MLC Kavitha: నేను అగ్గిరవ్వను.. మామూలు ఆడబిడ్డను కాదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) హెచ్చరించారు. తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్న పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ లో ఆడబిడ్డలంటే ఎంతో గౌరవం ఉంటుంది.. బీసీ బిడ్డల్లో గౌరవించే అవకాశం మెండుగా ఉంటుందని తెలిపారు. జూబ్లీహిల్స్ లోని చైర్మన్ నివాసంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని ఆదివారం కలిసి ఫిర్యాదు లేఖతో పాటు తనపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలతో కూడిన పెన్ డ్రైవ్ అందజేశారు. ఆడబిడ్డలను గౌరవించే తెలంగాణలో చట్టసభలో సభ్యుడిగా ఉన్న తీన్మార్ మల్లన్న హేయమైన వ్యాఖ్యలు చేయడం దారుణమని పేర్కొన్నారు. చైర్మన్ కు ఉన్న విచక్షణ అధికారాలను ఉపయోగించి తీన్మార్ మల్లన్న సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తీన్మార్ మల్లన్న తనపై చేసిన వ్యాఖ్యలను శాసన మండలి ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేయాలని విజ్ఞప్తి చేశారు.
Also Read: Mahankali Bonalu: మహంకాళి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్
అనంతరం కవిత మీడియాతో మాట్లాడుతూ రాజకీయాల్లో మహిళలపై పురుష పదజాలం వాడడంతో రాజకీయాల్లోకి మహిళలు రావాలంటే భయపడే పరిస్థితి నెలకొందన్నారు. బీసీ రిజర్వేషన్ల అమలుకై తెలంగాణ జాగృతి పోరాటం చేస్తూనే ఉంటుందన్నారు.తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతోన్న రోజుల్లోనూ పోలీసులు, నాయకుల గన్ మెన్లు ఏ ఒక్క రోజు కాల్పులు జరిపిన దాఖలాలు లేవన్నారు. తీన్మార్ మల్లన్న తనపై చేసిన వ్యాఖ్యలపై నిరసన తెలిపేందుకు జాగృతి కార్యకర్తలు ఆయన కార్యాలయానికి వెళ్లారని తెలిపారు. వాళ్లు దాడి చేస్తేనే తమ వాళ్లు ప్రతిదాడి చేశారని.. ఇంతమాత్రానికే గన్ ఫైర్ చేస్తారా అని ప్రశ్నించారు. ఒక ఆడబిడ్డ ప్రశ్నిస్తే సహించలేకపోతున్నారా అని నిలదీశారు. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకోబోనని తేల్చిచెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులపై సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారని ఇద్దరు మహిళా జర్నలిస్టులను అరెస్టు చేశారని.. తనపై తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు చేసినా సీఎం ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. తన కుటుంబ సభ్యులపై ఒకతీరు.. తెలంగాణ ఆడబిడ్డనైన తన వ్యక్తిత్త హననానికి పాల్పడ్డ వారిపై మరోలా వ్యవహరిస్తారా అని నిలదీశారు. తీన్మార్ మల్లన్నపై సీఎం చర్యలు తీసుకోకపోతే ఈ వ్యాఖ్యలు వెనుక ఆయన ఉన్నారని భావించాల్సి వస్తుందన్నారు. జాగృతి కార్యకర్తలపై కాల్పుల ఘటనను సీరియస్ గా తీసుకోవాలన్నారు. సీఎం, డీజీపీ వెంటనే స్పందించి సమగ్ర దర్యాప్తునకు ఆదేశించాలన్నారు. ఎమ్మెల్సీనైనా తనపై చేసిన వ్యాఖ్యలనే పట్టించుకోకపోతే సాధారణ మహిళల పరిస్థితి ఏమిటన్నారు. తాను ఏడాదిన్నరగా బీసీల కోసం ఉద్యమిస్తున్నానని.. ఏ ఒక్కరోజు కూడా తాను తీన్మార్ మల్లన్నను ఒక్కమాట కూడా అనలేదన్నారు. అలాంటప్పుడు తనపై అనుచిత వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు.
Also Read: Crime News: కాలేజ్కి వెళ్లమని చెప్తే.. కానరాని లోకానికి వెళ్లిన యువకుడు
ఐజీ రమణ కుమార్ ను వినతి
తెలంగాణ జాగృతి కార్యకర్తలపై దాడి ఘటన వెనుక ప్రభుత్వ హస్తం ఉందని కవిత ఆరోపించారు. జాగృతి కార్యకర్తలపై కాల్పులు, దాడి, తన వ్యక్తిత్తాన్ని హననం చేసేలా వ్యాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకోవాలని కోరుతూ డీజీపీ ఆఫీస్ లో ఫిర్యాదు చేశారు.లా అండ్ ఆర్డర్ అడిషనల్ ఐజీ రమణ కుమార్ ను కలిసి ఫిర్యాదు అందజేశారు. జాగృతి కార్యకర్తలపై తుపాకులతో కాల్పులు జరిపించింది తీన్మార్ మల్లన్న నా? లేక ప్రభుత్వమా? అనేది తెలియాలన్నారు. సమగ్ర విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ఇంత పెద్ద ఘటనపై ఫిర్యాదు చేయడానికి వస్తే డీజీపీ ఆఫీస్ కు రాలేదు అంటే దీని వెనుక ప్రభుత్వమే ఉందన్న అనుమానం కలుగుతుందన్నారు. తీన్మార్ మల్లన్న ఆదేశాలతోనే గన్ మెన్ కాల్పులు జరిపారని.. గన్ మెన్లను వెంటనే డిస్మిస్ చేయాలని డిమాండ్ చేశారు.