Vallabhaneni: హెడ్డింగ్ చూడగానే కాస్త విచిత్రంగా.. అంతకుమించి నమ్మశక్యంగా లేదు కదా? అవును మీరు వింటున్నది నిజమే. ఇదేంట్రా బాబోయ్.. అధికారంలో లేదు పైగా పట్టుమని 11 సీట్లుంటే మంత్రి పదవి ఎలా వస్తుంది? అనే కదా మీ డౌట్.. మీ సందేహాలపై క్లారిటీ రావాలంటే ఆలస్యంగా చేయకుండా ఈ కథనం చదివేయండి మరి. వైసీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ (Vallabhaneni Vamsi Mohan) జైలు నుంచి రిలీజ్ అయిన మరుసటి రోజే.. ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో (YS Jagan Mohan Reddy) భేటీ అయ్యారు. గురువారం ఉదయం తన సతీమణి పంకజ శ్రీతో (Pankaja Sri) కలిసి తాడేపల్లి ప్యాలెస్కు వెళ్లిన వంశీ సుమారు అరగంటపాటు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఇటీవల జైలులో జరిగిన కొన్ని పరిణామాలు ఇద్దరి మధ్య ప్రస్తావనకు వచ్చినట్లుగా తెలుస్తున్నది. ఈ క్రమంలోనే జగన్కు వంశీ కృతజ్ఞతలు తెలిపారు. కష్టకాలంలో తనకు అన్నివిధాలుగా అండగా నిలిచినందుకు అధినేతకు వారు ధన్యవాదాలు తెలిపారు. కాగా, కూటమి ప్రభుత్వం వల్లభనేనిపై 11 అక్రమ కేసులు నమోదు చేసినట్లుగా వైసీపీ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 16న ఏపీ పోలీసులు వల్లభనేనిని ఆంధ్రా పోలీసులు హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. నాటి నుంచి 140 రోజుల పాటు జైలులో ఉన్నారు. అయితే, వల్లభనేనికి ఇప్పటి వరకూ నమోదైన అన్ని కేసుల్లో బెయిల్ రాగా, మంగళవారం నాడు ఇళ్ల పట్టాల కేసులో నూజివీడు కోర్టు బెయిల్ మంజూరైంది. దీంతో విజయవాడ సబ్ జైల్ నుంచి జూలై 2న వంశీ విడుదలయ్యారు.
Read Also- Vallabhaneni Vamsi: ఎట్టకేలకు వల్లభనేని వంశీ విడుదల.. ఇక రాజకీయ సన్యాసమేనా?
ఫిక్స్ చేసిన జగన్!
ఈ భేటీలో భాగంగా కష్టకాలంలో తనకు తన కుటుంబానికి అండగా నిలిచినందుకు జగన్కు వంశీ కృతజ్ఞతలు తెలియజేశారు. వంశీ ఆరోగ్య పరిస్థితి గురించి జగన్ ఆరా తీసి, ధైర్యం చెప్పారు. పార్టీ తరఫున తిరిగి చురుకుగా ఉండాలని జగన్ వంశీకి సూచించినట్లు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. ‘ నువ్వు ఎవరివల్ల అయితే ఇంతలా బాధపడ్డావో? జైలుకెళ్లి రావాల్సి వచ్చిందో..? రేపొద్దున్న వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతకుమించి తిరిగిచ్చేద్దాం.. పక్కాగా మంత్రి పదవి ఇస్తాను. ఇక నియోజకవర్గంలో ఏం చేయాలి? అనేది నువ్వు చూసుకో.. నీ గెలుపు, పదవుల సంగతి నేను చూసుకుంటాను’ అని వంశీకి జగన్ మాటిచ్చినట్లుగా తెలిసింది. ఇదంతా ఇన్సైడ్ టాక్గా నడిచింది. ఇందుకు చిరునవ్వు నవ్విన వంశీ అలాగే అన్నా అని చెప్పినట్లుగా సమాచారం. మొత్తానికి చూస్తే.. అధినేత చెప్పాల్సింది.. చెప్పేశారు అయితే వంశీ డిసైడ్ చేసుకోవాల్సింది. అయితే వంశీ మళ్లీ క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తారా? లేకుంటే సైలెంట్ అవుతారా అన్నది తెలియాల్సి ఉంది. మరోవైపు నిండా మునిగాక ఇంకేముంది? జరగాల్సింది జరిగిపోయింది గనుక ఇక తగ్గేదేలే అంటూ ముందుకెళ్లడమే తప్ప.. వెనకడుగు వేసే ప్రసక్తే లేదని అభిమానులు, అనుచరులు చెప్పుకుంటున్నారు. అయితే కొన్ని రోజులు విశ్రాంతి తీసుకొని ఆ తర్వాత రంగంలోకి దిగుతారనే చర్చ జరుగుతోంది.
ఎందుకంటే..
వంశీ వైసీపీలో తప్పకుండా కీలక పాత్ర పోషించే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే.. ఇటీవల సుదీర్ఘ కాలం జైలులో గడిపి విడుదలైన తర్వాత వైఎస్ జగన్ను కలవడమే దీనికి ప్రధాన సూచిక అని చెప్పుకోవచ్చు. ఈ భేటీలో జరిగిన చర్చలు, అలాగే వైసీపీ నాయకులు వంశీకి మద్దతుగా చేసిన వ్యాఖ్యలు ఈ అంచనాలకు బలం చేకూరుస్తున్నాయి. జైలు నుంచి విడుదలైన వెంటనే జగన్ను కలవడం, తన కష్టకాలంలో అండగా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలపడం.. వల్లభనేని వంశీ పార్టీ విధేయతను, జగన్ నాయకత్వంపై ఆయనకు ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తుంది. పార్టీతో ఆయన అనుబంధం చెక్కుచెదరలేదనే విషయం తద్వారా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. దీనికి తోడు వంశీ ఆరోగ్యం గురించి జగన్ ఆరా తీసి, ధైర్యం చెప్పడం, పార్టీ తరఫున తిరిగి చురుకుగా ఉండాలని సూచించడం ద్వారా జగన్ ఆయనకు మద్దతుగా ఉన్నారని తెలుస్తుంది. ఇది వంశీకి పార్టీలో భవిష్యత్తు ఉంటుందనే సంకేతాన్ని ఇస్తుంది. ఎందుకంటే.. వంశీపై అనేక కేసులు నమోదు చేసి, దాదాపు 140 రోజులు జైల్లో ఉంచినప్పటికీ, వైసీపీ నాయకత్వం ఆయనకు అండగా నిలబడింది. ఇదంతా ఆయనకు పార్టీ ఎంతగా విలువ ఇస్తుందో తెలియజేస్తుంది. కాగా, వల్లభనేనికి గన్నవరం నియోజకవర్గంలో మంచి పట్టు ఉందన్న విషయం జగమెరిగిన సత్యమే. వైసీపీ ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నందున, వంశీకి పార్టీలో సంస్థాగత పదవి లభించే అవకాశం ఉంది. లేదా వచ్చే ఎన్నికల నాటికి గన్నవరం నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయడానికి కీలక బాధ్యతలు అప్పగించే ఛాన్స్ ఉంది. మరీ ముఖ్యంగా కేసుల వ్యవహారం, ఈ కేసుల్లో ఎదురైన అనుభవం ఆయనకు పార్టీలో మరింత ప్రాధాన్యతను తెచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మొత్తంగా.. వల్లభనేని వంశీ వైసీపీలో తిరిగి చురుకైన, కీలకమైన పాత్ర పోషించడం దాదాపు ఖాయమే.
Read Also- Hari Hara Veera Mallu: ఒక్కటే మాట.. ‘హరి హర వీరమల్లు’ ట్రైలర్ ఎలా ఉందంటే!