Atchannaidu: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎంతలా అంటే కనీసం ఆయన ఓ పార్టీకి అధినేత, మాజీ సీఎం అని చూడకుండా పులివెందుల ఎమ్మెల్యే అంటూ సంబోదిస్తూ గాలి తీసేశారు. పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి (YS Jagan Reddy) బంగారు పాళ్యం మార్కెట్కు వెళ్ళడానికి అనుమతి ఇస్తామని.. శాంతి భద్రతలకు విఘాతం కలిగితే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదని అచ్చెన్న హెచ్చరించారు. రెండు రోజుల పాటు ఢీల్లీ పర్యటనకు వెళ్లిన అచ్చెన్నాయుడు.. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్తో ప్రత్యేక భేటీ అయ్యారు. వ్యవసాయ రంగానికి తొడ్పాటు నివ్వాలని, గత ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల కారణంగా రాష్ట్రంలో రైతాంగానికి తీవ్ర నష్టం వాటిల్లిందని కేంద్ర మంత్రికి వివరించారు. పెద్ద మనసుతో రాష్ట్రాన్నిఆదుకోవాలని, సహయ, సహకారాలు అందించాలని విన్న వించారు. మ్యాంగో పల్ప్పై విధిస్తున్న జీఎస్టీని 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించేలా కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఏపీలో దాదాపుగా 64 శాతం మంది వ్యవసాయం, వ్యవసాయం అనుబంధ రంగాలపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. అందుకు ప్రభుత్వాలు ఈ రంగానికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. కానీ గత వైకాపా ప్రభుత్వం మాత్రం ఈ వ్యవసాయ రంగాన్ని పూర్తిగా గాలికి వదిలేసింది. రాష్ట్రాన్ని ఐదేళ్ల పాటు జగన్ రెడ్డి చిన్నా భిన్నం చేశారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్యక్రమాలను కూడా వినియోగించుకోకపోవడం వల్ల రాష్ట్రంలో వ్యవసాయ రంగం కుదేలైందని ధ్వజమెత్తారు.
జగన్పై తీవ్ర వ్యాఖ్యలు
‘ చిత్తూరు మామిడి రైతుల (Mango Farmers) దగ్గర 3.5 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించాం. మామిడి ధరపై జగన్ నీచమైన రాజకీయం చేస్తున్నారు. తోతాపురి మామిడి సేకరణను కిలోకు రూ. 12/- ధరను ప్రభుత్వం నిర్ణియించింది. అందులో రూ. 8/- ప్రాసెసర్లు/వ్యాపారులు భరించాలని, అదనపు మద్దతు ధరగా రాష్ట్ర ప్రభుత్వం రూ. 4/- చెల్లిస్తుంది. దీనికి సంబంధించి మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ (MIS) కింద రూ. 130 కోట్ల కేంద్ర వాటాను విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలను సమర్పించాం. రాష్ట్రాన్ని ఐదేళ్లు జగన్ చిన్నాభిన్నం చేశారు. ఓదార్పు అని మళ్లీ బల ప్రదర్శనకు దిగుతున్నారు. చంద్రబాబు ఏడాదిలో 9 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చారు. రాష్ట్రాన్ని గాడిలో పెడుతుంటే మళ్లీ దండయాత్ర మొదలెట్టాడు. శాంతిభద్రతల సమస్య సృష్టించేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రం మీద దండయాత్ర చేస్తానంటే ఊరుకోం. అధికారం ఉందని వీర్రవీగితే ప్రజలే సమాధానం చెబుతారు. ప్రజలకు అనుగుణంగా ప్రభుత్వాలు పనిచేయాలి. ధర్నాల పేరుతో వైసీపీ నేతలు దోపిడీకి తెగబడుతున్నారు. చుట్టుపక్కల జిల్లాల నుంచి బైక్లు, కార్లు, బస్సుల్లో తరలించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. రైతులపై ప్రేమ ఉంటే నిజంగా రైతుల దగ్గరికి వెళ్ళాలి. ఇంత చేయడం అవసరమా?. రాష్ట్ర ప్రభుత్వమే రైతులను ఆదుకునేందుకు తగు చర్యలు తీసుకుంటుంది. గత ప్రఃభుత్వం వ్యవసాయ రంగాన్ని పూర్తిగా గాలికి వదిలేసింది. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు కూడా వినియోగించలేకపోయిన అసమర్ధ ముఖ్య మంత్రి గత ఐదేళ్లు రాష్ట్రాన్ని పాలించి విచ్చిన్నం చేశారు’ అని జగన్పై అచ్చెన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Read Also- Kaushik Reddy: పేదోళ్ల పొట్టకొట్టిన కౌశిక్ రెడ్డి.. లబోదిబో అంటున్న జనం!
మామిడి రైతులకు అండగా..
‘ 2019-2024 మధ్య కాలంలో తోతాపురి మామిడి ధర కిలో రూ.6 నుంచి రూ.4కు పడిపోయింది. వైసీపీ ప్రభుత్వం రైతులకు ఒక్కరూపాయి కూడా సబ్సిడీ ఇవ్వలేదు. నేడు కూటమి ప్రభుత్వం మామిడి రైతులకు అదనంగా కేజీకి రూ.4 సబ్సిడి మద్ధతు ధరను ఇచ్చి రైతులను ఆదుకుంటోంది. చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లా రైతుల నుంచి 3.5 మెట్రిక్ టన్నుల మామిడి సేకరించాం. మామిడి ధరపై జగన్ రెడ్డి నీచమైన రాజకీయం చేస్తున్నారు. మూడు వేల కోట్ల ధరల స్థిరీకరణ నిధి అని చెప్పి ఐదేళ్లలో రైతులకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేని అసమర్ధ నాయకుడు జగన్ రెడ్డి. మామిడి రైతులకు ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా రైతులను అన్ని విధాల ఆదుకుంటున్నామని ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేసేందుకే జగన్ రెడ్డి మామిడి రైతులపై దండయాత్రలు చేసేందుకు వెళుతున్నారు. గంజాయి, డ్రగ్స్, రౌడీ షీట్స్లో ఉన్న వారు జగన్ యాత్రల్లో పాల్గొంటున్నారు. చిత్తూరు జిల్లా రైతులు జగన్ను ప్రశ్నించాలి.. లేదంటే ప్రజాస్వామ్యానికి తీవ్ర నష్టం జరుగుతుంది. చంద్రబాబు నేతృత్వంలో విచ్చిన్నమైన రాష్ట్రం వికాసం వైపు పయనిస్తోంది’ అని ఢిల్లీలో అచ్చెన్న ఆనందం వ్యక్తం చేశారు.
ఏపీలో ఎరువుల కొరత లేదు
‘ ఏపీలో కొద్ది రోజులుగా ఎరువుల కొరత ఉందంటూ తప్పుడు కథనాలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఎరువులు అదనంగా నిల్వ ఉన్నాయి. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రైతులందరికి సరిపడా ఎరువులను అందచేస్తాం. ఖరీఫ్ పంటలకు అవసరమైన ఎరువులు దొరకవనే అపోహలు వద్దు. కొరత ఉందనే దుష్ప్రచారాన్ని రైతులు నమ్మొద్దు. ఎప్పటికప్పుడు సమీక్ష చేసి, అవసరం మేరకు ప్రైవేట్ డీలర్లు, సొసైటీలు, రైతుసేవా కేంద్రాల్లో ఎరువులను అందుబాటులో ఉంచుతాం. రాష్ట్రంలో మార్క్ఫెడ్, సొసైటీలు, రైతుసేవా కేంద్రాలు, డీలర్ల వద్ద 8.73లక్షల టన్నుల ఎరువుల లభ్యత ఉండగా, యూరియా 3.12లక్షల టన్నులు ఉన్నాయి. వచ్చే 3 నెలల్లో మరో 4.50లక్షల టన్నుల యూరియా రావాల్సి ఉంది. డీలర్లు కృత్రిమ కొరత సృష్టించినా, ఎమ్మార్పీ కన్నా అధికంగా అమ్మినా కఠిన చర్యలుంటాయి. ఎరువుల కొరత అంటూ వైసీపీ నేతలు చెప్పే అబద్ధపు మాటలను ఎవరు నమ్మకండి. ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం’ అని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు.
విద్యార్ధులకు శుభవార్త
తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ పరిధిలోని గరివిడిలో ఉన్న ‘కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్’లో 2022-23, 2023-24 విద్యా సంవత్సరాలకు గానూ మూడవ, నాల్గవ సంవత్సరాల బీవీఎస్సీ, ఏహెచ్ (BVSC, AH) కోర్సులు పునరుద్ధరణ గురించి అచ్చెన్నాయుడు చూపిన చొరవ వలన కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 2022 నుంచి ఈ కోర్సులకు అనుమతి లేదు. వెంటనే కేంద్ర ప్రభుత్వం స్పందించి సంబంధిత కోర్సులకు అనుమతులను పునరుద్ధరిస్తూ లేఖను విడుదల చేశారు. మంగళవారం కేంద్ర పశుసంవర్ధక పాడిపరిశ్రమ మంత్రిత్వ శాఖ మంత్రి లాలన్ సింగ్ను కలసి మరిన్ని విషయాలు చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటామని అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, శ్రీకాకుళం శాసన సభ్యులు గొండు శంకర్ తదితరులు పాల్గొన్నారు.
Read Also- Renu Desai: రెండో పెళ్లి.. మరోసారి రేణు దేశాయ్ సంచలన వ్యాఖ్యలు