Allu Aravind: ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్.. ఈడీ (Enforcement Directorate) విచారణకు హాజరుకావడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఎప్పుడు ఏ కేసును ఎదుర్కోని ఆయన్ను ఈడీ అధికారులు.. 3 గంటల పాటు సుదీర్ఘంగా విచారించడం.. అటు చిత్ర పరిశ్రమతో పాటు తెలుగు ప్రజల్లోనూ తీవ్ర చర్చకు దారి తీసింది. ఓ బ్యాంక్ కు సంభంచిన స్కామ్ లో ఆయన్ను ఈడీ అధికారులు విచారించినట్లు తెలుస్తోంది. రూ.101 కోట్ల బ్యాంకు రుణం మోసానికి సంబంధించి ఆయన్ను ఈడీ ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
కేసు వివరాలు
2017-19 మధ్యకాలంలో హైదరాబాద్కు చెందిన రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ (Ramakrishna Electronics), రామకృష్ణ టెలిట్రానిక్స్ (Ramakrishna Teletronics) సంస్థలు.. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Union Bank Of India) నుంచి రూ.101 కోట్ల రుణం తీసుకున్నాయి. ఈ సంస్థలు రుణాన్ని తిరిగి చెల్లించకపోవడంతో వాటి డైరెక్టర్లు వి. రాఘవేంద్రరావు, వి. రవి కుమార్ తదితరులపై బెంగళూరులో సీబీఐ కేసు నమోదు చేసింది. ఆ తర్వాత ఈడీ ఈ కేసు దర్యాప్తు చేపట్టింది.
అల్లు అరవింద్తో సంబంధం
విచారణలో భాగంగా రామకృష్ణ ఎలక్ట్రానిక్స్, రామకృష్ణ టెలిట్రానిక్స్ లకు సంబంధించిన కార్యాలయాలు, సంస్థ డైరెక్టర్లు అయిన వి. రాఘవేంద్రరావు, వి. రవి కుమార్ ఇళ్లల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. తద్వారా ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన విలువైన పత్రాలను స్వాధీనం చేసుకుంది. వాటిని పరిశీలిస్తున్న క్రమంలో అల్లు అరవింద్ పేరు కూడా తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది. రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ సంస్థతో అల్లు అరవింద్కు చెందిన సంస్థల మధ్య అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు.
Also Read: CM Revanth: పదవులను లైట్ తీసుకోవద్దు.. కష్టపడితేనే గుర్తింపు.. సీఎం పవర్ఫుల్ స్పీచ్!
వాటిపై ప్రశ్నల వర్షం!
రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ తో చేసిన లావాదేవీలపై స్పష్టత కోసం ఈడీ అల్లు అరవింద్కు నోటీసులు జారీ చేసింది. ఇందులో భాగంగా ఈడీ కార్యాలయంలో ఆయన్ను సుమారు మూడు గంటల పాటు అధికారులు ప్రశ్నించారు. 2018-19 సంవత్సరాల్లో జరిగిన బ్యాంకు లావాదేవీలు, ఆస్తుల కొనుగోళ్లపై అధికారులు ప్రశ్నలు వేసినట్లు సమాచారం. ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్న ఈడీ.. వచ్చేవారం మరోసారి విచారణకు రావాల్సి ఉంటుందని అల్లు అరవింద్ కు సూచించింది. అయితే అల్లు అరవింద్ కు యూనియన్ బ్యాంక్ స్కామ్ లో నేరుగా ప్రమేయం ఉందా? లేదా? అన్న విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.