Team India: సుదీర్ఘ ఫార్మాట్లో భారత క్రికెట్ జట్టు మరో సంచలన విజయాన్ని నమోదు చేసింది. గతంలో ఆస్ట్రేలియాపై గబ్బాలో సాధించిన చరిత్రాత్మక గెలుపు తర్వాత, ఈసారి ఇంగ్లాండ్ పర్యటనలోనూ యువభారత్ అద్భుతం చేసింది. అండర్సన్, టెండూల్కర్ ట్రోఫీ రెండో టెస్టుకు ఎడ్జ్బాస్టన్ మైదానం వేదిక కాగా, 58 ఏళ్లుగా కొనసాగుతున్న పరాజయాల ప్రస్థానానికి కెప్టెన్ గిల్ నేతృత్వంలోని భారత జట్టు తెరదించింది. 336 పరుగుల భారీ తేడాతో చిరస్మరణీయ విజయాన్ని సాధించింది. దీంతో 5 టెస్టుల సిరీస్ను గిల్ సేన 1 – 1తో సమం చేసింది. ఈ విజయంతో భారత్ ఐదు టెస్టుల సిరీస్లో బోణీ కొట్టింది.
చారిత్రాత్మక విజయం
ఎడ్జ్బాస్టన్లో ఇంగ్లాండ్పై టెస్ట్ మ్యాచ్ గెలిచిన తొలి ఆసియా జట్టుగా టీమిండియా చరిత్ర సృష్టించింది. పరుగుల (336) పరంగా విదేశాల్లో భారత్కు ఇదే అతి పెద్ద టెస్ట్ విజయం. అలాగే, బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్ మైదానంలో టీమిండియాకు ఇదే తొలి టెస్ట్ విజయం కావడం విశేషం. యువ కెప్టెన్ శుభ్మన్ గిల్కు ఇది టెస్ట్ కెప్టెన్గా తొలి టెస్ట్ విజయం కూడా.
గిల్ విధ్వంసక శతకాలు
ఈ విజయానికి కెప్టెన్ శుభ్మన్ గిల్ బ్యాటింగ్లో కీలక పాత్ర పోషించాడు. అతను తొలి ఇన్నింగ్స్లో డబుల్ సెంచరీ (269), రెండో ఇన్నింగ్స్లో భారీ శతకం (161) చేసి పరుగుల వరద పారించాడు. బౌలింగ్లో ఆకాశ్ దీప్, సిరాజ్ అద్భుతంగా రాణించారు. మిగతా భారత బౌలర్లలో ప్రసిద్ద్ కృష్ణ, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ తలో వికెట్ తీశారు. సెకెండ్ ఇన్నింగ్స్లోనూ టాప్ స్కోరర్గా నిలిచిన జేమీ స్మిత్ (88) డ్రా కోసం విఫలయత్నం చేశాడు. అంతకుముందు టీమిండియా 427/6 వద్ద రెండో ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. శుభమన్ గిల్ (162 బంతుల్లో 8 సిక్సులు, 13 ఫోర్లుతో 161) సెంచరీతో చెలరేగగా, రవీంద్ర జడేజా (69 నాటౌట్), రిషబ్ పంత్ (65), కేఎల్ రాహుల్ (55) హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నారు.
ఆకాశ్ అదరహో..
608 పరుగల భారీ లక్ష్య ఛేదనలో 72/3 స్కోర్ వద్ద చివరి రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్ 271 పరుగుల వద్ద ఆలౌటైంది. ఆకాశ్ దీప్ (21.2-2-99-6) నిప్పులు చెరిగే బంతులతో ఇంగ్లండ్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ఇతనికి కెరీర్లో ఇదే తొలి ఐదు వికెట్ల ఘనత. తొలి ఇన్నింగ్స్లో 4 వికెట్లు పడగొట్టిన ఆకాశ్ మొత్తంగా 10 వికెట్ల ఘనత సాధించాడు. ఈ మ్యాచ్లో బుమ్రా స్థానంలో బరిలోకి దిగిన ఆకాశ్ అద్భుతంగా రాణించాడు. టీమిండియా చారిత్రక విజయంలో కీలక భూమిక పోషించాడు. సిరాజ్ తొలి ఇన్నింగ్స్లో ఆరు వికెట్లు తీసి ఇంగ్లాండ్ పతనాన్ని శాసించాడు. ఆకాశ్ దీప్ రెండో ఇన్నింగ్స్లో ఆరు వికెట్లు దక్కించుకోవడమే కాకుండా, ఈ మ్యాచ్లో మొత్తం పది వికెట్లు (తొలి ఇన్నింగ్స్లో 4, రెండో ఇన్నింగ్స్లో 6) పడగొట్టి అరుదైన ఘనత సాధించాడు. ఇంగ్లాండ్ గడ్డపై 10 వికెట్లు తీసిన రెండో భారత బౌలర్గా రికార్డులకెక్కాడు. 1982లో చేతన్ శర్మ తొలిసారి ఈ ఘనత సాధించాడు. రవీంద్ర జడేజా, జైస్వాల్, రిషభ్ పంత్, కేఎల్ రాహుల్ అర్ధశతకాలు సాధించి జట్టుకు బలమైన స్కోరును అందించారు.
Read Also- Producer SKN: సినిమా ఇండస్ట్రీకి వచ్చే వారికి నిర్మాత ఎస్కెఎన్ హెచ్చరిక!
మ్యాచ్ స్కోరు బోర్డ్
టీమిండియా: తొలి ఇన్నింగ్స్ – 587 పరుగులు; రెండో ఇన్నింగ్స్ – 427/6 పరుగులు (డిక్లేర్డ్)
ఇంగ్లాండ్: తొలి ఇన్నింగ్స్ – 407 పరుగులు; రెండో ఇన్నింగ్స్ – 271 పరుగులు
ఇంగ్లాండ్ వేదికలపై భారత్ విజయాలు
ఓవల్: 1971 ఆగస్టు 24న తొలి విజయం.
లార్డ్స్: 1986లో గెలుపొందింది.
హెడింగ్లే: అదే ఏడాది 1986లోనూ విజయం సాధించింది.
ట్రెంట్ బ్రిడ్జ్: జహీర్ ఖాన్ విజృంభణతో 2007లో విజయం సాధించింది.
సచిన్, ధోనీ, కోహ్లీ వంటి దిగ్గజ ఆటగాళ్లు ఎంత ప్రయత్నించినా ఎడ్జ్బాస్టన్లో ఓటమే ఎదురైనప్పటికీ, గిల్ నేతృత్వంలోని యువభారత్ జట్టు బెన్ స్టోక్స్ “బజ్ బాల్” ఆటను చిత్తుగా ఓడించి చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్లో భారత్-ఇంగ్లాండ్ మధ్య అత్యధిక (1692) పరుగులు నమోదైన మ్యాచుగా కూడా రికార్డ్ నమోదైంది.
Read Also- Personal Finance: పెళ్లికి డబ్బులు కావాలా.. ఇలా చేయండి తిరుగుండదు!