DGCA: అహ్మదాబాద్లో జరిగిన ఎయిరిండియా ఘోర విమాన ప్రమాదంపై ప్రాథమిక నివేదిక విడుదలైన తర్వాత, విమాన ఇంజిన్ల ఫ్యూయల్ స్విచ్లు అకస్మాత్తుగా ఆఫ్ కావడంతోనే కుప్పకూలి ఉండొచ్చనే అభిప్రాయాలు బలపడుతున్నాయి. తుది కారణం ఇదేనంటూ నివేదిక చెప్పకపోయినప్పటికీ, ముందస్తు జాగ్రత్తగా అన్ని బోయింగ్ విమానాల్లో ఫ్యూయల్ స్విచ్లను తనిఖీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పౌరవిమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. భారతదేశంలో రిజిస్టర్ అయిన అన్ని విమానాల్లో ఫ్యూయల్ స్విచ్ల తనిఖీని తప్పనిసరి చేసింది.
డెడ్లైన్ జులై 21
జులై 21 లోగా ఫ్యూయల్ స్విచ్ల తనిఖీలు పూర్తి చేయాలని దేశీయ విమానయాన సంస్థలను డీజీసీఏ ఆదేశించింది. తనిఖీలు చేపట్టడమే కాకుండా, ప్రభుత్వ విధానాలు లేదా తయారీ కంపెనీకి సంబంధించిన మార్గదర్శకాలకు అనుగుణంగా విమానాలు, ఇంజిన్లు, భాగాలలో మార్పులు చేసుకోవాలని సూచించింది. ముఖ్యంగా, బోయింగ్ కంపెనీకి చెందిన 737, 787-8/9/10 డ్రీమ్లైనర్ సిరీస్ విమానాలకు ఈ ఆదేశాలు వర్తిస్తాయి. ఈ మోడల్ విమానాల్లో ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్ల లాకింగ్ ఫీచర్ అకస్మాత్తుగా పనిచేయకపోవడానికి అవకాశం ఉన్నట్టు ఇటీవలి ప్రమాదం ద్వారా స్పష్టమైందని పేర్కొంది. కాగా, ఈ తరహా హెచ్చరిక మొదటిగా 2018 డిసెంబర్ 17న అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఇచ్చింది.
Read Also- Viral News: ట్రాఫిక్లో 2 గంటలు చిక్కుకున్న కంపెనీ ఓనర్.. కీలక నిర్ణయం
ప్రాథమిక నివేదికలో ఏముంది?
జూన్ 12న జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంపై ఏఏఐబీ (ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో) ఇటీవలే ప్రాథమిక నివేదిక విడుదల చేసింది. 15 పేజీలతో కూడిన ఈ రిపోర్టులో బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ విమానంలో టేకాఫ్ అయిన కొన్ని సెకన్లలోనే ఇంజిన్లు ఆగిపోయాయని, ఇంజిన్-1, ఇంజిన్-2లకు ఇంధనాన్ని సరఫరా చేసే స్విచ్లు ‘రన్’ నుంచి ‘కట్-ఆఫ్’కి మారాయని, రెండూ ఒకే సమయంలో ఆగిపోయాయని పేర్కొంది. విమానం 180 నాటికల్ కిలొమీటర్ల వేగంతో గాల్లోకి వెళ్తున్న సమయంలోనే ఈ స్విచ్లు ఆఫ్ అయ్యాయని, దీంతో ఇంజిన్లు పైకి ఎగిరే శక్తిని కోల్పోయి విమానం కూలిపోయిందని పేర్కొంది. కాగా, ఈ విమాన ప్రమాదంలో 270 మందికి పైగా చనిపోయారు. విమానం ప్రయాణించిన 242 మంది ఒక్కరు మినహా మిగతావారంతా ప్రాణాలు కోల్పోయారు. ఇక విమానంకూలిన జేబీ మెడికల్ కాలేజీకి సంబంధించిన 30 మందికి పైగా విద్యార్థులు చనిపోయినట్టుగా తెలుస్తోంది.
Read Also- Mohammed Siraj: సిరాజ్కు ఐసీసీ బిగ్ షాక్.. భారీ జరిమానా విధింపు
విమానం డేటా రికవరీలో కీలకమైన ఈఏఎఫ్ఆర్ (ఎక్స్టెండెడ్ ఎయిర్ఫ్రేమ్ ఫ్లైట్ రికార్డర్) తీవ్రంగా దెబ్బతిన్నది. దీంతో, సాధారణ పద్ధతుల్లో డేటా రికవరీ సాధ్యం కాలేదు. ఇక విమానం కూలిని ప్రదేశంలో డ్రోన్ల సాయంతో సైట్ ఫోటోగ్రఫీ, వీడియోలు తీశారు. విమాన శకలాలను విమానాశ్రయానికి సమీపంలో భద్రపరిచారు. ఇంజిన్లకు పరీక్షలు చేసేందుకు విమానం నుంచి విడదీశారు. ఇదిలావుంచితే, ఫ్యూయల్ స్విచ్ అమర్చే ప్రదేశాన్ని ఇప్పటికే రెండు సార్లు మార్చారు. విమానంలో ఫ్యూయల్ స్విచ్ను కలిగి ఉండే భాగం ‘థ్రాటిల్ కంట్రోల్ మాడ్యూల్’ (TCM) ఎయిరిండియా 2019, 2023లో రెండు సార్లు మార్చింది. రెగ్యులర్ మెయింటెనెన్స్ చార్ట్ ప్రకారం ఈ మార్పులు చేసింది.