Viral News: కారణాలు ఏమైనా కావొచ్చు కానీ ఈ మధ్య కాలంలో భర్తలను హత్య చేస్తున్న భార్యల వార్తలు (Viral News) ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇలాంటి ఘటనే ఒకటి అసోంలోని గువాహటిలో వెలుగులోకి వచ్చింది. 38 ఏళ్ల వయసున్న రహీమా ఖాతూన్ అనే మహిళ, తన భర్త సబియాల్ రెహ్మాన్ను (40) హత్య చేసి ఇంట్లోనే పాతిపెట్టింది. జూన్ 26న హత్యకు పాల్పడి జోమతి నగర్ ఏరియాలోని తన నివాసంలో 5 అడుగుల లోతు గొయ్యి తీసి శవాన్ని పూడ్చిపెట్టింది.
ఆసుపత్రి పేరుతో పరార్
భర్త కనిపించకపోతే ఇరుగుపొరుగు వారికి అనుమానం వస్తుందనే ఉద్దేశంతో, రెహ్మాన్ ఒక పనిమీద కేరళకు వెళ్లాడని అందరినీ నమ్మించింది. తన ఆరోగ్యం బాగోలేదని, హాస్పిటల్కు వెళ్తున్నానంటూ రహీమా ఇల్లు వదిలి పరారైంది. అయితే, రహీమా ఇల్లు వదిలిపోవడం, రెహ్మాన్ ఆచూకీ లేకపోవడంతో స్థానికుల్లో అనుమానం మొదలైంది. మృతుడు రెహ్మాన్కు సంబంధించిన సమాచారం తెలియకపోవడంతో అతడి సోదరుడు ఆరా తీశాడు. అయినప్పటికీ ఆచూకీ తెలియకపోవడంతో జూలై 12న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు రంగంలోకి దిగడంతో జులై 13న రహీమా ఖాతూన్ నేరుగా గువాహటిలోని జలుక్బారి పోలీస్ స్టేషన్కి వెళ్లి లొంగిపోయింది. భర్త చనిపోయాడని, తానే హత్య చేశానని ఆమె ఒప్పుకుంది.
Read Also- DGCA: జులై 21 గడువు.. ఎయిర్లైన్స్కు డీజీసీఏ కీలక ఆదేశాలు
ఇద్దరి మధ్య ఘర్షణలు
ఇద్దరి మధ్య ఘర్షణల నేపథ్యంలో హత్య చేసినట్టుగా రహీమా అంగీకరించింది. పెద్ద గొడవ జరిగిన తర్వాత చంపేశానని ఆమె వివరించింది. దీంతో, నిందితురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, మృతుడు రెహ్మాన్ తుక్కు డీలర్గా పని చేసేవాడు. వీరిద్దరికి పెళ్లై 15 ఏళ్లు అయ్యింది. ఈ హత్యపై గువాహటి వెస్ట్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ పద్మనాభ్ బరువా మీడియాతో మాట్లాడారు. జూన్ 26న భర్తతో జరిగిన పెద్ద గొడవ తర్వాత మద్యమత్తులో ఉన్న భర్తను రహీమా కొట్టిందని, తీవ్ర గాయాలతో అతడు చనిపోయాడన్నారు. ఆ తర్వాత, భయంతో ఆమె ఇంట్లోనే 5 అడుగుల గొయ్యి తవ్వి శవాన్ని పాతిపెట్టిందని అని చెప్పారు.
Read Also- Viral News: ట్రాఫిక్లో 2 గంటలు చిక్కుకున్న కంపెనీ ఓనర్.. కీలక నిర్ణయం
ఈ హత్యలో ఇంకెవరైనా పాలుపంచుకున్నారా? అనే కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. రహీమా ఒంటరిగా అంత పెద్ద గొయ్యి తవ్వడం సాధ్యమవుతుందా? అనే దర్యాప్తు బృందం అనుమానిస్తోంది. అందుకే, అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి గొయ్యి తవ్వడానికి ఇంకెవరైనా సాయం చేసి ఉండొచ్చని, కేసును ఆ దిశగా పరిశీలిస్తున్నామని వివరించారు. కాగా, శవాన్ని తవ్వి బయటకు తీసి, ఫోరెన్సిక్ పరీక్షల కోసం పంపించారు. కేసులో తదుపరి విచారణ కొనసాగుతోంది.
Read Also- Air India: విమాన ప్రమాద ప్రాథమిక రిపోర్టుపై ఎయిరిండియా కీలక ప్రకటన