ్ చందర్ ఎదుట ఉన్న అతిపెద్ద సవాల్. దీన్ని ఆయన ఎలా అధిగమిస్తారనేది ఆసక్తికరంగా మారింది. అధ్యక్ష పీఠంపై ఆశలు పెట్టుకొని నిరాశకు గురైన లోక్ సభ సభ్యులు రామ్ చందర్ రావుకు సహకరిస్తారా? లేదా? అనే చర్చ పార్టీలో జరుగుతోంది. అయితే కీలక నేతలను ఎక్కడికక్కడ వారి లోక్సభ స్థానాలకే పరిమితం చేసి పార్టీలో ఆధిపత్య పోరుకు చెక్ పెట్టేలా వ్యూహరచనకు ప్లాన్ చేస్తున్న రాష్ట్ర నాయకత్వం వ్యూహం ఏ మేరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.
Read Also- Live in Relationship: ఇన్స్టాగ్రామ్లో పరిచయం.. నాలుగేళ్లుగా సహజీవనం.. సీన్ కట్ చేస్తే!