Raja Singh: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్(MLA Raja Singh) కాషాయ పార్టీకి కొరకరాని కొయ్యగా మారారనే ప్రచారం ఉంది. దానికి అనుగుణంగానే ఆయన తీరు సాగింది. అయితే కొద్దిరోజుల క్రితం రాజాసింగ్ కమలం(BJP) పార్టీకి గుడ్ బై చెప్పారు. అయినా ఆయన ఎప్పుడేం బాంబు పేల్చుతారనేది ఆందోళన కమలం నేతల్లో ఉంది. ఎందుకంటే రాజాసింగ్ ఒకట్రెండు రోజుల క్రితం హస్తిన పర్యటనకు వెళ్లడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీ(Delhi) పెద్దలను ఆయన కలిసినట్లుగా ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర నాయకుల తీరుపై పార్టీ పెద్దలకు వివరించారని చెబుతున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy)తో పాటు ఒకరిద్దరు నేతలపై ఆయన ఫిర్యాదు చేశారనే ప్రచారం జోరుగా సాగుతోంది. కిషన్ రెడ్డి కారణంగానే ఆయన పార్టీకి రాజీనామా చేయాల్సి వచ్చిందని రాజాసింగ్ అనుచరులు చెబుతుండటం గమనార్హం.
రాజాసింగ్ మధ్య మాట మాట పెరిగిందా
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy), రాజాసింగ్(Raja Singh) ఇద్దరూ మహానగరానికి చెందిన నేతలే. అయినప్పటికీ ముందు నుంచే ఇరువురు నేతలదీ చెరో దారిగానే ఉండేదని చెబుతున్నారు. ఒకరంటే ఒకరికి గిట్టదనేది ప్రచారంలో ఉంది. తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికల సందర్భంగా మరోసారి ఈ ఇరువురు నేతల మధ్య వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. నామినేషన్ వేసేందుకు రాజాసింగ్ వెళ్లగా 10 మంది సంతకాలు కావాల్సిందేనని ఎన్నికల ఇన్న చార్జీ చెప్పడంతో ఆయన వెను తిరగక తప్పలేదు. ఈ సమయంలోనే కిషన్ రెడ్డి, రాజాసింగ్ మధ్య మాట మాట పెరిగిందని పలువురు చెబుతున్నారు. అందుకే రాజాసింగ్ పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రకటించారని ఆయన అనుచరులు చెబుతున్నారు. ఆయన రిజైన్ అంశం ఢిల్లీ పెద్దల వద్ద ఉందని తెలిసిందే. ఈ తరుణంలో రాజాసింగ్ హస్తన పర్యటన ఆసక్తికరంగా మారింది. ఆయన ఎందుకు వెళ్లారు? ఎవరిని కలిశారు? ఎవరి గురించైనా ఫిర్యాదు చేశారా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
Also Read: Medchal Park Site: అక్రమంగా వెంఛర్లో పార్కు స్థలం కబ్జా యత్నం
రాజాసింగ్ ఇంతకీ ఏం చెప్పారనేది సస్పెన్స్
వాస్తవానికి రాజాసింగ్ అమర్ నాథ్ యాత్ర కోసం కుటుంబ సభ్యులతో సహా బయలుదేరారు. కానీ ఆయన కుటుంబీకులను నేరుగా అక్కడికి పంపించి ఆయన మాత్రం హస్తినకు వెళ్లి ఆపై అమర్ నాథ్ కు చేరుకున్నట్లు తెలుస్తోంది. కాగా కాషాయ పార్టీ ఢిల్లీ పెద్దలకు రాజాసింగ్ ఇంతకీ ఏం చెప్పారనేది సస్పెన్స్ గా మారింది. ఎందుకంటే రాజాసింగ్ రిజైన్ చేసి 10 రోజులు దాటినా పార్టీ నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు. ఇప్పటికే ఆయనకు మహారాష్ట్రకు చెందిన పార్టీల నుంచి ఆహ్వానం అందుతోందని రాజాసింగ్ స్పష్టంచేశారు. ఈ అంశంపై హైకమాండ్ ఏం తేల్చకపోవడంతో ఆయనే నేరుగా హైకమాండ్ తో తేల్చుకునేందుకు వెళ్లారా? అనే ప్రచారం సైతం జరుగుతోంది. మరి హైకమాండ్ ఈయనకేం చెప్పింది? ఢిల్లీ పెద్దలకు ఈయనేం చెప్పారనేది సస్పెన్స్ గా మారింది. మరి ఈ సస్పెన్స్ కు ఎప్పుడు తెరపడుతుందనేది చూడాలి.
Also Read: Gadwal MRO: సామాన్యులకు రేషన్ కార్డుల తిప్పలు